వైరోచని (బలి), వామనుల వార్తాలాప వేళ భాగవత వరిష్ఠుడు ప్రహ్లాదుడు అచ్చోటికి విచ్చేశాడు. బంధనంలో ఉన్నందున బలి తాతగారికి వందనం చెయ్యలేక సిగ్గుతో తల వంచాడు. కళ్లలో నీళ్లు సుళ్లు తిరిగాయి. వామన పరమాత్ముని దర్శించిన ప్రహ్లాదుని ఒళ్లు పులకరించింది. స్వామికి సాగిలపడి నమస్కరించి సంస్కారానుగుణంగా ఇలా పలికాడు.. ‘మహానుభావా! నువ్వు ఇచ్చిన ఇంద్రపదవిని ఈ నాడు తొలగించి నా మనుమనికి మేలే చేశావు. రక్షించడమే కాని, ఈ బంధనం శిక్షించడం కాదు. ఓ సత్త్వమూర్తీ! నీ తత్త్వం తెలిసిన వానికి ఈ మహేంద్రత్వం- ఇంద్రపదవి ఎందుకూ కొరగానిది. స్వామీ! నీ దానం- ఇవ్వడం, ఎంత శోభనమో, కమనీయమో… నీ గ్రహణం (హరణం)- పుచ్చుకోవడం, కూడా అంతే కల్యాణప్రదం, రమణీయం!’
బలి తన తప్పు తెలుసుకొని సిగ్గుపడి తలదించుకొన్నాడు. ‘వాసుదేవ స్సర్వం’- ఇదంతా వాసుదేవుడే! ఇదే చరమ నిష్కర్ష, పరమార్థం! అలాంటిది, భగవానుడు వచ్చి అడిగితే బలి అంటాడు- ‘స్వామీ! ఇదంతా నాదే. నువ్వు ఏదడిగినా ఇస్తా’, బలి అనవలసిన మాటేనా ఇది? ‘మమ నాథ యదస్తి యోస్మ్యహం సకలం తద్థి తవైవ మాధవ!’- నేను, నాది అనేది అసలు ఉంటేగా నీకు సమర్పించడానికి? అలా భావించక నేను ‘ఇచ్చేవాడను’ అని అహంకరించినందున నాకు ‘బంధనం’ కలిగింది అని గ్రహించాడు బలి. అంతా పరమాత్మే- అన్న పరమార్థం అనుభవానికి తెచ్చుకోవడమే యథార్థమైన ‘సమర్పణ’. ఈ సమర్పణ బాహ్యమైన- భౌతిక క్రియారూపం కాదు. జ్ఞానాత్మకం- ఆంతరమైన అనుభవ (అనాసక్తి) రూపం. ‘సకలమిద మహం చ వాసుదేవః’ (ఇదంతా మరియు నేను కూడా వాసుదేవుడే) అనే సర్వాత్మ భావం లేకపోతే సమర్పణ అహంకారాత్మకం అవుతుంది. కాన, బంధకమవుతుంది. అదే ‘బలి బంధనం’. జీవుని సంసార బంధనానికి అహంకారమే ఇంధనం! ‘నాది’ అంటే అపచారం! ‘నీది’ అంటే ఉపచారం! దీనిముందు చతుష్షష్టి ఉపచారాలూ దిగదుడుపే!
శుక ఉవాచ- రాజా! ఇంతలో బలి భార్య వింధ్యావళి వచ్చి అంజలి ఘటించి కన్నీరు కారుస్తూ ‘పతిభిక్షాం మమ దేహి కోమల మతే! పద్మాపతే!’- ‘ఓ కరుణామతీ! కమలాపతీ! నాకు పతి భిక్షపెట్టు’ అంటూ వామనుని వేడుకొన్నది. అప్పుడే సరస్వతీపతి బ్రహ్మదేవుడు వచ్చి ‘శ్రీపతీ! తన సర్వస్వం నీకు సమర్పించిన దానపరుడు, ఈ దానవపతి దండనీయుడు కాదు. ఈతని బంధనం తొలగించు’ అని కోరగా, మార జనకుడు (విష్ణువు) ఆయనను ఓరగా చూస్తూ ఇలా పలికాడు.. ‘కుమారా! నేను కృప చూపాలనుకున్నవాని సంపదనంతా అపహరిస్తా. ఎవ్వడైనా తనకున్న విత్తానికి, వయసుకు, విద్యకు, వృత్తికి, బలరూపాలకు, జన్మ ఐశ్వర్యాలకు గర్వపడకుండా నిగ్రహంతో ఉండగలిగితే అదే నా నిండైన అనుగ్రహం!’
శా॥ ‘బద్ధుండై గురుశాపతప్తుఁడయి తా బంధువ్రజత్యక్తుఁడై
సిైద్ధెశ్వర్యముఁ గోలుపోయి విభవక్షీణుండునై పేదయై
శుద్ధత్వంబును సత్యముం గరుణయున్ సొంపేమియుం దప్పఁడు
ద్బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెం బుణ్యుం డితం డల్పుఁడే?’
