ధర్మం.. పాటించేది.
అర్థం.. సంపాదించేది.
కామం.. అనుభవించేది.
మోక్షం.. సాధించేది.
వీటిలో ఒకటి గతి తప్పినా.. మిగిలిన మూడూ అధోగతికి దారితీస్తాయి. ఒకటి శ్రుతిలో లేకపోయినా.. జీవితం లయ తప్పుతుంది. చతుర్విధ పురుషార్థాల పరమార్థాన్ని గ్రహించినప్పుడే.. జన్మకు సార్థకత. జీవితానికి పరిపూర్ణత.
మానవ జన్మకు నాలుగు ప్రయోజనాలున్నాయని మన సనాతన ధర్మం చెబుతున్నది. వాటిని చతుర్విధ పురుషార్థాలు అని పిలుస్తారు. అవే ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటిలో మోక్షమంటే ఆనందం. శరీరం పొందేది సుఖమైతే, మనసుతో పొందేది సంతోషం, కేవలం ఆత్మతో పొందేది ఆనందం. అది శాశ్వతమైంది. మనిషికి సుఖం, సంతోషం ధర్మార్థకామాల వల్ల కలుగుతాయి. ఆనందం మాత్రం మోక్షం వల్ల దక్కుతుంది. అంటే తొలుత మానవ జన్మ ఎత్తిన వారికి కోరికలు తీరాలి. ఆ కోరికలే కామం. అవి తీరాలంటే ధనం కావాలి. అదే అర్థం. ఆ అర్థాన్ని ఆర్జించేందుకు వ్యవసాయమో, ఉద్యోగమో, వ్యాపారమో చేయాలి. అవి న్యాయబద్ధమై ఉండాలి. అదే ధర్మం. అయితే ధర్మ, అర్థ, కామాలు మోక్షానికి దారి చూపేలా ఉండాలని మన మహర్షులు తెలియజేశారు. పురుషార్థాల పరమార్థం అదేనని ఉద్ఘాటించారు.
ధర్మో రక్షతి రక్షితః…
ధర్మం అనే శబ్దానికి కర్తవ్యం, విధి అనే అర్థాలు ఉన్నాయి. వృత్తికి న్యాయం చేకూర్చటం ధర్మం. అలాగే లోకశ్రేయస్సును కలిగించేది ధర్మం. ప్రపంచ ప్రయోజనం కోసం మనం ఆచరించే ధర్మం మనకు కూడా రక్షణగా ఉపయోగపడుతుంది. అందుకే ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్నారు. సమాజంలో ధర్మానికి సమాంతరంగా అధర్మ శక్తులు కూడా పనిచేస్తూ ఉంటాయి. విజ్ఞులైనవారు ఆ వ్యతిరేక శక్తులను చూస్తూ నిర్లక్ష్యం చేయకూడదు. ధర్మ పరిరక్షణ చేయకపోతే జాతి నిర్వీర్యమైపోతుంది. అందుకే మన స్వధర్మాన్ని పాటిస్తూ, సామాజిక ధర్మానికి రక్షకులుగా నిలవాలి. మనిషి తన హక్కుగా, ఎంచుకున్న పనిని చేస్తూ, ధనం సంపాదిస్తూ, కోరికలు తీర్చుకుంటూ సంతోషంగా జీవించటమే ధర్మం.
ధర్మవ్యాధుడు మాంసం అమ్ముకునే వ్యాపారి. కానీ తన వృత్తిని అంకితభావంతో చేస్తూ, తల్లితండ్రుల విషయంలో బాధ్యత కలిగిన కొడుకుగా వ్యవహరిస్తూ, ఆదర్శ గృహస్థుగా జీవించాడు. సర్వసంగ పరిత్యాగులు ఏండ్లుగా తపస్సు చేసి సాధించే బ్రహ్మజ్ఞానాన్ని, గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ పొందగలిగాడు. కష్టాల్లో ధైర్యం కోల్పోక ధర్మం విడువక ఉన్నవారే చరిత్రలో మహనీయులుగా నిలిచిపోయారు. రాముడు పితృవాక్యపరిపాలన అనే ధర్మం ఆచరించకుండా తండ్రిపై తిరుగుబాటు చేసి అయోధ్య నగరాన్ని చేజిక్కించుకొని ఉంటే రామాయణమే ఉండేది కాదు. మనం ఈనాడు ఆయన్ను దేవుడిగా పూజించేవాళ్లమే కాదు! అందుకే ‘ధర్మాత్ముడైన భక్తుణ్ని ధనహీనుణ్ని చేసి భగవంతుడు పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో నెగ్గటమే ధర్మ రహస్యం’ అంటుంది భాగవతం.
అర్థం.. అనర్థం కావొద్దు..
చతుర్విధ పురుషార్థాల్లో రెండోది అర్థం. అంటే జీవన అవసరాలకు కావలసిన సంపద. పుట్టిన క్షణం నుంచి మనిషి గతించే దాకా అడుగడుగునా ధనం అవసరం. బతుకు తెరువు కోసం సక్రమ మార్గంలో ధనార్జన చేయడమే అర్థం. ఈ పురుషార్థ సాధనలో మనకు జనక మహారాజులాంటి వారే ఆదర్శం. పైకి మహారాజు అయినా.. అంతరంగా ఆయన సన్న్యాసిగా జీవించాడు. అర్థాన్ని పుణ్యకార్యాలకు వినియోగించాలి. అర్థానికి మూడు గతులున్నాయని మన సనాతన ధర్మం చెబుతున్నది.
