తిరుమల : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుంచి డిసెంబర్ 8 వరకు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో తెలిపారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో మంగళవారం జేఈవో వీరబ్రహ్మం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని అమ్మవారి వాహన సేవలు, పంచమి తీర్థం ఆలయ వాహన మండపంలో ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను ఆగమశాస్త్రం, సంప్రదాయబద్ధంగా ఏకాంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఉద్యాన, విద్యుత్ విభాగాల అధికారులు ఆలయం అలంకరణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అమ్మవారి వాహన సేవలను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు. బ్రహ్మోత్సవాల్లో స్నపన తిరుమంజనం నిర్వహించే రోజుల్లో ఆకర్షణీయమైన మాలలు, పుష్పాలంకరణ చేపట్టాలని ఉద్యానవన విభాగం అధికారులను ఆదేశించారు. భక్తులందరికీ మూలమూర్తి దర్శనం కల్పించాలని ఆదేశించారు. ఉత్సవాల్లో భాగంగా 29న లక్షకుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ, 30న ఉదయం ధ్వజారోహణం, డిసెంబర్ 4న గజవాహనం, 8న పంచమితీర్థం, 9న పుష్పయాగం నిర్వహించనున్నట్లు వివరించారు.