Sri Ramanavami Special | ధర్మానికి కట్టుబడి నిలిచే శ్రీరామచంద్రులు, పెద్దన్న మాట జవదాటని లక్ష్మణులు, గడపగడపకూ గంగమ్మను తీసుకెళ్లే భగీరథులు, పరస్త్రీ వ్యామోహంలో పదవులు పోగొట్టుకునే రావణులు, కుంభాలకు కుంభాలు లాగించే కుంభకర్ణులు.. సమాజం నిండా ఉన్నారు. రామదండు, రావణసేన.. మన చుట్టూతా కనిపిస్తాయి. రాముడెవరు, రావణుడెవరు? అన్న ఎరుక లేకపోతే మాత్రం బతుకు లంకా దహనమే. త్రేతాయుగ సమాజానికి, కలియుగ జీవనానికి మధ్య ఎన్నో పోలికలు. వయసును గెలవాలనే తపన, చావును ఓడించాలనే కసి, సృష్టి రహస్యాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస.. అప్పుడూ ఉన్నాయి, ఇప్పుడూ ఉన్నాయి. యుగాలు మారినా.. తరాలు గడిచినా.. మనిషి మారలేదు. కానీ, ధర్మంపట్ల చిత్తశుద్ధిలోనే బుద్ధి కొంత వక్రించింది. ఆ ఒక్క పరిమితినీ అధిగమిస్తే.. అంతా రామమయమే.
ధర్మం.. రామకథకు ఆత్మ. ప్రపంచాన్ని నిలబెట్టేది ధర్మం. మనిషిని తలెత్తుకునేలా చేసేది ధర్మం. రాజకీయ నాయకుడు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, కార్పొరేట్ దిగ్గజమూ కావచ్చు. ఎవరి వృత్తిధర్మాలు వారికి ఉంటాయి. కానీ, వాటికి అతీతమైన మానవ ధర్మం ఒకటుంది. అదే మహోన్నతం! ధర్మం ఓ గమ్యం అయితే, దాన్ని చేరుకునే మార్గం సత్యం. ఆ ప్రయాణంలో ఎన్నో ఊరింపులు. పక్కదారి పట్టించే ఆకర్షణలు. వాటిని విస్మరించాలి. ధిక్కరించాలి. అదంత సులభం కాదు. మనోశక్తి అవసరం. మర్యాదాయాం స్థితో ధర్మః – అంటారు వేదవ్యాసులు. తన పరిమితుల్లో తనను ఉంచుకోవడమే ధర్మం. శమః శౌచస్య – ఆత్మనిగ్రహమే దానికి మార్గం. రాముడికి తన పరిమితులు తెలుసు. ఆత్మనిగ్రహ విద్య తెలుసు. కాబట్టే, విగ్రహవాన్ ధర్మః అనిపించుకున్నాడు. ఆ పురాణ పురుషుడు నడిచిన దారే రామాయణమైంది. విలువల రాచమార్గమైంది. మహాజనో యేన గత స్స పంథా – గొప్పవాళ్లు నడిచిన దారిలోనే మనమూ నడవాలి. రాముడు గొప్ప పాలకుడు. గొప్ప భర్త. గొప్ప తనయుడు. గొప్ప సోదరుడు. గొప్ప నాయకుడు. కాబట్టే, రామమార్గమే శరణ్యం. రామాయణమే దారిదీపం. అవసరమైతే, పర్సులో రాముడి పటం పెట్టుకోవాలి. అందులోకి వెళ్లే ప్రతి రూపాయీ.. న్యాయబద్ధంగా సంపాదించినదే కావాలి. బయటికి తీసే ప్రతి పైసా ధర్మబద్ధమైన పనులకే ఖర్చు చేయాలి. రామ పరివార చిత్రాన్ని సెల్ఫోన్ స్క్రీన్ సేవర్గా ఎంచుకోవాలి. ఎందుకంటే, మొబైల్లో ఓ దశకంఠుడు.. కాదు కాదు, ఓ శతకంఠ రావణుడున్నాడు. నీ సమయాన్ని మింగేస్తాడు. నీ ఎనర్జీని పక్కదారి పట్టిస్తాడు. నీలోని రాక్షసాంశను తట్టిలేపుతాడు. అరచేతిలో ఇమిడిపోయే రావణలంక అది. రాముడిని గుర్తుచేసుకుంటూ.. రామతత్వాన్ని నెమరేసుకుంటూ ఆ సాంకేతిక ప్రపంచంలో అడుగుపెడితే.. అర్థంలేని ఆకర్షణల్ని సులభంగా అధిగమించవచ్చు. అలనాడు రావణసేన లంకకే పరిమితం. కానీ, నేడు అసురత్వం మనిషి మనిషితో లంకెలు పెట్టుకుంటున్నది. ఏదో ఓ రూపంలో బుర్రలో దూరిపోతున్నది. ప్రతి మెదడూ ఓ దశకంఠుడి దర్బారులా మారుతున్నది. ఈ సంక్షోభ సమయంలో రామమంత్రమే గెలుపు తంత్రం. రామాయణమే వికాస మార్గం.
