ముప్పైమూడు కోట్ల మంది దేవతలు ఉన్న హైందవ ధర్మంలో మరే ఇతర దేవతల కల్యాణానికి దక్కని వైభవం, మహత్తు సీతారాముల కల్యాణానికి దక్కింది. ఏటా సంబురంగా జరుపుకొనే ఈ ఆదర్శ దంపతుల వివాహాన్ని ‘సీతారామ శాంతికల్యాణం’ అని పిలుస్తారు. పెండ్లి మంత్రాల్లోనూ ‘శ్రీసీతారామ శాంతికల్యాణ మహోత్సవాంగత్వే..’ అని సంకల్పం మొదలుకొని మాంగల్యధారణ, తలంబ్రాల వరకు చెబుతారు. దీని ద్వారా సీతారాముల పెండ్లి లోకకల్యాణ హేతువని అర్థమవుతున్నది.
ఆలూమగలంటే సీతారాముల్లా ఒకరికొకరుగా ఉండాలనడం, నవదంపతుల్ని జానకీరాముల్లా ఉండమని ఆశీర్వదించడం, ఉత్తమ సాధ్విని సీతమ్మతల్లితో పోల్చడం, గౌరవ మర్యాదలు తెలిసిన వ్యక్తిని మా మంచి రామయ్యగా అభివర్ణించడం, శ్రీరామనవమి నాటి కల్యాణం జరిగిన తర్వాతనే తమ బిడ్డల వివాహ సుముహూర్తాలు నిశ్చయించుకునే ఆచారం పాటించడం, సీతారామకల్యాణ అక్షతలను తమ బిడ్డల వివాహ తలంబ్రాలలో కలిపితే నవదంపతులు చల్లగా ఉంటారనే విశ్వాసం కలిగి ఉండటం.. ఇవన్నీ సీతారామ కల్యాణానికి మాత్రమే చెందిన ప్రత్యేకతలు.
ఇంతకీ వీరి కల్యాణానికే ఎందుకీ ఘనత? అంటే- సీతారాములిద్దరూ సాధారణ స్త్రీపురుషులు కాదు. వారిద్దరూ యజ్ఞఫలితంగా ఆవిర్భవించిన పుణ్యమూర్తులు. తమ వంశం తరించడానికి పుత్రసంతానం కోసం దశరథ మహారాజు చేసిన యాగఫలితంగా శ్రీరామచంద్రమూర్తి జన్మిస్తే, యజ్ఞ నిర్వహణలో భాగంగా యాగశాల కోసం భూమిని దున్నుతున్న జనక మహారాజుకు నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞప్రసాదం సీతాదేవి. ‘యజ్ఞాః లోక కల్యాణ హేతవః’ – యజ్ఞాలు లోక కల్యాణానికి కారకాలుగా నిలుస్తాయి. అటువంటి యజ్ఞ ఫలితంగా జన్మించిన సీతారాముల కల్యాణం లోకకల్యాణ యజ్ఞానికి హేతువుగా నిలిచింది.
ఆత్మప్రబోధం… శివధనుర్భంగం
విశ్వామిత్రుడి యాగ సంరక్షణ కోసం బయల్దేరుతారు రామలక్ష్మణులు. యాగం పూర్తికాగానే విశ్వామిత్రుడి వెంట మిథిలా నగరానికి వెళ్తారు. జనక మహారాజు ఆస్థానానికి చేరుకుంటారు. విశ్వామిత్రుడు చెప్పిన మీదట జనక మహారాజు శివ ధనుస్సును రామలక్ష్మణులకు చూపుతాడు.
