విజయనగర సామ్రాజ్య రాజధాని హంపిలో కొన్ని ఆంజనేయ విగ్రహాలు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఈ విగ్రహాల్లో కుడి చేయి బాగా పైకి ఎత్తి ఎవరినో కొడుతున్నట్లుగా, ఎడమ చేతిలో తాటిపండ్ల గెల పట్టుకున్నట్లుగా మలిచి ఉంటాయి. ఈ భంగిమలో ఉన్న హనుమంతుణ్ని ‘తమచ హనుమాన్’ అని పిలుస్తారు. దీని వెనక ఒక కథ ప్రచారంలో ఉంది.
అన్న వాలి భయానికి సుగ్రీవుడు తన మంత్రి హనుమంతుడు, ఇతర అనుచరులతో రుష్యమూక పర్వతం మీద రోజులు వెళ్లదీస్తుంటాడు. ఆ పర్వతం మీద అడుగుపెడితే మరణం తప్పదని వాలికి మతంగ మహర్షి శాపం ఉంటుంది. అందుకే సుగ్రీవుడు రుష్యమూకాన్ని ఆశ్రయిస్తాడు. తాను ఆ గిరి మీద అడుగు పెట్టలేడు కాబట్టి, వాలి గాలిలో ఎగురుతూనే సుగ్రీవుణ్ని తన్నుతూ ఉండేవాడు. రోజూ ఇలా జరుగుతుండటాన్ని హనుమంతుడు గమనిస్తాడు. వాలి ఆగడాలను అడ్డుకోవాలని అనుకుంటాడు. ఓసారి ఎప్పట్లానే సుగ్రీవుణ్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చిన వాలి కాలును హనుమంతుడు పట్టుకుంటాడు. కిందికి లాగుతూ రుష్యమూకం మీద పడేస్తానని బెదిరిస్తాడు. దాంతో వాలి మరోసారి ఇలా చేయనని, విడిచిపెట్టమని వేడుకుంటాడు. అప్పుడు ఒక్క చెంపదెబ్బ వేసి, ఇకనుంచి సుగ్రీవుణ్ని ఇబ్బంది పెట్టనని మాటతీసుకుని వాలిని విడిచిపెట్టాడనేది కథ.
ఇక వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు తదితర వానరులు కొలువైన వానర రాజ్యం కిష్కింద అని కూడా ప్రాచుర్యంలో ఉంది. అది ఇప్పటి హంపి పరిసర ప్రాంతాల్లోనే నెలకొందని చాలామంది నమ్ముతారు. ఈ సంఘటనకు గుర్తుగానే హనుమంతుడు కుడిచేయి ఎత్తిన విగ్రహాలను హంపిలో మలచి ఉంటారు. హంపి సమీపంలో కొలువైన కలశాపుర హనుమంతుడు ఎంతో ప్రసిద్ధుడు. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య కూడా ఈ హనుమంతుణ్ని ‘కలశాపురము కాడ కందువ తోటల నీడ/ వెలయుచునున్నవాడు వీడె హనుమంతుడు’ అని కీర్తించాడు. ఇదే సంకీర్తనలో ‘తాటింటి పండ్లగొల దాపరి(లి) చేతబట్టుక/ వాటమై దైత్యుల గొట్ట వలచే యెత్తి’ అని ఎడమ చేతిలో తాటిపండ్ల గెల పట్టుకుని, రాక్షసులను (దుష్టులను) కొట్టడానికి వలచేయి కుడిచేయి ఎత్తాడని వివరించాడు. అంతేకాదు తోకను బాగా పెంచి తల మీదుగా వంపుచేసి, ‘ఎవరొస్తారో రండి’ అన్నట్లుగా గొప్పగా నిల్చున్నాడు అని ఇదే కీర్తనలో అన్నమయ్య హనుమంతుడి విగ్రహాన్ని వర్ణిస్తాడు. ఆయన ప్రస్తుతించిన కలశాపుర హనుమంతుడు ఈ విగ్రహాల్లో ఏదో ఒకటి అయ్యుంటుంది. వీటిలో కుడి చేయి ఎత్తింది తనను నమ్మినవారి దగ్గరికి వచ్చే దుష్టులు ఎంతటివారైనా సరే తన చేతిలో శిక్షకు గురవుతారని హనుమంతుడు అభయం ఇస్తాడనే దానికి ప్రతీకగా భావించవచ్చు.
ఇంకొన్ని చోట్ల హనుమంతుడి పాదాల కింద రెండు రాక్షసుల విగ్రహాలు ఉంటాయి. వీటిని ఐరావణ మైరావణులుగా, రావణ కుంభకర్ణులుగా పేర్కొంటారు. ఇక గుజరాత్లో హనుమంతుడి విగ్రహంలో కాళ్ల కింద ఓ స్త్రీని తొక్కుతున్నట్లు ఉంటుంది. ఈమెను పానవతి అని, దుష్టశక్తిగా చెబుతారు. అంతేకాదు ఈమెను శనికి సంకేతంగా కూడా భావిస్తారు. పానవతిని, లేదా ఇద్దరు రాక్షసులను హనుమంతుడి కాళ్ల కింద అణచిపెట్టినట్లు ఉన్న విగ్రహాలను ఆరాధించడం వల్ల దుష్టశక్తుల భయం తొలగిపోతుందని విశ్వసిస్తారు.
…?చింతలపల్లి హర్షవర్ధన్