రామాయణం.. రాముడి పద్నాలుగేండ్ల ప్రయాణానికే పరిమితమై ఉంటే యాత్రా సాహిత్యంగా మిగిలిపోయేది. రామరావణ యుద్ధమే కీలకమై ఉంటే కాల్పనిక గ్రంథంగా పేరు తెచ్చుకునేది. సీతారాముల కల్యాణమే ప్రధాన ఇతివృత్తమైతే ఏ శృంగార కావ్యాల సరసనో చేరిపోయేది. శ్రీమద్రామాయణం వీటన్నిటికీ అతీతం. ఇదో విలువల వాచకం. అందులోనూ, సందర్భోచితంగా ప్రస్తావించిన నీతి కథలు బతుకు రీతిని నిర్వచిస్తాయి. యుద్ధకాండంలో విభీషణుడు శరణాగతుడై వచ్చినప్పుడు.. సుగ్రీవుడు అడ్డు చెబుతాడు. రాముడికి కాకి-గూడ్లగూబ కథ వినిపిస్తాడు. సాయం పేరుతో గూడ్లగూబల గుంపులో చేరిన ఓ కాకి.. మెల్లగా ఆనుపానులు తెలుసుకుని.. తోటి కాకులతో దాడికి తెగబడుతుంది. అపాత్రులకు సాయం చేయకూడదనేది సుగ్రీవుడి మనోగతం. అరణ్యవాసంలో రాముడు శస్ర్తాస్ర్తాలు ధరించడాన్ని సీత వ్యతిరేకిస్తుంది. ఆయుధం మనసును కలుషితం చేస్తుందని హెచ్చరిస్తుంది. ఓ బాటసారి దారినవెళుతూ తన ఆయుధాన్ని భద్రపరచమని ఓ రుషి చేతికి అప్పగిస్తాడు. సాయుధుడైన తర్వాత ఆ తాపసి ఆలోచనలు హింసాత్మకం అవుతాయి. తన చెట్టుకింద సేదతీరుతున్న వేటగాడి ఆకలి తీర్చేందుకు.. తనను తాను దహించుకున్న పావురం కథ మంచికి పట్టం కట్టింది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే సుగ్రీవాదులకు ఈ కథ చెబుతాడు. మరో నీతికథలో అలర్కుడు అనే రాజు.. ఓ అంధ బాలుడికి తన నేత్రాలు దానం చేస్తాడు. ఆ దయాగుణానికి మెచ్చి యమధర్మరాజు అలర్కుడిని సలహామండలిలో నియమించుకుంటాడు. కథ చిన్నదే కావచ్చు. కానీ సారం లోతైనది. వేదాలను, ఉపనిషత్తులను
ఇముడ్చుకున్నది.