నృణాం శతాని పంచాశత్
వ్యాయతానాం మహాత్మనామ్
మంజూషామ్ అష్టచక్రానాం
తాం సమూహస్తే కథంచన॥
బలిష్ఠులు, దీర్ఘకాయులు అయిన ఐదువేల మంది పురుషులు, ఎనిమిది చక్రాలున్న శకటం మీద అమర్చి ఉన్న శివధనుస్సును అతికష్టంతో తోసుకుంటూ మంటపానికి తీసుకువస్తారు. నాగ, కిన్నెర, కింపురుష, యక్ష, రాక్షసులు సహా సమస్త దేవతా గణాలకు ఈ ధనుస్సును ఎక్కుపెట్టడం సాధ్యం కాలేదని జనకుడు విశ్వామిత్రుడితో చెబుతాడు. వెంటనే విశ్వామిత్రుడు ‘వత్స రామ ధనుః పశ్య’- నాయనా రామా! ఈ ధనుస్సును చూడు అంటాడు. వ్యవహార భాషలో చెప్పాలంటే ఈ ధనుస్సు సంగతి చూడు అని అర్థం.
మహర్షి వాక్యంలోని అంతరార్థం గ్రహించిన రాముడు ‘లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః’- ఆ ధనుస్సు మధ్యభాగాన్ని చేతితో పట్టుకుని, ఎంతో అలవోకగా ఎక్కుపెడతాడు. కేవలం రాముడి కరస్పర్శతోనే ధనుస్సు వంగుతుంది. ఎడమ చేతితో ధనుస్సును పట్టుకుని, కుడిచేతితో ఆ వింటి నారిని పైకొనకు బంధించి, ఆకర్ణాంతం అల్లెత్రాటిని లాగుతాడు. మరుక్షణంలో ఫెళఫెళమంటూ లోకభీకరమైన శబ్దం చేస్తూ, శివధనుస్సు రెండుగా విరుగుతుంది. సీతారామ కల్యాణానికి ఇదే శ్రీకారం.
మహోజ్జ్వలమైన ఈ ఘట్టాన్ని ఆధ్యాత్మికంగా పరికించి చూస్తే, సమున్నతమైన ఆత్మబోధ మనకు అందుతుంది. శాస్త్ర పరిభాషలో ధనుస్సు అంటే ‘ఓం’ కారం (ప్రణవం). ‘ప్రణవో ధనుః శిరోహ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే’- అని ఉపనిషత్ వాక్యం. ప్రణవం అంటే వంగేది అని అర్థం. ప్రణవం ఎవరికైతే వంగుతుందో, అటువంటి వ్యక్తికి మన ఆత్మను అర్పించాలి. ఇక్కడ ధనుస్సు రూపంలో ప్రణవం రామచంద్రునికి వంగింది. అంటే, మన ఆత్మను అర్పించడానికి తగిన దైవం రామచంద్రమూర్తి. శివధనుస్సును ఎక్కుపెట్టడానికి ఎందరో దేవతలు కూడా ప్రయత్నించారు. వారెవరికీ అది సాధ్యం కాలేదు. అంటే ప్రణవం ఎవరికీ వంగలేదు. రామునికి మాత్రమే లొంగింది. అంటే, మన ఆత్మార్పణకు అసలైన మార్గం శ్రీరాముని చరణాలే అని స్పష్టమవుతున్నది.
‘ఓం’కారం కారణ దశలో ‘అ’కారంగా మారుతుంది. ‘అదితి భగవతో నారాయణస్య ప్రథమ విధానం’ అన్న వాక్యాన్ని అనుసరించి ‘అ’కారం శ్రీమన్నారాయణుడి మొదటి పేరు. ‘ఏతస్మిన్ అంతరే విష్ణురుపయాత మహాద్యుతిః’- దశరథుడికి పుత్రుడిగా జన్మించింది సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. అంటే, ప్రణవ స్వరూపుడైన శ్రీమహావిష్ణువే దశరథుడి కుమారుడైన శ్రీరామచంద్రునిగా మానవుడిగా జన్మించాడు. అందుకనే జనకుడు లక్ష్మీస్వరూపిణి అయిన సీతమ్మను నారాయణ స్వరూపుడైన రామచంద్రుడికి అర్పించాడు.
