తిరుమల : శ్రీవారి లడ్డూ ప్రసాదం తప్పనిసరిగా 160-180 గ్రాముల బరువు ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ప్రతి రోజూ పోటు కార్మికులు తయారు చేసిన లడ్డూ ప్రసాదాలను ఒక ప్రత్యేక ట్రేలో ఉంచి, ప్రతి ట్రే బరువును పోటు అధికారులు తనిఖీ చేస్తారని, అనంతరం లడ్డూ ప్రసాదాలను కౌంటర్లకు తరలించి, భక్తులకు అందిస్తారని.. ఇందులో పూర్తి పారదర్శకత ఉంటుందని చెప్పింది. ఓ భక్తుడు కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డు 90-110 గ్రాములు ఉండగా.. దీంతో భక్తుడు లడ్డూ కౌంటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.
ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. వేయింగ్ మిషన్లో సాంకేతిక సమస్య కారణంగా మైనస్ 70 అని ఉండడం, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం కారణంగా లడ్డూ బరువుపై భక్తులు అపోహలకు గురయ్యారని, లడ్డూ బరువు కచ్చితంగా 160 నుంచి 180 గ్రాములు ఉంటుందని తెలిపింది. కొన్ని వందల సంవత్సరాలుగా అత్యంత భక్తి శ్రద్ధలతో లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారని, అలాగే లడ్డూ బరువు, నాణ్యత విషయంలో టీటీడీ ఏనాడు రాజీ పడలేదని స్పష్టం చేసింది.
సాధారణంగా లడ్డూ కౌంటర్ల వద్ద ఏదైనా ఇబ్బంది తలెత్తితే వేంటనే అక్కడ అందుబాటులో ఉన్న లడ్డూ కౌంటర్ అధికారికి తెలిపితే.. అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే వ్యవస్థ టీటీడీలో ఉందని పేర్కొంది. కానీ సదరు భక్తుడు ఇవిఏమి చేయకుండా సోషల్ మీడియాలో టీటీడీపై ఇలాంటి ఆరోపణలు చేయడం శోచనీయమని పేర్కొంది. సదరు భక్తుడు ఆరోపించినట్లు లడ్డూ పరిమాణం, బరువులో ఎలాంటి వ్యత్యాసం లేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఇలాంటి అపోహలను భక్తులు నమ్మవద్దని టీటీడీ కోరింది.