TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను చెప్పింది. ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు అంగ ప్రదిక్షణ టోకెన్ల జారీని నిలిపివేసినట్లు తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది. ఇదిలా ఉండగా.. శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతున్నది. నిన్న ఒకే రోజు 72,998 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24,852 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీల ద్వారా రూ.4.51కోట్ల ఆదాయం సమకూరింది.