తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రమని తిరుమల శ్రీ వైఖానస ట్రస్ట్ కార్యదర్శి ప్రభాకరాచార్యులు పేర్కొన్నారు. వైఖానస భగవత్ శాస్త్రం వేదంతో కూడినదని, దేవాలయ సంస్కృతికి మూలమైన వేదమంత్రాలతో జరిపే వైఖానస ఆరాధన తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనదని చెప్పారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ, టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ మరీచి మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకరాచార్యులు మాట్లాడారు.
వేల సంవత్సరాలుగా శ్రీవారికి పూజలు, ఉత్సవాలు శ్రీ వైఖానస ఆగమం ప్రకారం జరుగుతున్నాయని, ఈ ఆగమ శాస్త్రాన్ని శ్రీ మరీచి మహర్షి విమానార్చనకల్పం ఆనంద సహిత గ్రంథాలలో విధివిధానాలతో సమగ్రంగా వివరించారని ప్రభాకరచార్యులు తెలిపారు. శ్రీవారికి ఇవాళ జరుగుతున్న బంగారు పుష్పాల పూజ మరీచి మహర్షి రూపొందించిన శాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయన్నారు. ఈ శాస్త్ర పరిరక్షణ బాధ్యతలు స్వీకరించి టీటీడీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి, ధర్మ పరిరక్షణ ఒక ఉద్యమంలా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.
శ్రీ మరీచి మహర్షి దేవాలయ, మండపాల నిర్మాణాలను, నిత్య పూజలు, ఆరాధనలు విధివిధానాలు వంటి ఎన్నో శాస్త్ర విషయాలను సమగ్రంగా అందించారని ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీ రాఘవ దీక్షితులు చెప్పారు. దేవాలయ నిర్మాణమే సంస్కారవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీ రామకృష్ణ శేష సాయి, మచిలీపట్నంకు చెందిన శ్రీమన్ శరత్ కుమార్, తిరుమలకు చెందిన వరాహ నరసింహ దీక్షితులు తదితరులు కూడా పాల్గొని ప్రసంగించారు.