నారు పోస్తుంటే.. ఓ నాదం. నీరు పడుతుంటే.. ఓ మోదం. కోతల్లో కోరుకున్న పాటలు. కళ్లంలో కోట్ల ఆశలు. వ్యవసాయం రైతులకు బతుకుదెరువు కాదు, సమస్త మానవాళికి ఆదరువు. కర్షక లోకానికి వ్యవసాయం.. ఓ జీవిత విధానం, జీవన వేదం.
‘వేదమూలమిదం జ్ఞానం’ అన్నారు. అంటే, వేదమే సమస్త జ్ఞానానికి మూలం. వేదాన్ని జీవన విధానంగా మార్చుకున్నారు భారతీయులు. పూజలు, హోమాది క్రతువుల్లో మాత్రమే కాదు, వేద ప్రతిపాదిత వృత్తులనే ఉపాధి మార్గాలుగా ఎంచుకున్నారు. వ్యవసాయం కూడా వేదం సూచించినదే! వేదాల్లోని సారాన్ని గ్రహించే మాగాణమ్మను పచ్చని పైరుతో అలంకరించారు. శక్తియుక్తులను విత్తులుగా నాటి, శ్రమను పెట్టుబడిగా పెట్టి, రుతువులను ఆసరాగా చేసుకొని, మేఘ సందేశాలను అంచనా వేసి యుగాలుగా సాగు యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు మన కర్షకులు. వ్యవసాయ విధానాల గురించి వేదం ఏం చెప్పింది?
అవనిపై మనువు కాలంలో వ్యవసాయం మొదలైందని వేదం చెబుతున్నది. సూర్యుడి కవల పుత్రులైన అశ్వినీ దేవతలు మనువుకు విత్తనాలు ఇచ్చి.. వ్యవసాయం చేయించారని రుగ్వేదంలో పేర్కొని ఉంది. వేద కాలంలో అంటే క్రీస్తుపూర్వం 800 సంవత్సరాల ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. నాగలి, బండి, చక్రం, కాడి మొదలైన వ్యవసాయ పరికరాల ప్రస్తావన వేదాల్లోనూ కనిపిస్తుంది. అప్పటికే పశువులను మచ్చిక చేసుకొని వ్యవసాయంలో సాయంగా ఉపయోగించుకోవడం మనుషులకు అలవాటైంది. వ్యవసాయాన్ని మనవాళ్లు ఒక వృత్తిగా భావించలేదు. జీవన విధానంగా చేసుకున్నారు. సాగుబడిలో అంతగా రాబడి లేకున్నా.. భూమినే నమ్ముకున్నారు కానీ, అమ్ముకోవాలని అనుకోలేదు. తరాలుగా వస్తున్న భూములను కాపాడుకోవడం కోసం నానాపాట్లూ పడేవారిని పల్లెల్లో ఇప్పటికీ చూస్తుంటాం. నిలువులోతు అప్పుల్లో కూరుకుపోయినా పొలం అమ్మడానికి అంగీకరించడు రైతు. నేలతో వారికి ఉండే అనుబంధం అటువంటిది.
వేదాలతోపాటు ఇతిహాసాలు, పురాణాల్లోనూ వ్యవసాయదారులకు సంబంధించిన అనేక విషయాలు చర్చించడం గమనించవచ్చు. అగ్ని, వాయు పురాణాల్లో సాగుకు సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. సింధునాగరికత ఆనవాళ్లలో ధాన్యాగారాలు కూడా వెలుగు చూశాయి. రైతులు పండించిన ధాన్యం సేకరించడానికి రాజులు ప్రత్యేక శాఖను నిర్వహించేవారు. క్రీస్తుపూర్వమే రాజాస్థానాల్లో ‘సీతాధ్యక్షుడు’ అనే పదవి ఉండేదని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో తెలియజేశాడు. ‘సీత’ అంటే నాగటి చాలు అని అర్థం. ఇలా పురాణ కాలం నుంచి వ్యవసాయానికి ప్రాధాన్యం కనిపిస్తుంది.
ద్వాపర యుగంలో బలరామకృష్ణులు వ్యవసాయం, పశుపోషణను ప్రధానంగా ప్రోత్సహించినట్టు భాగవతం తెలియజేస్తున్నది. సాగుపనుల్లో ప్రధానమైన నాగలి బలరాముడి ఆయుధం. ప్రతి ఒక్కరూ శ్రామికుడు కావాలని బలరాముడి ప్రబోధం. శ్రీకృష్ణుడు అలౌకికమైన మహిమలు ఎన్ని చూపినా, మానవాతీతుడని ఎందరు కొనియాడినా.. ‘గోపాలుడు’గా ఆయన బృందావనవాసులకు ఆప్తబంధువయ్యాడు. గోపబాలురతో కలిసి గోవుల పాలన చేస్తూ పశుపోషణ ప్రాధాన్యాన్ని తెలియజేశాడు.
