.. అద్య జాతాం యథా నారీం తథా షోడశ వార్షికీమ్
శతవర్షాం చయో దృష్ట్వా, నిర్వికారః స షండకః॥
(నారద పరివ్రాజక ఉపనిషత్తు 3-64)
ఎవడు అప్పుడే పుట్టిన ఆడపిల్లను, పదహారేండ్ల పడుచు పిల్లను, నూరేండ్ల ముసలమ్మను ఒకే లాగా చూస్తాడో, చూసి కూడా నిర్వికారుడై ఉంటాడో అతడు ‘షండకుడు’ (నపుంసకుఁడు) అని పైశ్లోకానికి భావం. ఇదే ఉపనిషత్తులోని ‘అజిహ్వః షండకః పంగుః..’ అనే శ్లోకంలో ముక్తి కోరేవాడు నాలుక లేనివాడిలా, నపుంసకునిలా, కుంటివానిలా, గుడ్డివానిలా, చెవిటివానిలా, పసిపిల్లవానిలా కనిపించే సాధన చేయాలని కనిపిస్తుంది. ఇందులో షండకుడు అనే ఆదర్శ సాధకునికి ఉదాహరణ శుక మహర్షి. ఆ మహర్షి ఉదంతం ఒకింత పరిశీలిద్దాం. వేద వ్యాసుడి కుమారుడైన శుకుడు భాగవతాన్ని పరీక్షిత్తు మహారాజుకు వారం రోజుల్లో వినిపించినాడు. పుట్టుకతోనే ఆయనకు వేద విజ్ఞానం అంతా సొంతమైంది. పూర్ణ వైరాగ్యం వరించింది. ఒక రోజు ఆయన నగ్నంగా ఆకాశగంగా మార్గంలో వెళుతున్నాడు. కొందరు అప్సరసలు వలువలు గట్టుమీద కుప్పగా పడవేసి గంగలోకి దిగి ఇష్టారాజ్యంగా జలకాలాడుకుంటున్నారు.
ఒకరిమీద ఒకరు నీళ్లు చల్లుకుంటున్నారు. కేరింతలు కొడుతున్నారు. వాళ్లంతా నవ యౌవనవతులు. అతిలోక సుందరీమణులు. తన దారిన తాను వెళ్లిపోతున్న శుక మహర్షిని చూసి కూడా వారు ఏమాత్రం సిగ్గు పడలేదు. అస్సలు కంగారు పడలేదు. ఒక మనిషి పక్కనుంచి వెళ్లిపోతున్నట్టు కూడా వారికి అనిపించలేదు. కానీ, శుకుణ్ని వెతుక్కుంటూ వ్యాసమహర్షి వెనకాల పరిగెత్తుకొని వచ్చాడు. వృద్ధుడైన వేదవ్యాసుణ్ని చూసినంత మాత్రాన్నే గబగబా గట్టుమీదకు చేరుకొని ఆదరాబాదరాగా బట్టలు కట్టుకున్నారు అప్సరసలు. ఇదేమిటని అడిగితే ‘శుకునిది పసిపిల్లవాని మనసు. స్త్రీ పురుష భేద భావమే అతని మనసులో లేదు. అదే పరమహంస స్థితి. ఆ స్థితిలో ఉన్నాడు శుక మహర్షి’ అన్నారు. వ్యాసుడు కుమారుడి గొప్పదనానికి ఆనందించినాడు. శుకుని పోలిన తత్త్వజ్ఞుడు యోగీశ్వరుడు మూడు లోకాలలో లేడని కీర్తిగాంచాడు.