TTD News | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం మంగళవారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు చందనంతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు.
పుష్పయాగం సందర్భంగా టీటీడీ ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల పుష్పాలు అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో 2.5 టన్నులు తమిళనాడు, 1.5 టన్నులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు అందించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్థాన మండపం నుంచి పుష్పాలు, పత్రాలను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు.
సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. వేద పారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, పగడపు పూలు వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి 6 రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్య కైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల గానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు మారుతి ప్రసాద్, మిలిన్ కేశవ్ నర్వేకర్, బోరా సౌరబ్, జేఈఓ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.