ఒకప్పుడు వర్షాధారంగానే వ్యవసాయ పనులు సాగేవి. దేవతల రాజైన ఇంద్రుడి అధీనంలో మేఘాలు ఉంటాయని, సమయోచితంగా ఆయనే వర్షాలు కురిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి వ్రతాలు, యజ్ఞాలు చేసేవారు. ఇదే క్రమంలో గోకులవాసులు దేవేంద్రుడి అనుగ్రహం కోసం యాగం తలపెడతారు. యజ్ఞ నిర్వహణ చేయాల్సిందిగా అందరూ శ్రీకృష్ణుడి పెంపుడు తండ్రి నందుడిని సంప్రదిస్తారు. అప్పుడు నందుడు ‘ఇంద్రుడు మేఘబృందాలను పంపిస్తే పంటలు పండుతాయి. ఆ పంటలు ధర్మార్థకామాలను ప్రసాదిస్తాయి. అందుకే, రాజులంతా విధిగా ఇంద్రయాగం చేస్తారు’ అని చెబుతాడు. నందుడి మాటలను సమర్థించే మంత్రాలు రుగ్వేదంలో కనిపిస్తాయి. ‘మరుత్తులు రుద్రుని పుత్రులు. వీళ్లు శత్రుంజయులు, గదాధరులు. ఇంద్రుడికి ప్రధాన హితులు. వీళ్లు మేఘ వాహనాలపై ప్రయాణిస్తారు. ప్రాణప్రదమైన వర్షాలను నేలకు తీసుకుని వస్తారు’ అని ప్రస్తావించింది రుగ్వేదం.
వాన కురిస్తే గడ్డి పెరుగుతుంది. గడ్డి మేసి పశువులు జీవిస్తాయి. వ్యవసాయం, పశుపోషణ అన్నదమ్ముల వంటివి. పాడి-పంట వాడుక అలాంటిదే! ‘పశుపోషణ ఎందుకు అంటే పాడి కోసం. పాడి ఉంటే మానవజాతికి పుష్టి. దేవతలకు సమర్పిస్తే తుష్టి’ అని చెబుతాడు నందుడు. వారి నమ్మకాలకు మూలం వేద ప్రమాణమే! కాని, ఇంద్రుడికి కనువిప్పు కలిగించాలని శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పూజించమని సూచించాడు. కృష్ణుడిపై కోపంతో ఇంద్రుడు ఏకధారగా వర్షాలు కురిపించి గోకులాన్ని అతలాకుతలం చేస్తాడు. శ్రీకృష్ణుడు చిటికెన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తి గోకులవాసులను కాపాడుతాడు. నల్లనయ్య మహిమ తెలుసుకున్న ఇంద్రుడు అహంకారం విడిచి భగవానుడిని శరణు వేడుతాడు.
వ్యవసాయంలో ఆధునిక విధానాలు ఎన్ని వచ్చినా.. వర్షాలే పంటలకు ఆధారం. యజ్ఞయాగాది క్రతువుల వల్ల దేవతలు సంతృప్తి చెంది వర్షాలు కురిపిస్తారని శాస్ర్తాలు చెబుతున్నాయి. అందుకే, పాలకులు వేద ప్రమాణాన్ని అనుసరించి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించేవారు. ధార్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. వన సంరక్షణకు చర్యలు తీసుకునేవారు.
వరాహ మిహిరుడు రాసిన బృహత్ సంహిత వ్యవసాయ విజ్ఞాన గ్రంథం. గ్రహగతుల ఆధారంగా వర్షం ఎప్పుడు వస్తుందో అంచనా వేసి అందులో పేర్కొన్నాడు. రుతుపవనాల రాకను లెక్కించే పద్ధతులను కూడా వివరించాడు. సాగు విధానాలను కూడా పొందుపరిచాడు.
పరాశరుడు రాసిన ‘కృషి పరాశరం’ ప్రామాణిక వ్యవసాయ గ్రంథంగా పేర్కొంటారు. నేల స్వభావాన్ని బట్టి ఎలాంటి పంటలు వేయాలి? సాగులో పాటించాల్సిన జాగ్రత్తలు తదితర వివరాలన్నీ ఇందులో కనిపిస్తాయి. భూమిని దున్నే విధానాలు, విత్తన శుద్ధి వంటి అంశాలను కూడా ఆయన వివరించాడు.
– డా॥ వెలుదండ సత్యనారాయణ
94411 62863