TTD News | శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి వారి పవిత్రోత్సవాలను కనులారా తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు విశేష సంఖ్యలో హజరయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పవిత్రోత్సవాల్లో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మీ, ఏఈఓ గురుమూర్తి, సూపరింటెండెంట్లు చెంగల్రాయులు, రమణయ్య, ఆలయ అర్చకులు బాలాజిరంగాచార్యులు పాల్గొన్నారు.
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ , కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిపారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.