మరొక అర్థంలో చూస్తే- శ్రీరామచంద్రుడు ఒక్కసారిగా శివధనుస్సును ఎక్కుపెట్టాడు. దాన్ని సంధించడానికి ఉన్న నారిని కట్టగానే, ఒక్కసారిగా ధనుస్సు రెండు ముక్కలైంది. ధనుస్సు ఒక భాగం శ్రీరాముడి చేతిలో ఉంది. రెండో భాగం నారితో వేలాడుతుంటుంది. ఇది శివధనుర్భంగ దృశ్యం. ‘అ, ఉ, మ’ అనే అక్షరాల కలయికే ‘ఓం’ కారం. ‘అక్షరానాం అకారోస్మి’
అనే వాక్యం ప్రకారం రామచంద్రమూర్తి ‘అ’కార స్వరూపం. ఇది (నారాయణ స్వరూపం) నేను అని చెప్పడానికి రాముడు ధనుస్సు ఒక భాగాన్ని తన చేతితో పట్టుకున్నాడు. రెండో భాగం ‘అ’తో కలిసి ఉండే ‘మ’ అంటే మనిషి (జీవుడు). ‘అ’ కి ‘మ’ కి మధ్య ఉన్న ధనుస్సు నారి ‘ఉ’ కార స్వరూపం ఉంది. ‘అ’, ‘మ’లను ‘ఉ’కారం కలిపి ఉంచుతుంది. అంటే, జీవాత్మ, పరమాత్మల సంబంధం ఎప్పటికీ వేరుపడేది కాదు అనే సత్యం మనకు బోధపడుతుంది. రెండుగా విడివడిన ధనుస్సు ఒక ఖండాన్ని చేతితో పట్టుకుని ‘ఓం’కార ప్రతిపాద్యమైన దైవాన్ని నేనే సుమా! జీవుడు నాకు సంబంధించిన వాడే కానీ స్వతంత్రుడు కాడు’ అనే విషయాన్ని రామచంద్రమూర్తి స్పష్టంగా ప్రకటించాడు. ఇదీ శివధనుర్భంగ ఘట్టం ద్వారా మనకు అందే అద్వైత వేదాంత బోధ.
కల్యాణ గానం
రాములోరి పెండ్లిగా జానపదులు సీతారామ కల్యాణ వైభవాన్ని పల్లె పదాలుగా పాడుకుని, తనివితీరా రామభక్తి సామ్రాజ్యంలో మునిగి తేలుతుంటారు. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య కూడా తన కీర్తనల్లో అనేక చోట్ల సీతారాముల కల్యాణోత్సవాన్ని, నవ దంపతులుగా సీతారాములను మనసారా కీర్తించాడు. ‘రామం ఇందీవర శ్యామం పరాత్పర ధామం.. సుర సార్వభౌమం భజే.. సీతా వనితా సమేతం’, ‘అట్టె హరువిల్లు విరిచిన రాఘవా- సిరులతో జనకుని ఇంటను జానకి జెలగి పెండ్లాడిన రాఘవా’, ‘రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమిజకు పతియైన పురుష నిధానము’ లాంటి కీర్తనలు ఇందుకు ఉదాహరణ.
‘సీతమ్మ మాయమ్మ..’ వంటి వాగ్గేయకార కృతులు, ‘వామే భూమిసుతా పురశ్చ హనుమాన్…’ వంటి ధ్యానశ్లోకాలు సీతారాముల అన్యోన్య దాంపత్యాన్ని నిరంతరం మననం చేస్తాయి. మొత్తంగా సీతారాముల పెండ్లి లోకకల్యాణ కారకంగా, ఆత్మచైతన్య ప్రబోధకంగా, ధార్మిక జీవన మార్గదర్శకంగా నిలుస్తుంది. అన్నిటికీ మించి, యావత్ప్రపంచం శిరసు వంచి నమస్కరిస్తున్న సనాతన హైందవ వైవాహిక జీవన ధర్మానికి ఆలంబనగా వెలుగొందుతుంది.