అవి దానం, భోగం, నాశం. ఎవడైతే ఇతరులకు దానం చేయడో, తానూ అనుభవించడో… అలాంటి వ్యక్తి ధనానికి నాశం పడుతుందని సుభాషితం చెబుతున్నది. అందుకే గురుదేవులు రామకృష్ణ పరమహంస ‘ఎవడైతే ధనాన్ని బానిసగా చేసుకొని జీవిస్తాడో, అతడే మనిషి. ధనం సద్వినియోగం తెలియని వారు మనుషులు కారు. ధనం మనిషి స్వభావాన్నే మార్చివేసే ఉపాధి. ధనవంతుడు కాగానే అతడి నైజమే మారిపోతుంది’ అన్నారు. అర్థమే ధ్యేయంగా పెట్టుకొని, ఆదాయమే తప్ప అన్య ఆలోచనలే లేనివారికి తమ నీడను చూసినా భయమే! అంతులేని ఆశలతో, అవధులు లేని ఆరాటంతో వారి జీవితమంతా అశాంతిమయమే! చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలైనట్లు, అత్యాశతో ఆర్జించిన వారి సంపద అనతికాలంలోనే అన్యుల పరమవుతుంది. అందుకే జగద్గురువులు ఆది శంకరాచార్యులు ‘భజ గోవిందం’ శ్లోక పరంపరలో…
‘అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తి తతః సుఖలేశః సత్యమ్
పుత్రాదపి ధనభాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః’॥
‘ధనం ఎల్లప్పుడూ అనర్థాన్నే కలిగిస్తుందని గ్రహించు. ధనంతో సుఖం లేశమైనా లేదు. ఇది సత్యం. ధనవంతులు పుత్రుడి వల్ల కూడా భయపడతారు. ప్రపంచమంతా ఈ రీతిగానే ఉంది’ అని హితవు పలికారు. ఈ శరీర ఆరోగ్యానికి విఘాతం కలిగించే విధంగా ధనం ఆర్జించకూడదు. కోరికలు తీర్చుకోకూడదు.
ధర్మాన్ని అనుసరించే కామం
మూడో పురుషార్థం కామం. ధర్మబద్ధ కామం భగవత్ స్వరూపం. అందుకే ‘ధర్మానికి లోబడి ఉండే కామాన్ని నేనే’ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు. కన్నూమిన్నూ కానకుండా కామమోహులైతే వినాశనం తప్పదు! ఇందుకు రావణాసురుడే నిదర్శనం. రాముడు యవ్వనంలో స్త్రీ వ్యామోహంపై వైరాగ్యాన్ని వ్యక్తం చేస్తూ ‘కేశపాశాలనే చీకట్లతోనూ, చంచల నేత్రాలనే నక్షత్రాలతోనూ, ముఖమనే పూర్ణచంద్రునితోనూ, నవ్వులనే పువ్వులతోనూ విలసిల్లే కామిని అనే దీర్ఘయామిని పురుషుని బుద్ధిని మోహగ్రస్తం చేస్తుంది. వాళ్లను ధర్మకార్యాల నుంచి విముఖులను చేస్తుంది. చివుళ్ల వంటి చేతులూ, తుమ్మెదల వంటి కన్నులూ కలిగి విషలతను బోలిన కాంత, చెంత చేరిన వాళ్లను ఉన్మాదంతో వివశులను చేస్తుంది’ అని హెచ్చరిస్తాడు. మోహాన్ని ప్రేరేపించే ఈ సుందర దేహం ఎప్పటికైనా కాటిపాలు కావాల్సిందే! అయినా మనిషి ఈ అశాశ్వత శరీరం నుంచి ఏదో సుఖాల్ని ఆస్వాదించాలని అర్రులు చాస్తూ ఉంటాడు. ఎంత నీచానికైనా దిగజారుతాడు.
మోక్షమే లక్ష్యం
ఆఖరి పురుషార్థం మోక్షం… అంటే మోహక్షయం. సద్గురువును ఆశ్రయిస్తే సరైన జ్ఞానం కలుగుతుంది. మోక్షాన్ని కాంక్షించేవారు తొలుత మూడు పురుషార్థాల్ని సముపార్జించాలి. సద్గురువును ఆశ్రయించి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి. గురుచరణాలపై భక్తిప్రపత్తులతో మెలిగే సాధకుడు సులువుగా సంసార బంధాల నుంచి విముక్తిని పొందుతాడు. అందుకే చాణక్యుడు ‘ముక్తిని కోరకుంటే విషయ వాంఛలను విషంతో సమానంగా భావించి విడిచిపెట్టు. సహనశీలత, ధైర్యం, సరళత, వినమ్రత, విశ్వాసం, ఔదార్యం, దయ, పవిత్రత, సత్యాలను అమృతంలా స్వీకరించు’ అంటాడు.
అహంకారం నుంచి విముక్తులం కావడమే నిజమైన మోక్షం. అందుకే ఓ భక్తుడు రమణ మహర్షితో ‘భగవాన్ నేను ముక్తి పొందేదెప్పుడు?’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రమణులు ‘ముందు ‘నేను’ నుంచి ముక్తిపొందు. ఆ తరువాత ముక్తి దానంతట అదే వస్తుంది’ అన్నారు. మోక్షం ఎక్కడో పైలోకంలో లభించదు. జీవన్ముక్తులం కావాలి. అదే హైందవ ధర్మం ప్రబోధించేది. అంటే అన్ని బంధాల మధ్య ఉంటూ కూడా నిస్సంగత్వంగా ఉండగలిగితే అదే మోక్షం. అలాగే భగవంతుడికి శరణాగతులైన భక్తులు నిత్యముక్తులు. అందుకే శ్రీనివాసుడికి అంకితమైన అన్నమాచార్య ‘కలిగెనిదె నాకు కైవల్యం…’ అంటూ పాడుకొని పరవశించాడు.
…? మనోజ్ఞ