‘బ్రహ్మదేవా! ఈ పుణ్యాత్ముడు బంధనం పొందాడు. గురు శాపానికి లోనై ఎంతో పరితాపానికి గురి అయ్యాడు. బంధువర్గం ఇతనిని అతని పాపానికే వదిలేసింది. ప్రాప్తించిన అధికారం, ఐశ్వర్యం అంతరించాయి. వైభవం అడుగంటింది. నిరుపేదగా నిలిచినా ఇతడు కడు నిర్మలంగానే ఉన్నాడు. సత్యాన్ని, దయను, సన్మార్గాన్ని విడువలేదు. జ్ఞానియై గెలవ సాధ్యం కాని మాయను గెలిచాడు. ఇతడు అల్పుడు కాడు, మహనీయుడు. ధాతా! సావర్ణి మన్వంతరంలో ఇతడు నా దయతో దేవంద్ర పదవి అలంకరిస్తాడు. అంతవరకు ఎట్టి వెతలు (బాధలు), కలతలు, రుగ్మతలు (రోగాలు), దుర్గతులు, అహితులు లేని, దేవతలు సైతం కుతూహలపడే సుతల లోకంలో అసుర సేవలు అందుకొంటూ తుల (సాటి)లేని ఐశ్వర్యంతో తులతూగుతాడు.’
భగవంతుడు బలితో.. ‘బలీ! నీ త్యాగం గొప్పది. నీ ఆజ్ఞ మీరిన అసురులను నా చక్రం బలిగొంటుంది. నీ భోగసామగ్రితో సహా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతా. నీ భవనపు ప్రతి కవాటం వద్ద కనికరంతో నీకు కనిపిస్తూ ఉంటా. నా నిరంతర ధ్యానం వలన నీలోని అసురత్వం త్వరలోనే తొలగిపోతుంది.’ అన్నగారైన ఇంద్రునికి స్వర్గరాజ్యమిచ్చి తన భక్తుడైన బలికి వామనుడు ఉపేంద్రుడు అపవర్గం (మోక్షం) కాదు, తన్ను తానే ఇచ్చుకొన్నాడు. బలికి ద్వారపాలడయ్యాడు.
పరమాత్మ పలుకులు బలి వీనులలో చెరకురసపు పోనల- జల్లుల వలె ప్రవేశించాయి. లోపల నిండిపోయి పొంగి రెప్పలను తొలగతోసుకుంటూ వెలువడి సంతోష బాష్పధారలుగా ప్రవహించాయి. బలి వక్షఃస్థలం పులకాంకురాల పవిత్ర తిలకాలు దిద్దుకుంది. బలి అంజలి ఘటించి ఇలా పలికాడు..
ఉ॥ ‘ఎన్నడు లోకపాలకుల నీ కృపఁ జూడని నీవు నేఁడు న
న్నున్నతుఁ జేసి నా బ్రదుకు నోజయు నానతి యిచ్చి కాచి, తీ
మన్నన లీ యారసము మాటలు పెద్దరికంబుఁ జాలదే?
పన్నగ తల్ప! నిన్నెరిఁగి పట్టిన నాపద గల్గ నేర్చునే?’
‘ఓ పన్నగరాజ శయనా! నీవు దిక్పాలకులపైన కూడా ఏనాడూ ఇంత తిన్నని దయ చూపలేదు. నన్ను ఈ నాడు ఉన్నతునిగా- గొప్పగా చేశావు. ఈ మర్యాద, మన్నన, ఈ దయారసం, దొడ్డరికం నాకు చాలు. నిన్ను తెలిసి ఆశ్రయించిన వారికి ఎన్నడూ ఆపదలు కలుగవు’ ఇలా పలికి త్రిమూర్తులకు వందించి బలి బంధనం నుంచి విడివడ్డాడు. బలి వందనం వనమాలి- వామనునికి బంధనమయింది. బలికి బంధనం కొద్ది క్షణాలే! కాని, భగవంతునికి శాశ్వత బంధనం కలిగింది. అసుర రాజు త్యాగానికి అచ్యుతుడు అమ్ముడుపోయాడు. లోకంలో ఏ యజమాని అయినా తన సేవకుని తనకు స్వామిగా చేసుకొంటాడా? అమాని, లోకస్వామి ఐన భగవానుడే తన శరణాగత భక్తుని, దాసుని తనకు స్వామిగా, యజమానిగా చేసుకొంటాడు. భక్తుని భగవంతుడు గౌరవించినట్లు లోకంలో ఎవ్వడూ ఆదరించడు!
వంశోద్ధారకుడైన మనుమణ్ని చూచి ప్రహ్లాదుడు పరమానందం పొందాడు. పరమాత్మతో ఇలా అన్నాడు.. ‘ఓ దయామయా! భవ (శివ), కమలభవా (బ్రహ్మా)దులకు కూడా దుర్లభమైన నీవు మా దానవులకు దుర్గ రక్షకుడవయ్యావు. ‘మమ్ముఁగాచుట చిత్రంబు మంగళాత్మ!’- అల్పులమైన మమ్ము ఇలా అనల్ప కృపావృష్టి కురిపించి కాపాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది’ అని నుతించాడు. అప్పుడు పరమాత్మ.. ‘ప్రహ్లాదా! ముదావహం. నీవు నీ మనుమనితోపాటు సుతల లోకానికి వెళ్లు. అక్కడ నేను గదాధారినై సదా మిమ్ములను కాపాడతా’ అని పలికాడు. ప్రహ్లాదుడు పరమాత్మకు ప్రదక్షిణం చేసి సపరివారంగా సుతలలోకానికి చేరాడు. అనంతరం భగవంతుడు, బలి యాగశేషాన్ని పూరించమని బ్రహ్మవేత్తయైన భార్గవుని కోరాడు. శుక్రుడు.. ‘యజ్ఞ పురుషా! నీ నామ సంకీర్తన మాత్రం చేతనే దేశ, కాల, వస్తు, మంత్ర, తంత్ర, సంబంధమైన సమస్త దోషాలూ- లోటుపాట్లు, పొరబాట్లు సమసిపోతాయి. అయినా నీ ఆజ్ఞ తల దాలుస్తా’ అని బలి యాగాన్ని సఫలీకృతం చేశాడు.
(సశేషం)