Srisailam | శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం వేదమంత్రోచ్ఛరణల మధ్య మంగళవాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలో శాస్ర్తోక్త పూజలు జరిపించి గ్రామోత్సవం నిర్వహించినట్లు ఈఓ లవన్న తెలిపారు.
దివ్యకాంతులను ప్రసరింపజేస్తూ భక్తులకు వరాలిచ్చే స్వామి అమ్మవార్ల వాహనసేవను వీక్షించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. అమ్మవారికి ప్రీతికరమైన కాగడాలు, ఎర్రగులాబీలు, తెల్ల చామంతి, ఊదా చామంతి, మందారం, లిల్లీ, ఎర్ర గన్నేరు, ఊద గన్నేరు, దేవ గన్నేరు, నందివర్దనం, గరుడవర్దనం, తెల్ల చామంతి వంటి 35 రకాల ప్రత్యేక పుష్పాలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు. జామ, ఖర్జూర, నల్ల ద్రాక్ష వంటి 9 రకాల పండ్లతో పాటు బిల్వం మరువం మాచీపత్రితో ప్రత్యేక అలంకరణ చేసిన శయన మందిరంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవగా శయనోత్సవాన్ని నిర్వహించినట్లు ఈఓ తెలిపారు. మకర సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా పలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల కళాకారులతోపాటు ఆలయ అధికారులను సిబ్బందిని అభినందించారు.