దండన అంటే అపరాధికి వేసే శిక్ష. మరి దాన్ని ఉత్సవంగా జరుపుకొనే సంప్రదాయమూ ఉంది. బ్రహ్మ-మధ్వ-గౌడీయ సంప్రదాయాన్ని అనుసరించే వారంతా దండన మహోత్సవాన్ని కన్నులపండువగా చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ తత్తాన్ని ప్రచారం చేస్తున్న హరేకృష్ణ మూమెంట్ ఈ వేడుకను పానిహటి చిడా-దహి దండన-మహోత్సవంగా నిర్వహిస్తున్నది. సుమారు 500 ఏండ్ల కిందట (క్రీ.శ. 1516) పశ్చిమ్ బెంగాల్లోని పానిహటి ప్రాంతంలో శ్రీ చైతన్య మహాప్రభువుల కాలంలో ఈ వేడుక నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా భక్తులకు అటుకులు (చిడా) పెరుగు (దహీ) కలిపి తయారుచేసిన మధుర పదార్థాలను అందరికీ పంచారు. ఈ ఉత్సవాన్ని నిర్వహించడం వెనుక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది.
బ్రహ్మ-మధ్వ-గౌడీయ సంప్రదాయంలో కృష్ణ నామ సంకీర్తన మార్గాన్ని విశేషంగా ప్రచారం చేసిన మహాభాగవతులైన ఆచార్యులెందరో ఉన్నారు. వీరందరిలో షడ్గోస్వాములుగా పేరొందిన ఆరుగురు గోస్వాములు బృందావనంలో ఉండేవారు. అత్యంత ఆకర్షణీయమైన లౌకిక భోగాలన్నిటినీ వీధిలోని గులకరాళ్లలా పరిత్యజించిన పరమహంస భక్తశిఖామణులు వీరు. బృందావనంలో లుప్తమైపోయిన అనేకానేక పవిత్ర స్థలాలను వెలికితీసి, కృష్ణ తత్త్వాన్ని అద్భుతమైన తమ రచనలతో లోకానికి అందించిన మహనీయులు. వీరిలో ఒకరు శ్రీల రఘునాథ దాస గోస్వామి. ఆయనే ఈ దండన ఉత్సవానికి మూలకారకుడు.
అత్యంత సంపన్నులైన జమీందారు కుటుంబంలో పుట్టారు రఘునాథదాసు. చిన్నప్పటి నుంచి ఆయనకు శ్రీచైతన్య మహాప్రభువన్నా, శ్రీకృష్ణుడన్నా అమితమైన ఆసక్తి. గొప్ప సంపదలు ఉన్నప్పటికీ, వాటిపై ఆసక్తి మాత్రం ఉండేది కాదు. చిన్నతనంలో రఘునాథుడు ఒకసారి నామాచార్యులైన శ్రీ హరిదాస ఠాకూర్ మహాశయులను కలుసుకున్నారు. ఆధ్యాత్మిక పథంలో అడుగులు వేశారు. సాధు మహాత్ముల ఆశీర్వచనాలు భగవంతుడి సాక్షాత్కారానికి సోపానాలు అవుతాయి. అలా కొంతకాలానికి శ్రీ చైతన్య మహాప్రభువు సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత శాంతిపూర్ గ్రామంలో రఘునాథదాసు ఆయన్ను దర్శించుకున్నారు. ఆ క్షణమే తన సర్వస్వాన్నీ మహాప్రభువుల సేవకే అంకితం చేయాలనుకున్నారు. కొన్నాళ్లకు జగన్నాథపురిలోని చైతన్య మహాప్రభువును ఆశ్రయించాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు.
ఇదిలా ఉండగా, ఒకనాడు రఘునాథదాసు మదిలో ఒక ఆలోచన మెదిలింది. తాను ముందుగా శ్రీ నిత్యానంద ప్రభువు అనుగ్రహం పొందగలిగితే, శ్రీ చైతన్య మహాప్రభువును చేరే మార్గం సుగమం అవుతుందనుకున్నారు. గౌడీయ పరంపరలో శ్రీ నిత్యానంద ప్రభువు ఆదిగురు తత్త్వానికి నిదర్శనం. గురువు కృపతోనే జీవుడు భగవంతుడి సన్నిధానాన్ని చేరగలడని సకల వేదాలూ వివరిస్తున్నాయి! గురువు ఆశీస్సుల కోసం పానిహటి గ్రామానికి వెళ్లారు రఘునాథదాసు. అల్లంత దూరం నుంచి నిత్యానంద ప్రభువును దర్శించుకున్నారు. అయితే, ముందుగా గురువును ఆశ్రయించనందుకు గానూ, నిత్యానందుల వారు రఘునాథదాసును మందలిస్తూ ‘దొంగలా దూరంగా దాక్కున్న నీకు నేను దండన విధిస్తున్నాను. ఇక్కడి భక్తులందరికీ వెంటనే అటుకులు, పెరుగుతో తయారుచేసిన మధుర పదార్థాలను అందించు’ అని ఆదేశించారు. ఆ మాటలకు ఎంతో సంతోషించిన రఘునాథదాసు రుచికరమైన చిడా-దహి (అటుకులు, పెరుగు) వంటకాలతో గొప్ప ఉత్సవాన్నే ఏర్పాటుచేశారు.
ఇదే తన భక్తుడికి భగవంతుడు వేసిన తీపి దండన! రఘునాథదాసు భక్తి భావానికి శ్రీ నిత్యానందులు అత్యంత ప్రసన్నులు అయ్యారు. ఆయన అనుగ్రహం పొందిన రఘునాథుడు తర్వాతి కాలంలో చైతన్య మహాప్రభువుల సంకీర్తన ఉద్యమ ప్రచారంలో ప్రథములై గోస్వామి స్థాయిని చేరగలిగారు. ఆనాటి ఆ తీపి దండనకు గుర్తుగా చిడా-దహి మహోత్సవం ఏటా జూన్ నెలలో నిర్వహిస్తుంటారు.
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ
93969 56984