తిరుమల: సెప్టెంబర్ నెలలో తిరుమల ( Tirumala ) లో నిర్వహించే విశేష పర్వదినాల( Special festivals ) వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీన శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం, 5న శిక్యోత్సవం, 13న బలరామ జయంతి, వరాహ జయంతి, 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ( Brahmotsavams ) ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయని వివరించారు.
19న శ్రీవారి గరుడ సేవ, 20న శ్రీవారి స్వర్ణరథం, 22న రథోత్సవం, 23న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణం, 24న శ్రీవారి బాగ్ సవారి, అనంత పద్మనాభ వ్రతం, చక్రస్నానం కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల రాకతో మంగళవారం 27 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్వనం అవుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 77,042 మంది భక్తులు దర్శించుకోగా 36,698 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.50 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. 4.14 లక్షల లడ్డూలను విక్రయించగా 2.09 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని తెలిపారు.