తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం రెండు రోజుల పాటు మూతపడనుంది. అక్టోబర్ 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం ఉన్నాయి. దీంతో ఆయా రోజుల్లో శ్రీవారి ఆలయాన్ని 12 గంటలపాటు మూసివేయనున్నారు.
అక్టోబర్ 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. దీంతో ఆ రోజు ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ సందర్భంగా అన్ని దర్శనాలతోపాటు ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రద్దు చేసింది. ఆ రోజు సర్వదర్శనం భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు.
ఇక నవంబర్ 8న మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీంతో ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. అందువల్ల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తగిన ప్రణాళిక ప్రకారం రావాలని అధికారులు సూచించారు.