దాంపత్యం నుంచి వైద్యం వరకూ రామాయణం ప్రస్తావించని అంశం లేదు. రామరావణ యుద్ధ సమయంలో అనేకానేక వనమూలికలను పరిచయం చేస్తాడు వాల్మీకి. అందులో విఖ్యాతమైంది.. మృత సంజీవని. చనిపోయినవారిని బతికించే శక్తి దీనికి ఉందంటారు. విశల్యకరణి.. క్షతగాత్రుల గాయాలను నయంచేసే మహత్తు దీని సొంతమని చెబుతారు. సువర్ణకరణి.. విష ప్రయోగాల వల్లనో, ఇంకేదో కారణంతోనో.. చర్మం రంగు మారిపోతే ఈ ఔషధి సాయంతో మునుపటి ఛాయను తీసుకురావచ్చని అంటారు. సంధాని.. తెగిన అవయవాలను, విరిగిన ఎముకలను అతికించడంలో దీనికి తిరుగులేదని పేరు. ఈ నాలుగు మూలికలు రామరావణ యుద్ధంలో వానరసైన్యం విజయానికి ఓ కారణమయ్యాయి. వాల్మీకి మహర్షి సృష్టి రహస్యాలను సైతం చర్చించాడు. మానవుల తల్లిపేరు ‘మను’ అని చెబుతాడు. వృక్షజాతులకు మూలమూర్తిని ‘అనల’గా పరిచయం చేస్తాడు. వీరిద్దరూ కశ్యప ప్రజాపతి భార్యలు. పక్షులు, సర్పాలు, మృగాలు, క్రూరజంతువులు.. వివిధ జీవజాతులకు మిగిలిన ఆరుగురు భార్యలు ప్రాణంపోశారు. అలా సృష్టి ఆరంభమైందని రామాయణ విశ్లేషణ. సముద్ర ఆవిర్భావం, గంగావతరణం, వివిధ నదుల ఉనికి.. ఇలా అనేక అంశాలు చర్చకువచ్చాయి. కిష్కింధ కాండలో.. సీతాన్వేషణ కోసం దూతలను పంపేముందు సుగ్రీవుడు.. సమస్త భూమండల స్వరూపాన్నీ వర్ణించాడు. దేశాలను, రాష్ర్టాలను, నగరాలను ప్రస్తావించాడు. మానవజాతి వికాస చరిత్రలో వ్యవసాయం ఓ కీలక అధ్యాయం. ఆదికావ్యం ప్రకారం.. ఎగుడుదిగుడుగా ఉన్న నేలను పృథు మహారాజు చదును చేసి వ్యవసాయ యోగ్యం చేశాడు. అందుకే, భూమికి పృథ్వి అనే పేరొచ్చింది. నేటి టెస్ట్ ట్యూబ్ బేబీలను తలపించేలా.. మాతృగర్భంతో నిమిత్తం లేకుండా జన్మించిన పాత్రలు రామాయణంలో చాలా ఉన్నాయి. అగస్త్యుడు, వసిష్ఠుడు అలా పుట్టినవారే. నిత్య యవ్వనం కోసం, జరామరణాలకు అతీతమైన అమృతత్వం కోసం.. కలియుగ శాస్త్రవేత్తలు ఎంత తపిస్తున్నారో, త్రేతాయుగ మానవులు, దానవులు అంతే మథనపడ్డారు. రావణుడు తపోశక్తితో అమరత్వాన్ని పొందాడు. ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు ఆ దిశగా ప్రయత్నించి విఫలమయ్యారు. విభీషణుడికి ఆ అదృష్టం దక్కింది. అంజనీ సుతుడైన హనుమంతుడూ చిరంజీవే. యయాతి తన కొడుకు పూరుడికి తన ముసలితనాన్ని ఇచ్చి, బదులుగా అతని యవ్వనాన్ని స్వీకరించాడు. కాకపోతే ఇప్పుడు హార్మోన్ థెరపీలు, ఫేస్ లిఫ్టింగ్ సర్జరీలు చేయించుకుంటున్నారంతే! ఇలారాజు అనే పాలకుడు ఒకనెల పురుషుడిగా, ఒకనెల స్త్రీగా ఉంటూ.. స్త్రీపురుష జీవితాలను ఆస్వాదిస్తాడు. అలనాటి సమాజంలో ట్రాన్స్జెండర్స్ ఉనికికి ఇది సాక్ష్యం కావచ్చు.
భార్యాభర్తలంటే సీతారాముల్లా ఉండాలి. ‘ఛాయేవానుగతా సదా- నా కూతురు నిన్ను నీడలా వెన్నంటి ఉంటుంది రామా’ అని చెప్పి మరీ భూజాత సీతను రాముడికి అప్పగించాడు జనకుడు. తుదివరకూ అదే బాటలో నడిచింది సీతమ్మ. పట్టాభిషేకం రద్దయిపోయింది కాబట్టి, మహారాణి హోదా లభించలేదు కాబట్టి.. ఇక రాముడితో కలిసి జీవించడంలో అర్థంలేదని సీత అనుకోలేదు. విడాకులు ఇవ్వలేదు. ‘భర్తతోపాటు భార్యకూడా అడవులకు వెళ్లాలని ఏ ధర్మశాస్త్రంలోనూ లేదు. కాబట్టి నేను రాలేను’ అని వెనక్కి తగ్గనూలేదు. అంతఃపురంలో ఎంత ప్రేమించిందో, అడవిలోనూ అంతే ప్రేమించింది. అతని ప్రతి నిర్ణయాన్నీ గౌరవించింది. సీతపట్ల రాముడి ప్రేమ మాటలకు అందనిది. రాస్తూపోతే మరో రామాయణమే అవుతుంది. ముగ్గురమ్మలు, నాన్న.. ఏ సమయంలో తారసపడినా పాదాలను తాకి నమస్కరించేవాడు రాముడు.. చరణౌ వందే. పట్టాభిషేకం కంటే తండ్రి మాటే ప్రియమైనది అంటాడు..
