శ్రీశైలం : మల్లన్న భక్తురాలు మల్లమ్మ జయంతోత్సవాన్ని శ్రీశైలంలో ఘనంగా నిర్వహించారు. వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని సోమవారం ఉదయం గోశాల సమీపంలోని హేమారెడ్డి మల్లమ్మ మందిరంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం మల్లమ్మకు నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, సారెను ఈవో లవన్న, ధర్మకర్తల మండలి సభ్యురాలు జీఎం విజయలక్ష్మి సుబ్బరాయుడు రుత్వికులతో జయంతోత్సవ మహా సంకల్పం పఠించారు. స్తోత్రపారాయణాలతో అభిషేకం చేశారు. అనంతరం మల్లమ్మను స్తుతిస్తూ పలు భక్తిగీతాలను ఆలపించారు. వీరశైవ సాంప్రదాయం కలిగిన మల్లమ్మ సంసార జీవితం వదిలి శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జునుడి సేవలో ఉంటూ భక్తులకు శివతత్వాన్ని భోదిస్తూ శివసాయుజ్యం పొందిన మహా భక్తురాలు అని చరిత్ర ఆధారాలు తెలుపుతున్నాయి.
శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకానికి హైదరాబాద్కు చెందిన వీ సరోజిని రూ.10లక్షల విరాళాన్ని అందించారు. ఉదయం పరిపాలనా భవనంలో ఈవో లవన్నతో పాటు ఏఈవో హరిదాస్కు విరాళాన్ని చెక్కురూపంలో అందజేశారు. దేవస్థానం నిర్వహిస్తున్న గణేశ సదనం నిర్మాణ పథకానికి విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దాతకు స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి, ప్రత్యేక పూజలు చేయించి, స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
గోసంరక్షణ నిధికి హైదరాబాద్కు చెందిన టీ శ్రీనివాసరాజు సత్యనారాయణ జ్ఞాపకార్థం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్కు చెందిన ఎం రాంరెడ్డి దంపతులు మరో రూ.లక్ష విరాళాన్ని చెక్కు రూపంలో అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవార్ల దర్శనాలు కల్పించారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు.