స్వామి వివేకానంద వంటి సర్వసంగ పరిత్యాగులకే కాదు రామకృష్ణులు సాంసారికులకు ఆధ్యాత్మిక మార్గం ఉపదేశించారు. కలకత్తా వైద్య కళాశాలకు చెందిన రసాయన శాస్త్ర బోధకుడు రామచంద్ర దత్త గృహస్థుడు. పరమహంసకు శిష్యుడు. ఆయన ఒకసారి రామకృష్ణులతో ‘నేను కుటంబాన్ని విడిచి సన్న్యాసం తీసుకోవాలని అనుకుంటున్నాన’ని అన్నారు. అప్పుడు పరమహంస ‘ఆలోచన రహితంగా ఏదీ చేయకూడదు. ఎవరి ద్వారా ఏం చేయించాలో భగవంతుడికి తెలుసు. సంసారాన్ని త్యజిస్తే నీ భార్యాబిడ్డల గతి ఏమవుతుంది? నీ కోసం భగవానుడు ఏర్పాటు చేసిన దానిని నువ్వు తారుమారు చేయడానికి ప్రయత్నించవద్దు. సంసారంలో ఉండటం ఒక కోటలో జీవించటం లాంటిది. శత్రువును కోట బయట నుంచి ఎదుర్కోవడం కన్నా, కోటలో ఉండి ఎదుర్కోవడమే సులభం. కామక్రోధలోభమోహాలే ఆ శత్రువులు. మూడింట నాలుగో వంతు మనస్సును భగవదాయత్తం చేసినప్పుడు మాత్రమే నువ్వు సంసారాన్ని పరిత్యజించే స్థితిలో ఉండగలవు. అయినా సంసారం కూపమనీ, అరణ్యమనీ ఎందుకంటావు? మొదట్లో అలాగే అనిపిస్తుంది. కానీ, భగవంతుణ్ని ఆశ్రయించాక సంసార భయం తొలగిపోతుంది. ఆ సంసారమే ఆనందధామంగా ఒప్పారుతుంది. ఓ చేత్తో సంసారాన్ని, మరోచేత్తో పరమాత్మను పట్టుకో’ అని అనునయించారు పరమహంస.