Pothana Bhagavatam Episode 96 | మనసును మాధవునిపై నిలిపి మోదముతో పరవశించి మేను మరచువాడు కాయాధవుడు- ప్రహ్లాదుడు. సర్వమంత్ర, తంత్ర, యంత్ర, సంహితల సారాన్ని సూక్ష్మంగా ఒక్కమాటలో ‘మూలమంత్రం’గా, ఆలోచనామృతంగా తండ్రికి ఇలా తెలిపాడు తనయుడు..
శా॥ ‘శోధింపం బడె సర్వశాస్త్రములు రక్షోనాథ! వే యేటికిన్
గాథల్ మాధవశేముషీతరణి సాంగత్యంబునం గాక దు
ర్మేధన్ దాఁటఁగ వచ్చునే సుతవధూమీనోగ్ర వాంఛా మద
క్రోధోల్లోల విశాల సంసృతి మహా ఘోరామితాంభోనిధిన్’
‘రాక్షసరాజా! అన్ని శాస్ర్తాలు తరచి చూశాను. మరెన్నో పురాణ కథలు, గాథలు త్రవ్వి చూశాను. వేయేటికిన్- వేయిమాటలు ఎందుకు? అంతులేని సంసార సాగరంలో సతీసుతులు వింతగొలిపే జలజంతువులు- తిమింగలాలు. తీవ్రమైన వాంఛలు, క్రోధ, మద, మాత్సర్యాదులు ఉవ్వెత్తున ఎగసిపడే ఊర్ములు- కెరటాలు. ఇట్టి భయంకర సముద్రాన్ని దాటడానికి ‘హరిభక్తి’ అనే నావ- నౌక ఒక్కటే తప్ప వక్రబుద్ధి- విపరీత, వితండవాదాలు, కపటాలు, కుతర్కాలు, అహంకార పూరిత పాండిత్యాలు, ప్రగల్భాలు ఎందుకూ పనికిరానివి.’ పై శార్దూల వృత్తం పోతన సొంతం. ‘విద్యాసార మెరుంగ గోరెద’ అని కన్నతండ్రి కోరగా దానికి ఇది కుమారుడిచ్చిన సమాధానం.
‘మాధవపద సేవయే భవసాగర తరణానికి తరణి- సుదృఢమైన నావ. అదే కైవల్యానికి త్రోవ’ అని తిన్నగా తెగేసి తెలపగా కన్నతండ్రికి తనయునిపై ఉన్న వాత్సల్యం- మమకారం అంతా మరుక్షణమే మాయమైపోతుంది. పట్టలేని కోపంతో ఒక్కపెట్టున ఒడిలోని పిల్లవానిని కిందకు నెట్టేసి మంటలు ఎగజిమ్మే వేడి చూపులతో మంత్రులతో ఇలా అన్నాడు.. ‘పందిరూపంలో వచ్చి తన పినతండ్రినే పొట్టనబెట్టుకున్నాడన్న వేదన కూడా లేకుండా వీడు మన వంశానికే విరోధి అయిన వెన్నునికి (విష్ణువుకి) దన్నుగా ఉంటూ బంటులాగా వాని భజన చేస్తున్నాడు. మనకు ఎగ్గు (హాని) చేసిన దుర్మార్గుని- దామోదరుని వీడు సిగ్గు విడిచి మోదముతో సేవ చేస్తున్నాడు. నాకు పుత్రుడై పుట్టి నా శత్రువుకు తోడై నా ప్రాణాలు తోడేస్తున్నాడు. నాతో ఘోరంగా వైరం పూనాడు. తండ్రికే ద్రోహం తలపెట్టే తనయుణ్ని, ఇట్టి అవినయుణ్ని అవని మీద ఎక్కడైనా చూశారా? ఐదేండ్ల ఈ డింభకుడు, నేను ఎంత వద్దని వారించినా వినకుండా నాకు వైరి అయిన వారిజాక్షుని- హరిని నా వారి ఎదుటే అవ్వారిగా నివ్వెర గొలుపుతూ కీర్తిస్తున్నాడు. నా గర్భంలో అర్భక- పుత్రరూపంగా వ్యాధి పుట్టింది. రాక్షస వీరులారా! మీమీ విక్రమం చూపి ఈ వైరి విభూషణుని, వంశదూషణుని వధించి రండి. శస్త్ర చికిత్సకుడు శరీరంలో చెడిన అవయవాన్ని ఖండించి శేషించిన అంగాలను కాపాడునట్లు, ఈ కులద్రోహిని, కేశవపక్షపాతిని చంపించి నా కులాన్ని కళంకరహితం చేస్తా..
‘నిలింప ద్వేషులారా (దేవ విరోధులారా)! వీడు చంపదగినవాడే కాని క్షమింపదగినవాడు కాడు. జాలి తలచక నాకు తలవంపులుగా ఉన్న ఈ బాలునికి ముగింపు పలికి నా మనసుకు ఇంపు కలిగించండి. ఈ తెంపరిని పట్టండి, కొట్టండి, బాధలు పెట్టండి, తుద ముట్టించండి’ అని అసురరాజు ఆదేశించాడు. వెంటనే వాడి కోరలు కలిగిన క్రూర రాక్షస యోధులు పెక్కురు జంకు వీడి శూలాయుధులై జాలి చూపక శీలనిధి, పరమసాధువైన ప్రహ్లాదుని పలువిధాల వేధించి బాధించారు.
