తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను బుధవారం ఉదయం విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నారు. వీటితోపాటు అక్టోబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఆర్జిత సేవ కోసం మొత్తం 54 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. భక్తులు ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. అధికారిక వెబ్సైట్ https://ttdsevaonline.com లో సందర్శించి బుక్ చేసుకోవచ్చునని టీటీడీ తెలిపింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. కొండపై ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు నిండి క్యూలైన్ బయట వరకు కొనసాగింది. శ్రీవారి సర్వ సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా, మంగళవారం తిరుమల శ్రీవారిని 68,467 మంది భక్తులు దర్శించుకోగా.. స్వామివారికి 35,506 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.
శ్రీవారికి రికార్డు హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారికి మరోసారి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. వరుసగా ఆరో నెల కూడా రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం అందింది. గత ఐదు నెలలుగా రూ.100 కోట్ల మార్కును దాటుతూ వస్తున్న స్వామివారి హుండీ ఆదాయం.. ఆరో నెలలో కూడా ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ దాటింది. ఇప్పటికే రూ.5 కోట్లకు పైగా కానుకలు హుండీలో జమయ్యాయి. ఆగస్ట్లో కేవలం 22 రోజులకే శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్కును దాటేయగా.. ఈ నెలలో కూడా శ్రీవారి హుండీ ఆదాయం రూ.140 కోట్లకు చేరే అవకాశం కనిపిస్తోంది.