పూర్వం ఒక రాజు తమ రాజ్యంలోని ప్రజలు ఎలాంటి వారో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో భాగంగా తరచూ మారువేషంలో నగరంలో తిరుగుతుండేవాడు. ఒకానొక రోజు దారి మధ్యలో ఒక పెద్ద బండరాయిని ఏర్పాటు చేయించాడు రాజు. ఆ రాయిని ఎవరు తొలగిస్తారో చూడాలని పక్కనే ఉన్న చెట్టు వెనక్కి వెళ్లి వేచి చూడసాగాడు. ఆ దారి వెంట చాలామంది వ్యాపారులు, సంపన్నులు వెళ్లారు. ఎవరూ ఆ బండరాయిని తొలగించే ప్రయత్నం చేయలేదు. పైగా, ఈ రాజు నిర్వాకం వల్ల దారులు ఇలా తయారయ్యాయి అని విమర్శించారు. కాసేపటికి ఒక పేదవాడు అటుగా వచ్చాడు. రాయిని చూసి ఆగాడు. శక్తినంతా కూడదీసుకొని దాన్ని పక్కకు తప్పించాడు. రాయి కింద ఒక చిన్న పెట్టె కనిపించింది.
అందులో బంగారు నాణేలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. వాటితోపాటు ఓ ఉత్తరమూ గమనించాడు. అందులో ‘ఎవరైతే ఈ బండరాయిని తొలగిస్తారో ఈ నాణేలు వారి సొంతం’ అని రాసి ఉంది. ఇతరులకు సౌకర్యాలు కల్పించడంలో మనం పడే శ్రమ నిజమైన విజయానికి కారణమవుతుంది. తోటివారికి సదుపాయాలు కల్పించాలే కానీ, కష్టాలు కలిగించరాదని ఇస్లామ్ బోధన. మనం నడిచే దారిలో బాటసారులకు ఇబ్బందిపెట్టే రాళ్లు, ముళ్లు ఇలా ఏ వస్తువునైనా తొలగిస్తే దానం చేసిన ఫలితం వస్తుందంటారు ముహమ్మద్ ప్రవక్త. పరుల హితానికి పాటుపడిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుందని పేర్కొన్నారు.