కం॥ హంతవ్యుఁడు రక్షింపను
మంతవ్యుఁడు గాఁడు యముని మందిరమునకున్
గంతవ్యుఁడు వధమున కుప
రంతవ్యుండనక చంపిరండీ పడుచున్’
నారద ఉవాచ… ధర్మరాజా! ఆ దానవ రాజు కూడా వద్దని వారించలేదు. అందరు అసురులు శూలాలతో పొడుస్తున్నా ఆ పసివాని దేహం ఎందుకో అసలు కందనే లేదు. చర్మం చిట్లలేదు, రక్తం చిందలేదు, చూపు మందగించలేదు, వీపు మీద బాదుతున్నా సుకుమారుని రూపుమారలేదు, ముఖచంద్రం మెరుగు-కాంతి మాయలేదు. దానవులు దయాహీనంగా దండిస్తున్నా కులీనుడైన
ప్రహ్లాదుడు కేశవలీనుడై ఏవిధంగాను దీన భావం పొందలేదు..
‘పాండవాగ్రజా! పైపెచ్చు, రాక్షసులు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నా, హరియందు మది నిలిపి విచిత్రంగా మాటిమాటికి ‘ఓ పన్నగశాయీ! మహాపన్న శరణ్యా! పతితపావనా! దనుజ భంజనా! భక్తరంజనా! మాధవా! మధుసూదనా!’ అంటూ వెన్నుని నుతిస్తాడే గాని కన్నుల నీరు పెట్టడు. భయంతో కంపించడు. అంతగా పీడిస్తున్నా చేతులతో అడ్డుకోడు. అక్కడినుంచి పారిపోడు. బంధుగృహాలలో దూరి దాక్కోడు. ‘ఇంత పాతకమా, కిరాతకమా’ అని పితాశ్రీని పల్లెత్తుమాట అనడు, తల్లి వద్దకు చనడు, కోపం పొందడు, పరితాపం చెందడు, కాపాడమని కోరడు, ఎవ్వరినీ దూషించడు, ద్వేషించడు.
యుధిష్ఠిరా! అపాత్రుడైన పాపాత్ముని పట్ల జరిపే సత్కారాలవలె ప్రహ్లాదునిపై ప్రయోగించిన మారణ క్రియలన్నీ వ్యర్థమైపోయాయి. దితి పుత్రునికి మతిపోయింది. ఇది సత్యనిష్ఠుడైన ప్రహ్లాదుని సత్యాగ్రహం! దీనిని కనక కశిపుని దురాగ్రహం ఢీకొని డీలా పడిపోయింది! సత్యాగ్రహంలో ప్రత్యర్థిని ద్వేషించడం ఉండదు. ఎందుకని? ప్రత్యర్థిలో కూడా సద్రూప పరమాత్మ ఉన్నాడు కదా! ‘సర్వమున్నతని దివ్య కళామయం’ అయినప్పుడు ఎవరిని ద్వేషిస్తాడు? ‘తనయందు నఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు’ కదా ప్రహ్లాదుడు! “ఆగ్రహం’ అంటే తెలుగుభాషలో వలె కోపమని కాక, వదలకుండా గట్టిగా పట్టుకోవడం అని అర్థం. సత్యవస్తువును అలా గ్రహించడం సత్యాగ్రహం. ప్రహ్లాదుడు సర్వశరణ్యుడైన పరమాత్మను (సత్యాన్ని) నమ్ముకుంటే హిరణ్యకశిపుడు తనను హిరణ్యానికి- బంగారానికి (ప్రకృతికి) అమ్ముకున్నాడు. జీవితాన్ని వమ్ము చేసుకున్నాడు. సుఖంలో భగవత్ కృపను అనుభవించువారు సామాన్య భక్తులు. కాని, దుఃఖం కూడా దయానిధి దామోదరుని ప్రసాదమే అని భావించి మోదించేవారు మహాభక్తులు, భాగవతోత్తములు. వారు దుఃఖంలో కూడా వాసుదేవ సేవ, స్మరణలు విస్మరించరు. ‘శిక్షించేవానికి రెండు చేతులైతే రక్షించేవానికి వెయ్యి చేతులు! ఇదే ప్రహ్లాదుని సత్యనిష్ఠ! ఇదే ప్రహ్లాద తత్తం!’ అని గండిక్షేత్ర భూమానందాశ్రమం రామకృష్ణానందస్వామి నిండుగా అభివర్ణించారు. (సశేషం)
ఉ॥ ‘తన్ను నిశాచరుల్ పొడువ దైత్య కుమారుఁడు మాటి మాటి కో
పన్నగశాయి! యో దనుజభంజన! యో జగదీశ! యో మహా
పన్న శరణ్య! యో నిఖిలపావన! యంచు నుతించుఁగాని తాఁ
గన్నుల నీరు దేఁడు, భయకంపసమేతుఁడు గాఁడు భూవరా!’
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006