పదవీ విరమణ పొందిన ఒక న్యాయమూర్తి ఒక ఆశ్రమంలోని గురువును కలిశాడు. తన భార్య ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూ ఉంటుందని, ఆమె పోరు పడలేకపోతున్నానని బాధగా చెప్పాడు. అందుకు గురువు చిన్నగా నవ్వి ‘మీరు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఏం చేసేవారో గుర్తుకు తెచ్చుకోండి?’ అన్నాడు.
‘న్యాయం కోసం వచ్చే ఇరుపక్షాల వాదనలు వినేవాడిని. న్యాయవాదుల వాదప్రతివాదాలు కూడా వినేవాడిని’ అని బదులిచ్చాడు న్యాయమూర్తి. వెంటనే గురువు ‘మీరు ఎంతో ఓపికగా, వారు చెప్పేవన్నీ వినేవారు కదా. అదేపని ఇంట్లో ఎందుకు చేయడం లేదో ఆలోచించండి?’ అన్నాడు. ‘ఇంటి పనులు చేసిచేసి గృహిణులు ఎంతో ఒత్తిడిలో ఉంటారు. అవకాశం దొరికితే చాలా విషయాలను భర్తతో పంచుకోవాలని చూస్తారు. కాబట్టి భర్త ఓపిక చేసుకుని వారు చెప్పేది పూర్తిగా వినాలి. దానివల్ల సగం సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. అవి చిన్న విషయాలైనా, వారు చెబుతున్నంత సేపూ ఆసక్తిగా వినాలి. దాంతో వారి ఒత్తిడి చాలావరకు తగ్గి నూతన ఉత్తేజాన్ని పొందుతారు. అంతే కాదు, బయట తిరిగే మగవారికి తమ ఒత్తిడి తగ్గించుకోవడానికి అనేక అవకాశాలు ఉంటాయి. అదే గృహిణులకు ఉన్న ఒకేఒక కిటికీ భర్త. ఆ కిటికీ ద్వారా వారు తమ ఒత్తిడిని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తారు. కాబట్టి మనం ఆ కిటికీని ఎప్పుడూ తెరిచే ఉంచాలి.
మూసేయొద్దు’ అని సలహా ఇచ్చాడు గురువు. ‘నిజమే… నేను బయటికి వెళ్లి ఎంతో పెద్ద ప్రపంచాన్ని చూస్తాను. కానీ నా భార్యకు నేనే ప్రపంచం కదా!’ అనుకుంటూ న్యాయమూర్తి ఇంటివైపు నడిచాడు. రెండు నెలల తర్వాత న్యాయమూర్తి దంపతులు ఆశ్రమానికి వచ్చి గురువు ఆశీర్వాదం తీసుకున్నారు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు 9393662821