TTD News | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం ముత్యపు పందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలిపారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, గంధంతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు ఊంజల్సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సింహ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించారు. వాహనసేవల్లో పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్, చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, బోర్డు సభ్యుడు పోకల అశోక్ కుమార్ దంపతులతోపాటు ఆగమ సలహాదారులు శ్రీనివాసచార్యులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో 11 రోజుల పాటు జరిగిన శ్రీ కపిలేశ్వరస్వామి హోమం మంగళవారం ఘనంగా ముగిసింది. ఆలయంలో హోమ మహోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉదయం రుద్రయాగం సమాప్తి, మహాపూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం, కలశ ఉధ్వాసన, శ్రీ కపిలేశ్వరస్వామి మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కల్యాణం చేపట్టారు. నవంబరు 23న శ్రీ చండికేశ్వరస్వామి హోమం చేపట్టనున్నారు.