పంచభూతాత్మక పరతత్వం
రాముడు నీలమేఘ శ్యాముడు. నీలవర్ణం ఆకాశ లక్షణం. అంటే రాముడు ఆకాశ తత్వానికి ప్రతీక. సీతమ్మ నాగేటి చాలు ద్వారా అయోనిజగా లభించింది. అంటే, సీతమ్మ పంచభూతాల్లో మొదటిదైన భూతత్వానికి ఆలంబన. పంచభూతాల్లో మొదటిదైన భూతత్వం సీతమ్మ కాగా, చివరిదైన ఆకాశ తత్వం రామయ్య. ఈ రెండిటి మధ్యలోనే మిగిలిన మూడు తత్వాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో (వాన చినుకుగా మారి) అప్పుడు పుడమి (భూమి) పులకరిస్తుంది. సస్యాన్ని అందిస్తుంది. ఆ సస్యం జీవులకు ఆహారంగా మారి, శక్తిని ఇస్తుంది. అంటే, ఎప్పుడు రామయ్య సీతమ్మను చేరుకుంటాడో (సీతారామ కల్యాణం జరుగుతుందో) అప్పుడే లోకానికి శక్తి (రావణాది రాక్షస బాధ నుంచి విముక్తి పొందే శక్తి) అందుతుంది. ఈవిధంగా సీతారామ కల్యాణం లోకకల్యాణ కారకంగా, శాంతిదాయకంగా నిలుస్తుంది.
…? డా॥ కప్పగంతు రామకృష్ణ
రాజా రాముడు
వాల్మీకి రామాయణాన్ని అనుసరించి శ్రీరామచంద్రుడు చైత్ర మాసం శుక్లపక్ష నవమి తిథిన ఈ భువిపై అవతరించాడు. భగవద్గీతలో ఉద్బోధించినట్టు, దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు భగవంతుడు ప్రతి యుగంలోనూ
అవతరిస్తాడు. జీవుడు భగవంతుణ్ణి శరణు పొందే మార్గాన్ని సుగమం చేస్తాడు. దేవదేవుడిని శరణు పొందిన వారెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్న సత్యాన్ని లోకానికి నిరూపించటమే శ్రీరామచంద్ర ప్రభు అవతరణ ముఖ్య ఉద్దేశం.
శ్రీమద్రామాయణ, భాగవతాది శాస్ర్తాల్లో పొందుపరచిన శ్రీరాముని లీలల్లో ఈ సూత్రమే గోచరిస్తుంటుంది.
ఈ ప్రపంచంలో అత్యంత భయాన్నిచ్చేది కర్మబంధనం. అంటే మనం చేసిన కర్మల ఫలాలకు మనమే బద్ధులవటం. అలాంటి కర్మ బంధనాల నుంచి జీవునికి ముక్తినిచ్చే శ్రీరాముని దివ్య ఆవిర్భావాన్ని గురించి భాగవతం.. ‘పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్ ఆనృశంస్యపరో రాజస్కర్మబన్ధైర్విముచ్యతే’ అని వివరించింది. ‘ఓ పరీక్షిత మహారాజా! శ్రీరామచంద్రుని లీలా గుణగణ వైభవాన్ని గురించి ఎవరైతే వింటారో అలాంటి వారి మదిలోని ఈర్ష్యలన్నీ తొలగి కర్మబంధనముల నుంచి విముక్తి పొందుతారు.’ (శ్రీమద్భాగవతం 9.11.231) పై శ్లోకంలో చెప్పినట్టు శ్రీరాముని దివ్య చరితాన్ని విన్నవారు తమ మనసులోని ఈర్ష్య అనే జబ్బు నుంచి ఉపశమనం పొందుతారు.