పితుర్వచనం ప్రియమ్. అంత కష్టానికి కారణమైన కైకేయిపైనా కోపం లేదు అతనికి. భరతుడు కన్నతల్లిని తూలనాడుతుంటే అడ్డుకున్నాడు. తల్లిదండ్రులనే గౌరవించ లేనివాళ్లం, దేవుడినేం గౌరవిస్తాం? అంటాడో సందర్భంలో. సర్వ సులక్షణ శోభితుడైన లక్ష్మణుడిని అయితే.. ‘బహిః ప్రాణం’అని కొనియాడతాడు. అనుచరుడైన హనుమను ‘మేమిద్దరం వేరువేరుకాదు..’ అని మెచ్చుకున్నాడు. యుద్ధం తర్వాత విభీషణుడు కానుకగా సమర్పించిన ఐశ్వర్య సంపదనంతా వానర భల్లూకాలకే ఇవ్వమని సూచిస్తాడు. ప్రజలతో రాముడి అనుబంధం అవ్యాజమైంది. కాబట్టే, ఎవరినోట విన్నా రామనామమే వినిపించేదట, ఎవరిని కదిలించినా రామకథలే చెప్పేవారట. త్రేతాయుగమైనా, కలియుగమైనా.. మనిషి మనిషే. ధర్మం ధర్మమే. విలువలు విలువలే. కాబట్టే, రామకథలోని ప్రతి పాత్రలో మనల్ని మనం చూసుకుంటాం. ప్రతి ఘట్టాన్నీ సమకాలీన పరిస్థితులతో పోల్చుకుంటాం. రాముడు నడిచిన దారిని.. విలువల యాత్ర కోసం కాకుండా.. అధికార దండయాత్రల కోసం వినియోగించుకున్న ప్రతిసారీ బాధతో నిట్టూరుస్తాం. అంతలోనే, పది తలల విషపురుగును దునుమాడిన శత్రుసంహార రాముడు.. ఈ విషక్రిములకు మాత్రం బుద్ధి చెప్పకపోతాడా అన్న ఆశావాదం. ఇది కూడా రామాయణ పఠనం ప్రసాదించిన సంస్కారమే.
సైకోమెట్రిక్ టెస్ట్లో మన నైపుణ్యాల్ని బేరీజు వేసుకున్నట్టు.. రామగుణాలతో మనల్ని మనం పోల్చుకోవాలి. శ్రీమద్రామాయణంమొదటి సర్గలోనే ఆదికవికి నారద మహర్షి రామతత్వానికి సంబంధించి అరవై తొమ్మిది ఆనవాళ్లు చెప్పాడు. అందులో ఏ కొన్ని ఉన్నా, సాధనతో సొంతం చేసుకున్నా.. రాముడి అంశ మనలో ఉన్నట్టే.
నియతాత్మా : నిశ్చయమైన స్వభావం ఉన్నవాడు. వికారాలకు అతీతుడు.
వశీః : ఇంద్రియాలను తన అదుపులోఉంచుకున్నవాడు.
బుద్ధిమాన్ : బుద్ధిమంతుడు.
నీతిమాన్: నిజాయతీపరుడు.
అరిందమః : కామక్రోధాలపై నియంత్రణఉన్నవాడు.
ప్రజానామ్ హితే రతః : నలుగురి మంచీకోరేవాడు.
శుచిః : పరిశుభ్రతకు విలువనిచ్చేవాడు.
విచక్షణః : మంచిచెడులను బేరీజువేయగలవాడు.
సర్వసమః : అందరినీ సమానంగా చూసేవాడు.
సోమవత్ప్రియదర్శనః : చంద్రుడిలానిత్యానంద స్వరూపుడు.
