తిరుపతి : నారాయణవనంలో కొలువైన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 2 నుంచి వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 2 మంగళవారం ఉదయం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు 11వ తేదీ వరకు కొనసాగుతాయి. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, లడ్డూ, అప్పం ప్రసాదాలుగా అందజేస్తారు.
ఆగస్టు 2 వ తేదీన సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. ఆగస్టు 3వ తేదీ బుధవారం సాయంత్రం సింహవాహనం, ఆగస్టు 4 గురువారం సాయంత్రం భూత వాహనం, ఆగస్టు 5 శుక్రవారం సాయంత్రం శేష వాహనం, ఆగస్టు 6 శనివారం రాత్రి 7 గంటలకు అగ్నిగుండం ప్రవేశం అనంతరం పులి వాహనంపై స్వామివారు విహరిస్తారు.
ఆగస్టు 7 ఆదివారం సాయంత్రం గజవాహనం, ఆగస్టు 8 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆగస్టు 9 మంగళవారం సాయంత్రం 5 గంటలకు వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనం, ఆగస్టు 10 బుధవారం ఉదయం 10 గంటలకు వీరఖడ్గస్నానం, మధ్యాహ్నం 3 గంటలకు పల్లకీ ఉత్సవం, సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.