శ్రీరామ రాజ్యం
శ్రీరామచంద్ర ప్రభువు ఈ లోకాన్ని పాలిస్తున్నప్పుడు, పుడమి ఎంతగా పులకించిందో భాగవతం చక్కగా వివరించింది. ‘నాధివ్యాధిజరాగ్లాని దుఃఖశోకభయక్లమా:/ మృత్యుశ్చానిచ్ఛతాం నాసీద్రామే రాజన్యధోక్షజే’… శ్రీరామచంద్రుడు చక్రవర్తిగా ఉన్నప్పుడు ప్రజలకు దైహిక మానసిక క్లేశాలు, వ్యాధులు, వృద్ధాప్యం, నష్టం, దుఃఖం, శోకం, భయం, అలసట ఎంతమాత్రం లేకుండెను. కోరనివారికి మృత్యువు కూడా సంప్రాప్తించకపోయేది. ప్రస్తుతం ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో పై శ్లోకాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే అప్పటి ప్రజల ఉన్నత జీవితాన్ని చూసి ఆశ్చర్యపోతాం. ఇదే ఒక ఆదర్శవంతమైన రాజు పరిపాలన. ఇదే భగవంతుడైన శ్రీరామచంద్రుడి సుపరిపాలన. అందుకే రామ రాజ్యమన్నది చిరస్మరణీయంగా నిలిచిపోయింది.
రాముడితోనే రామరాజ్యం
వివిధ రకాల సమస్యల నుంచి విముక్తులవ్వాలనే అందరూ కోరుకుంటారు. రామరాజ్యం మళ్ళీ రావాలనే ప్రజలంతా కాంక్షిస్తారు. అయితే, ప్రజల్లో శ్రీరామచంద్రుని పట్ల శరణాగతి భావన పెంపొందేందుకు వారికి తగిన శిక్షణనందిస్తే రామరాజ్యం కచ్చితంగా సాధ్యమే అంటుంది శాస్త్రం. శ్రీరాముడు లేనిదే మరి శ్రీరామ రాజ్యం ఎలా సాధ్యం!
అభయ ప్రదాత
తనను శరణన్న వారెవరినైనా సరే, తాను రక్షిస్తానని శ్రీరాముడు ప్రకటించాడు. శ్రీరామచంద్రుని లీలా వైభవంలోని విశిష్టత ఇదే. రామాయణంలోని ప్రతి కాండలోనూ రక్ష అన్న వానికి అభయాన్ని ఒసగే ధోరణే అణువణువునా దర్శనమిస్తుంది. ‘అభిన్నత్వాన్ నామ నామినో’ అంటుంది పద్మపురాణం. అంటే, భగవన్నామానికి, భగవంతునికి మధ్య ఎట్టి వ్యత్యాసమూ లేదు అని. కనుక, భగవన్నామాన్ని జపిస్తే, భగవంతుడు మన దగ్గర ఉన్నట్టే. రామ నామాన్ని జపించేవారికి ఆ నామమే అభయాన్ని ప్రసాదిస్తుంది. శ్రీరామచంద్ర ప్రభువు నేటికీ తన నామ రూపంలో ఈ లోకంలోనే ఉన్నాడు! ఈ హరేకృష్ణ మహామంత్రంలోనూ ఉన్నాడు:
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
పవిత్రమైన ఈ శ్రీరామ నవమి సందర్భంగా ప్రతిఒక్కరూ శ్రీరాముని అభయహస్తాన్ని అందరికీ చేర్చడంలో తోడ్పడండి. రాజైనవాడు భగవంతుని ప్రతినిధిలా వ్యవహరించటంలో తగిన శిక్షణ పొందినవాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ప్రజల్లో ఆదర్శ జీవనానికి గల స్ఫూర్తిని కలిగించటంలో శ్రీరామచరితం ఎంతో తోడ్పడుతుంది. అప్పుడే లోకం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. పుడమి మరింత పులకిస్తుంది.
…? శ్రీమాన్ సత్యగౌర
చంద్రదాస ప్రభూజి, 93969 56984