ఇంకా.. ఓర్పులో భూమిలాంటివాడు, దానగుణంలో కుబేరుడు, ధైర్యంలో హిమవత్పర్వతం. ఒక సద్గుణం చాలు.. పునీతుడిని చేయడానికి. ఒక దుర్గుణం చాలు పాతాళానికి తొక్కేయడానికి. ఎలా బతకాలో రాముడు నేర్పితే, ఎలా చావకూడదో రావణుడు చూపించాడు. వాల్మీకం ఎలా ఉండాలో చెబుతుంది, ఎలా ఉండకూడదో కూడా హెచ్చరిస్తుంది. కాబట్టే, ఆదికవి నర్మగర్భంగా పాజిటివ్ కోణంలోంచి ‘రామాయణం’ అని నామకరణం చేశాడు. నెగెటివ్ కోణంలోంచి ‘పౌలస్త్య వధ’ అనీ పేరుపెట్టాడు. నువ్వు నడిచేదారే నీ జయాపజయాల్ని నిర్ణయిస్తుంది. నీ వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని నిర్ధారిస్తుంది. అంతిమంగా జీవన సాఫల్య వైఫల్యాలనూ ప్రభావితం చేస్తుంది.
రామాయణంలోని ప్రతి శ్లోకం అమూల్యమే. ప్రతి వాక్యం నీతిశాస్త్రాల సారమే. ‘నాస్తి శోక సమో రిపుః’ అంటుంది కౌసల్యాదేవి ఓ చోట. నిజమే, శోకాన్ని మించిన శత్రువు ఉండకపోవచ్చు. మనిషిని శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంది శోకం. ఎంత బలవంతుడినైనా పరిస్థితులకు లొంగదీస్తుంది. ‘యస్యార్థాః స మహాగుణః’ అంటూ లక్ష్మణుడు రామచంద్రుడిని ఓదార్చుతాడు. కలి స్వభావానికి మరింత దగ్గరగా ఉండేమాట ఒకటుంది.. సంపదలు ఉన్నవాడి చుట్టూనే స్నేహితులు మూగుతారు. అలా అని స్నేహాన్ని కించపరచలేదు. వయస్యః పరమా గతిః – కష్టసమయాల్లో ఆశ్రయం ఇవ్వగలిగేవాడు మిత్రుడొక్కడే. కృతఘ్నే నాస్తి నిష్కృతిః .. చేసిన మేలు మరిచిపోవడం మహాపరాధం. దానికి నిష్కృతిలేదు. ‘బిడ్డా అతిగా సంతోషపడటం సరికాదు. అతిగా బాధపడటమూ మంచిది కాదు’ అంటూ వాలి తన కొడుకు అంగదుడికి చెప్పే మాటలు ముత్యాల మూటలే. ‘తీపి మాటలు చెప్పేవాళ్లదేముంది? ఎక్కడైనా ఉంటారు. కానీ కఠిన వాస్తవాలతో హెచ్చరించేవారు చాలా అరుదు’ అంటూ మారీచుడు రావణాసురుడికి కర్తవ్యాన్ని బోధిస్తాడు. ‘మనం ఎంతైతే అరిగించుకోగలమో, అంతే తినాలి’ అనే ధర్మసూత్రాన్ని జటాయువుతో రావణుడికి చెప్పించాడు ఆదికవి. రాక్షసరాజు రావణుడెక్కడ? లక్ష్మీ స్వరూపిణి సీతాదేవి ఎక్కడ? ఆమెను కోరుకోవడం అంటే.. అరిగించుకోలేని ఆహారాన్ని భుజించడమే! ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు, ఏ వ్యాఖ్యానమైనా చేసేముందు, ఎవరినైనా దగ్గరికి తీసుకునే ముందు.. ఒక్కసారి రామాయణాన్ని తిరగేస్తే చాలు. ఏది క్షీరమో, ఏది నీరమో అర్థమైపోతుంది. ధర్మాన్ని మించిన కొలమానం లేదు. కాబట్టే, రాముడు ధర్మస్వరూపుడిగా నిలిచాడు. ‘వచనం మరణోపమానం’ అంటాడు వాల్మీకి. కొన్ని మాటలు మృత్యువుతో సమానం. అచ్చమైన విచ్చుకత్తులు. ఆ గాయం ఎదుటి మనిషిని చచ్చేదాకా వదిలిపెట్టదు.
