అరుణాచలంలోని ఆశ్రమంలో రమణ మహర్షిని సందర్శించుకునేందుకు స్వదేశీయులే కాకుండా విదేశీయులు కూడా ఎందరో వచ్చేవారు. అయితే స్థానిక భక్తులు, సిబ్బంది ఆచారాల పేరుతో తమ వద్దకు వచ్చే విదేశీ శిష్యులకు కఠిన నిబంధనలు పెట్టేవారు. కానీ, ఇవి రమణుల దృష్టికి వచ్చినప్పుడు సహించలేకపోయేవారు. ఇక్కడి ఆచారాలు తెలియక పరదేశీయులు చేసే చిన్నచిన్న పొరపాట్లను మహర్షి పెద్దమనసుతో మన్నించేవారు.
ఒకసారి అమెరికా భక్తురాలు రమణులను దర్శించుకునేందుకు అరుణాచలం వచ్చారు. భారతీయ ఆచారాలు, సంప్రదాయాలు అంతగా తెలియని ఆ మహిళకు కుర్చీలో తప్ప కింద కూర్చునే అలవాటు లేదు. అయినా, ఇబ్బందిపడుతూనే రమణుల సమక్షంలో కింద కూర్చునేవారు. కానీ, కాళ్లు మడుచుకోవడం తెలియక, మహర్షి ఆసీనులయ్యే సోఫా వైపునకు కాళ్లు చాచారు. ఇంతలో ఆశ్రమ సిబ్బందిలో ఒకరు ఆ భక్తురాలితో ‘అమ్మా! మహర్షి ముందు కాళ్లు చాపి కూర్చుంటారా? ముడుచుకోండి!’ అన్నారు. ఇబ్బంది పడుతూనే ఆ పాశ్చాత్య మహిళ కాళ్లు ముడుచుకుంది. ఆమె అసౌకర్యానికి గురికావటం రమణులు గమనించి, ‘పాపం! వాళ్లు కింద కూర్చోవడానికే కష్టపడుతుంటే, పైగా కాళ్లు ముడుచుకోవాలా? వాళ్లకది చాలా కష్టం. అందుకే, చాలా మందికి నా దగ్గరికి రావాలని మనసులో ఉన్నా, రాకుండా ఊరుకుంటున్నారు. అభ్యాసం లేనిదే కింద కూర్చోలేరు. ఏం చేస్తాం? నియమాల పేరుతో భక్తులను కష్టపెట్టకూడదు. మనమే సర్దుకుపోవాలి’ అన్నారు మహర్షి. కాని, ఆ ఆశ్రమభక్తుడు ‘అలా కాదు! ఇక్కడి మర్యాద వాళ్లకు తెలియదని చెప్పాను’ అన్నాడు.
అప్పుడు రమణులు ‘ఓహెూ! అయితే వాళ్ల వైపు కాళ్లు చాపి కూర్చోవటం నాకూ మర్యాద కాదు. ఆ మాట నాకూ వర్తిస్తుంది కదా!’ అని మహర్షి వెంటనే కాళ్లు ముడుచుకొని, ఆ రోజంతా అలాగే ఉన్నారు. పది నిమిషాలు అలా కాళ్లు ముడుచుకుంటేనే, కీళ్లు నొప్పులవుతాయి. మళ్లీ అరగంట మర్దన చేస్తే కానీ ఆ పట్లు విడవవు. ఆ అనుభవంతో ఆ రోజు సాయంత్రం భక్తులంతా ప్రాధేయపడితే అప్పుడు రమణులు కాళ్లు చాపారు.
ఆ సాయంత్రం మహర్షి సందర్భోచితంగా అవ్వయ్యార్ అనే శివభక్తురాలి కథ చెప్పారు. అవ్వయ్యార్ అనే వృద్ధురాలి భక్తికి మెచ్చి గణపతి ఆమెను సశరీరంగా కైలాసానికి తీసుకెళ్తాడు. అవ్వ చాలా వృద్ధురాలు కావటంతో కాళ్లు మడిచి కూర్చోలేక, శంకరుడి ముందు కాళ్లు చాపి కూర్చుంటుంది. పరమేశ్వరుడి పక్కనే ఉన్న పార్వతీదేవికి ఆ అవ్వ వైఖరి చూసి మనసు చివుక్కుమంటుంది. ‘అలా కూర్చోవటం అపరాధం కదా!’ అన్న భావనతో ఆమెను ఒకసారి చూడమని శివుణ్ని అడుగుతుంది. ‘అమ్మో! ఆమె పరమ భక్తురాలు. ఆమెనేమీ అనకూడదు’ అని శివుడు సంశయించాడు. అయినా పరమేశ్వరి ఆ అమర్యాదను ఎలా సహిస్తుంది! అందుకే తన చెలికత్తెకు చెప్పి చూసింది.
పార్వతీదేవి సఖి ఆ వృద్ధురాలిని సమీపించి ‘అవ్వా! కాళ్లు ఈశ్వరుని వైపునకు పెట్టకు’ అంటుంది. అప్పుడు ఆ వృద్ధభక్తురాలు ‘అలాగా! అమ్మా! ఈశ్వరుడు లేని చోటెక్కడో చెప్పు. కాళ్లు అటువైపు పెట్టుకుంటాను’ అని కాళ్లను పక్కకు తిప్పుకొంది. వెంటనే పరమేశ్వరుడు ఆ వైపునకు తిరిగాడు. అది చూసి ఆ అవ్వ పాదాలను మరోవైపు తిప్పుకొంది. మళ్లీ శంకరుడు ఆ దిశకు తిరిగాడు. అలా ఆమె ఎటు కాళ్లు మళ్లిస్తే, పరహేశ్వరుడు అటు మళ్లాల్సి వచ్చింది. అలా ప్రయాసపడుతూ ఈశ్వరుడు పార్వతి వైపు చూసి ‘నేను చెబితే విన్నావు కాదు! ఆమె నన్ను ఎలా తిప్పుతున్నదో చూడు. నేను భక్తుల వశమేనని నీకు తెలుసు కదా!’ అన్నాడు. అప్పుడు పార్వతి ‘అవ్వా! క్షమించు’ అని ఆమెను వేడుకుంది. శివభక్తుల జీవితాలతో కూడిన ‘పెరియపురాణం’లోని ఈ కథను చెబుతూ రమణ మహర్షి ‘శివుడు లేని చోటు ఈ విశ్వంలో ఎక్కడైనా ఉందా! అయినా ఆచారాలు, సంప్రదాయాల పేరుతో చాదస్తాలకు పోకూడదు. ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు’ అన్నారు.
– మనోజ్ఞ