తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రెండు గంటల పాటు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీ కోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో పార్వతి, ఏఈవో దుర్గరాజు, కంకణబట్టార్ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ రమేశ్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునిరత్నం, జయకుమార్, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.