శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత స్పర్శదర్శనం మంగళవారం నుంచి రోజుకు రెండు సార్లు వారంలో నాలుగు రోజుల పాటు కల్పిస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. ఇప్పటి వరకు కేవలం మధ్యాహ్న సమయంలో మాత్రమే గర్భాలయ ఉచిత స్పర్శదర్శం కల్పిస్తున్నారు. వివిధ ప్రాంతాల భక్తుల అభ్యర్థన మేరకు సాయంత్రం సమయంలో కూడా ఉచిత స్పర్శ దర్శనాన్ని కల్పించేందుకు నిర్ణయించినట్లు ఈవో తెలిపారు.
అయితే, వారంలో నాలుగు రోజులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అనుమతించగా.. గురువారం మాత్రం ఆలయ శుద్ధి చేసుకునేందుకు వీలుగా 1.30 నుంచి 2.30 గంటల వరకు గర్భాలయ ప్రవేశం కల్పించి తిరిగి సాయంత్రం 6.30 నుంచి 07.30 గంటల వరకు స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు వివరించారు. ఆయా సమయాల్లో కేవలం ఆలయ ముఖమండపం నుంచి ప్రవేశం చేసిన వారికే మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు.