ఈ ఏడాది అధికంగా వచ్చిన శ్రావణం.. అసలు సందడి నిజ మాసంతో మొదలు కానుంది. వర్ష రుతువుకు స్వాగతం పలుకుతూ, ఊరూరా హర్షాతిరేకాలు ప్రకటిస్తూ ఇంటింటికీ శ్రావణ సౌభాగ్యం నిజరూపంగా వచ్చింది. ‘యస్య శ్రవణ మాత్రేణ సిద్ధిదః శ్రావణోప్యతః’ మిగతా నెలల్లో అనుష్ఠానం చేస్తే ఫలితం కలుగుతుంది. కానీ, శ్రావణంలో శివుడి ప్రాశస్త్యాన్ని శ్రవణం (వినడం)తోనే సకల కార్యాలూ నెరవేరుతాయని చెబుతుంది స్కాంద పురాణం. అందుకే
స్కాంద పురాణంలో శ్రావణ వైభవాన్ని పరమేశ్వరుడు స్వయంగా ప్రకటించాడు. ‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమార మహర్షికి చెబుతాడు పరమేశ్వరుడు. మహర్షి కోరిక మేరకు శ్రావణమాస మాహాత్మ్యాన్ని 24 అధ్యాయాలలో వివరించాడు పరమ శివుడు. తన స్వరూపమైన శ్రావణ శోభను చూసి తరించేందుకు నాలుగు ముఖాలతో బ్రహ్మ, వెయ్యి కండ్లతో ఇంద్రుడు సిద్ధంగా ఉంటారని శివుడు పేర్కొన్నాడు. అంతేకాదు, ఆదిశేషుడు వెయ్యి నాలుకలతో మహేశ్వరుడి గొప్పదనాన్ని శ్లాఘిస్తూ ఉంటాడట.
శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. ప్రతి వారమూ పవిత్రమైందే. అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు ఈ నెలలో. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, శ్రావణ మాస వ్రతం, శివ వ్రతం, జీవంతికాదేవి వ్రతం, నారసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం.. ఇలా వివిధ తిథి, వారాల్లో నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది. ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతనే! శ్రావణం విశిష్టతను, వ్రతాల గురించి వివరించిన శివుడు ‘ఈ మాసం గురించి నేను గొప్పలు చెప్పడం లేదు. ‘అర్థవాదోన చాత్రహి’ ఈ విషయాలన్నీ సత్యాలే’ అని పేర్కొన్నాడు. అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటారు.
వేదాలు శ్రావణాన్ని నభో మాసమని పేర్కొన్నాయి. నభస్ అంటే ఆకాశమని అర్థం. వర్షాలు విశేషంగా కురిసే మాసం కావడంతో దీనిని ‘నభో మాసం’గా పిలిచారు పెద్దలు. అధిక వర్షం వల్ల ప్రకృతిలోని పంచభూత శక్తులు ప్రబలంగా మారుతాయి. కొన్ని సందర్భాల్లో ఇవి విపరీత పరిస్థితులూ కల్పిస్తుంటాయి. ఈ సమయంలో శరీరంలో రోగ నిరోధకశక్తీ కుంటుపడుతుంది. ఫలితంగా అంటురోగాలు విజృంభిస్తుంటాయి. అందుకే, ప్రకృతిలో వచ్చే వేర్వేరు మార్పులకు అనుగుణంగా, మన శరీరాన్ని మార్చుకునే దిశగా పలు మార్గాలు సూచించారు మన పెద్దలు. అందులో భాగంగా నిర్దేశించినవే వ్రతాలు.
కొత్తగా పెండ్లి అయిన ఆడపిల్లలు మొదటి ఐదేండ్లపాటు శ్రావణ మాసం మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. సర్వమంగళ స్వరూపం ప్రకృతి శక్తిని ఆరాధించే విధానం మంగళగౌరి వ్రతం. వివాహం తర్వాత స్త్రీల శారీరక ప్రకృతులలో వచ్చే మార్పులను సమన్వయం చేసుకోవడానికి ఈ వ్రతం ఒక అవకాశం. వైవాహిక బంధం పవిత్రమై, శాశ్వతం కావడానికి ఈ వ్రతం తోడ్పడుతుంది. అంతేకాకుండా, సంతాన శక్తిని పెంచుతుంది. శ్రావణం ప్రతి శుక్రవారం ఇంటింటా మహిళలు వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. పురాణాల ఆధారంగా లక్ష్మీదేవి శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం భృగుమహర్షి ఇంట జన్మించిందని చెబుతారు. ఈ కారణంగా ఆ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఘనంగా చేసుకుంటారు. అయితే, ఈ నెలలో అన్ని శుక్రవారాల్లోనూ వ్రతం ఆచరించే సంప్రదాయం ఉంది.
…? టి.వి.ఫణీంద్రకుమార్