రాముడిని గౌరవించడం అంటే రామమార్గంలో నడవడం. ఆ విలువల యాత్రలో ద్వేషానికి తావులేదు, హింసకు ఆస్కారం లేదు, ఆడంబరాలను ఆమడదూరంలో పెట్టాల్సిందే. ఇందులో ఏ ఒక్కటి పాటించకపోయినా.. అవతలి వ్యక్తిని రావణ అంశగానే భావించాలి..
పరధర్మాన్ని ద్వేషించడం.
తన మార్గాన్ని, ధర్మాన్ని వ్యతిరేకించే వ్యక్తులు, సమూహాలు చాలానే తారసపడ్డాయి. జాబాలి మహర్షి వాదనను కూడా రాముడు సావధానంగా విన్నాడే కానీ, ఎదురుదాడికి పాల్పడ లేదు. ద్వేషభావాన్ని రెచ్చగొట్ట లేదు.
ప్రత్యర్థిపై కక్షగట్టడం.
యుద్ధం అంటే గెలుపు, ఓటమి. అంతేకానీ, వినాశనం కాదు. తన ప్రత్యర్థి అయిన రావణుడిని కూడా రాముడు చాలా గౌరవించాడు. అతని తేజస్సును కొనియాడాడు. మరణం తర్వాత శత్రుత్వాలు ఉండ వంటూ.. దశకంఠుడి అంత్యక్రియలకు విభీషణుడిని సిద్ధం చేశాడు.
స్త్రీలను తూలనాడటం.
ఆగ్రహించాల్సిన సమయమే అయినా.. శూర్పణఖ విషయంలో నిగ్రహంతో వ్యవహరించాడు. వనవాసానికి కారణమైనా సరే.. కైకేయి పట్ల వాత్సల్యం ప్రదర్శించాడు. అసలు ఏ జీవినీ అవమానించి ఎరుగడు రాముడు. ‘న చావమంతా భూతానాం’ అంటాడు వాల్మీకి.
ఆడంబరాలు ఆశించడం.
అడవికి వెళ్తున్నప్పుడు.. తన రత్నాభరణాలను, సంపదలను పేదలకు పంచాడు రాముడు. అరణ్యవాసంలో రాముడు ఓ ముని కుమారుడిలానే బతికాడు. నారవస్ర్తాలు ధరించాడు. కందమూలాలు ఆరగించాడు. గుహుడు పంచభక్ష్యాలతో విందు ఏర్పాటుచేసినా సున్నితంగా తిరస్కరించాడు.
విధ్వంసాన్ని ప్రోత్సహించడం.
రావణ సంహారం తర్వాత.. రాముడే తలుచుకొని ఉంటే లంకా నగరాన్ని నేలమట్టం చేసేవాడు. అలా చేయలేదు. ఉన్నది ఉన్నట్టు విభీషణుడికి అప్పగించాడు. ప్రజలను కన్నబిడ్డల్లా పాలించమని హితవు పలికాడు.
అధికారమే పరమావధి కావడం.
కైకేయికి దశరథుడు ఇచ్చిన మాట ధర్మశాస్త్రం ప్రకారం చెల్లుబాటు కాదని సన్నిహితులు సలహా ఇస్తారు. తండ్రిని ధిక్కరించమని ఆంతరంగికులు సలహా చెబుతారు. వెనక్కి వచ్చి అయోధ్యను ఏలుకోమని భరతుడు వేడుకుంటాడు. అయినా, రాముడు ఆమోదించడు. కారణం, అధికారం అతని పరమావధి కాదు. పీఠం కోసం వ్యక్తిత్వాన్ని తాకట్టుపెట్టడం రాముడి స్వభావం కానేకాదు. అది అసురుల గుణం. రావణ పరివార వారసత్వం.
ఉన్నవారికే కొమ్ము కాయడం
రామదండులో సంపన్నులు లేరు, రాజ్యాధిపతులూ లేరు. రాముడు అక్కున చేర్చుకున్నది కూడా.. శబరి అనే గిరిజన స్త్రీని, అహల్య అనే శాపగ్రస్త మహిళను, సుగ్రీవుడనే బాధితుడిని, గుహుడు అనే పామరుడిని, ధర్మానికి ప్రతినిధులైన రుషులను.
అస్తు. అస్తు. తథాస్తు. అంతిమంగా సత్యమే నిలుస్తుంది, గెలుస్తుంది.