తిరుమల : సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ నిర్వహించిన షోడశదినాత్మక అరణ్యకాండ పారాయణ దీక్ష ముగిసింది. ఈ దీక్షలను తిరుమలలో 16 రోజుల పాటు చేపట్టారు. ఆదివారం సాయంత్రం మహా పూర్ణాహుతితో ముగిసింది. మహాపూర్ణాహుతి కార్యక్రమంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో వసంత మండపంలో అరణ్యకాండ పారాయణంలోని శ్లోకాల పారాయణం, ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో జప-తర్పణ-హోమాలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ లోక సంక్షేమం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ 16 రోజుల పాటు షోడశదినాత్మక అరణ్యకాండ పారాయణ దీక్ష వైభదంగా నిర్వహించామన్నారు. వాల్మీకి మహర్షి సుందరకాండ, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండలుగా రామాయణాన్ని రచించారని తెలిపారు. ఇప్పటికే సుందరకాండ. బాలకాండ, అయోధ్యకాండ, యుద్ధకాండ, అరణ్యకాండలను పారాయణం చేశామని చెప్పారు. పండితులతో చర్చించిన మీదట త్వరలో కిష్కిందకాండ పారాయణ దీక్ష చేపడతామని వెల్లడించారు. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు ఈ పరాయణంలోని శ్లోకాలను వీక్షించిన, పఠించిన, శ్రవణం చేసిన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు.
ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో..
ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలోని ప్రార్థనా మందిరంలో ప్రతి రోజు అరణ్యకాండ పారాయణంలో భాగంగా జప-తర్పణ-హోమాదులు నిర్వహించారు. లోక క్షేమం కోసం 16 రోజుల పాటు ఉపాసకులు అకుంఠిత దీక్ష, శ్రద్ధలతో శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయస్వామి సమేత శ్రీ రామ మూల మంత్రానుష్ఠానం 27 లక్షల సార్లు జపించారు. జపంలో పదవ వంతు ఆవు పాలతో తర్పణం, తర్పణంలో 10వ వంతు హోమాలు నిర్వహించారు.
మహా పూర్ణాహూతి సందర్బంగా ఆదివారం ఉదయం మూల మంత్ర హోమాలు, శ్లోక హోమాలు, మండప దేవత హోమాలు, అంగ హోమాలు, పౌష్ఠిక హోమాలు, శాంతి హోమాలు, జయాతి హోమం, కుంభారాధన జరిగింది. తర్వాత సమస్త దోషాలు తొలిగి పోవాలని అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు సంకల్పం, హోమద్రవ్య పూజ, బలి ప్రదానం, ద్రవ్య సమర్పణ, వసోర్ధారా హోమం, పూర్ణాహుతి చేపట్టారు.
వసంత మండపంలో..
అంతకుముందు తిరుమల వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ, అరణ్యకాండలోని 75 సర్గల్లో 2,454 శ్లోకాలు పారాయణం చేసినట్లు తెలిపారు. ఈ శ్లోకపారాయణ ద్వారా రాక్షస గుణాలు తొలగిపోయి సాత్విక గుణాలు అలవడతాయన్నారు. ఆదివారం ఉదయం 70 నుంచి 75 వ సర్గ వరకు ఉన్న 188 శ్లోకాలను 16 మంది ఉపాసకులు అత్యంత దీక్షా శ్రద్ధలతో పారాయణం చేశారని వివరించారు.
” రామ రామ రామ్… భజే విశేష సుందరం సమస్త పాప ఖండనం…” , అనే సంకీర్తనను టీటీడీ ఎస్వీ సంగీత నృత కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన బృందం సుమధురంగా అలపించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసి సీఈఓ షణ్ముఖ కుమార్, వైఖానస ఆగమ సలహాదారు, ఆస్థాన పండితులు మోహన రంగాచార్యులు, వీజీఓ బాలి రెడ్డి, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు పాల్గొన్నారు.