తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ అధికారులు ప్రకటించారు. మే 5న శ్రీ రామానుజ జయంతి, భాష్యకార్ల సాత్తుమొర, శ్రీ అనంతాళ్వార్ ఉత్సవారంభం, మే 6న శ్రీ శంకరాచార్య జయంతిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో మూడురోజులపాటు వైభవంగా నిర్వహిస్తామన్నారు.
ఈ వేడుకలో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. 14న శ్రీ నృసింహ జయంతిని, 14న శ్రీ అనంతాళ్వార్ సాత్తుమొర వైభవంగా నిర్వహించనున్నామని వెల్లడించారు. 15న శ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి, 16న శ్రీ అన్నమాచార్య జయంతి. 25న శ్రీ హనుమజ్జయంతిని నిర్వహిస్తున్నట్లు వివరించారు.