TTD News | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలను తొలగిపోతాయని విశ్వాసం. వాహనసేవల్లో పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్, ఎమ్మెల్యే , టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మారుతి ప్రసాద్, రామేశ్వరరావు, సంపత్ నారాయణ, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.