Srisailam | శ్రీశైల దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ధార్మిక కార్యక్రమాలను దేవస్థానం నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖశర్మ ప్రవచనాలను ఏర్పాటు చేసింది. ‘గణపతి గాథలు’ అనే అంశంపై ప్రవచనాలను శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదట ఆలయ సంప్రదాయం మేరకు జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం షణ్ముఖ శర్మ ప్రవచన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. శ్రీశైల క్షేత్రం ఇలలో వెలసిన కైలాసమని.. అలాంటి క్షేత్రంలో సాక్షిగణపతి, రత్నగర్భ గణపతి దర్శనం ఇవ్వడం అదృష్టమన్నారు.
వేదాల్లో, ఆగమాలలో, పురాణాల్లో, ఇతిహాలలో గణపతి గాథలు చాలా ఉన్నాయని, పార్వతీ పరమేశ్వరుల పుత్రుడిగానే కాక గణపతి స్వరూప స్వభావాలు ఇతరత్రా గ్రంథాల్లో ఉన్నాయన్నారు. సృష్టికి పూర్వమే ఉన్న బ్రహ్మదేవుడికి ఓం కారం గణపతి ఆకారంలో దర్శనం ఇచ్చి సృష్టి రచనకు పుష్టినిచ్చిందన్నారు. గణపతి ఆది నుంచి ఉన్నాడని.. అందుకే ఆయనను ఆదిపూజ్యుడుగా ఆరాధిస్తున్నామని, వేదాలకంటే ముందుగా ఓంకార రూపంలో గణపతి ఆవిర్భవించాడన్నారు. బ్రహ్మదేవుడి చేత వ్యాసభగవానుడు గణపతి మంత్రోపదేశం పొంది, గణపతిని ధ్యానించి, ప్రార్థించి తన రచనలకు శ్రీకారం చుట్టాడని, గణపతి సాక్షాత్తు శివశక్తుల స్వరూపమని, రానున్న వినాయక చవితి నవరాత్రులకు ఈ ప్రవచనాలు నాంది అని తెలిపారు. సనాతనధర్మం, వైదిక ఆచారాలకు సంబంధించిన పలు అంశాలను భక్తులకు వివరించారు.