నెల్లూరు జిల్లా : వచ్చే నెల 16 నుంచి శ్రీవారి వైభవోత్సవాలు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ వైభవోత్సవాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ మేరకు పలువురు అధికారులతో కలిసి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం నెల్లూరు నగరంలో వైభవోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉత్సవాలు చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు.
శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల ద్వారా తిరుమల శ్రీవారు భక్తుల చెంతకే వచ్చి దర్శనమివ్వనున్నారని, ఈ అరుదైన అవకాశాన్నినెల్లూరు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం కోరారు. నెల్లూరు నగరానికి వచ్చిన ఆయన స్థానిక పార్లమెంటు సభ్యుడు వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వైభవోత్సవాలను నిర్వహించే ప్రాంతాన్ని ఎంపిక చేశారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వైభవోత్సవాలు ఘనంగా ఐదు రోజులపాటు జరుపనున్నట్లు వీరబ్రహ్మ తెలిపారు. జేఈఓ వీరబ్రహ్మం వెంట తిరుమల సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈ-2 జగదీశ్వర్ రెడ్డి, పీఆర్వో టీ రవి, ధార్మిక ప్రాజెక్టుల అధికారి విజయసారధి కూడా ఉన్నారు.
శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ స్వామివారికి నిర్వహించే అన్నిరకాల సేవలను భక్తులందరూ వీక్షించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వీరబ్రహ్మం తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా నెల్లూరు నగరంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటుచేసి ఉదయం 5.30 గంటలకు సుప్రభాతం నుంచి రాత్రి 8.30 గంటలకు ఏకాంతసేవ వరకు అన్నిరకాల సేవలను నిర్వహించనున్నట్టు ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. వైభవోత్సవాలకు విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని శ్రీవారి కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు.