‘ఈ భౌతిక జగత్తులో రావణుడిని తలపించే మహా బలసంపన్నులు, ఐశ్వర్యవంతులు చాలా మందే ఉన్నారు. వారెవరి స్థానాలూ సురక్షితం కాదు. ఎందుకంటే వాళ్లు కూడా కర్మబద్ధులే (కర్మణా దైవనేత్రేణ). ప్రకృతి నియమాలకు మనం పూర్తిగా అధీనులమనే విషయాన్ని ఎన్నడూ మరువరాదు. రావణుడు చేసిన పొరపాటు అదే’ అంటారు శ్రీల ప్రభుపాదులు. పరమాత్మ తత్వాన్ని గ్రహించి, అహాన్ని జయించి, అరిషడ్వర్గాలను అధిగమించి.. బతకాలి మనం. అదే రామాయణ సారాంశం, గీతా సారం. దసరా.. సందేశం.
విజయ దశమి రోజున పదితలల రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తాం. కారణం.. త్రేతా యుగంలో ఇదే రోజున అసుర సంహారం జరిగింది. సత్యం నిత్యమై నిలిచింది. ఇంతలోనే ద్వాపర వచ్చింది. సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఈ సారి శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామం ద్వారా.. దుర్మార్గాన్ని నాశనం చేశాడు. ధర్మాన్ని గెలిపించాడు. కలియుగం వచ్చింది… ధర్మం ఒంటి పాదంపై నిలబడే పరిస్థితి దాపురించింది. ప్రతి ఇల్లూ లంకలా మారింది. ప్రతి బుర్రలో దశకంఠుడు తిష్ఠ వేశాడు. త్రేతాయుగంలో రావణుడు చేసిన పొరపాటునుమనమూ చేయకుండా.. మనలోని అసుర ప్రవృత్తిని దసరానాడు దహించి వేయాలని చెబుతారు శ్రీల ప్రభుపాదులవారు.
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్
‘ఓ అర్జునా! కామం, క్రోధం, లోభం అనేవి మూడు నరకద్వారాలు. అవి ఆత్మ నాశకరములు. వివేకులు వాటిని తక్షణం త్యజించాలి’ అని బోధించాడు పరమాత్ముడు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అసురప్రవృత్తికి కారణాన్ని, దాంతోపాటే పరిష్కారాన్నీ సూచించాడు. నిజానికి కామ, క్రోధాదుల్ని మనం పట్టుకొని ఉంటే కదా.. వదిలేయడానికి. అవే మనల్ని పట్టుకొన్నాయి. బానిసలుగా చేసి ఆడిస్తున్నాయి.
దశకంఠుడు.. మరణాన్ని జయించాలని తపించాడు. ఆ మేరకు బ్రహ్మ నుంచి వరం పొందాలనుకున్నాడు. తాను మృత్యువును శాసించలేనంటూ బ్రహ్మ తప్పించుకున్నాడు. పరిమితులతో కూడిన వరాన్ని ఇచ్చాడు. అయినా తనకు తిరుగేలేదని విర్రవీగాడు అల్ప సంతోషి అయిన రావణుడు.
గీతాచార్యుడు. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించినవానికి పుట్టుక తప్పదు. మనమంటే.. బాహ్యంగా కనిపిస్తున్న అశాశ్వతమైన ఈ దేహం కాదనీ, మనం శాశ్వతమైన ఆత్మ స్వరూపులమని గుర్తించాలి. మరణమనేది ఈ దేహానికే కాని, మనకు కానేకాదని తెలుసుకోవాలి. ఈ మహత్తరవరాన్ని భగవంతుడు ఇదివరకే మనకు ప్రసాదించేశాడు. మనం ఆరాటపడాల్సిందల్లా ధర్మనిర్వహణ గురించి మాత్రమే. రావణుడిలా దేహ శాశ్వతత్వం కోసం కాదు.
ఒకానొకసారి వాలి రావణుడిని తోకతో చుట్టి సప్తసముద్రాల రుచి చూపించాడు. మరొకసారి దశకంఠుడు కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి సిద్ధపడి.. భంగపడ్డాడు. ఇలా పలుమార్లు గర్వభంగం కలిగినా అతను మారలేదు. ప్రవృత్తిని మార్చుకోలేదు. ఇది అసుర లక్షణం. ఈ ఘట్టం వాల్మీకి రామాయణంలో లేదు కానీ, పరమశివుడు పార్వతీదేవికి బోధించినట్టుగా చెప్పే ‘శివ రామాయణం’లో ప్రస్తావితమైంది. సీతా స్వయంవరంలో రావణుడు శివ ధనుస్సును ఒంటిచేత్తో ఎత్తేందుకు ప్రయత్నించాడు. అతికష్టం మీదపైకెత్తినా.. వింటినారిని అందుకునే ప్రయత్నంలో ధనుస్సు పట్టుతప్పింది. పది తలలనుంచి రక్తం ప్రవహించింది.
రామచంద్రుడు మాత్రం అవలీలగా శివ ధనుస్సు ఎక్కుపెట్టాడు. అప్పుడే కనుక, రావణ బ్రహ్మ మేల్కొని ఉంటే.. సీతమ్మ తల్లిని మోహించేవాడే కాదు. పరిస్థితి యుద్ధం వరకూ వచ్చేదే కాదు. చివరికి భార్య మండోదరి హితవును చెవికెక్కించుకున్నా సరిపోయేది. రణ క్షేత్రంలోనూ అతనికి చివరి అవకాశం వచ్చింది. తనవారంతా నేలకొరిగిన తర్వాత.. రావణుడు తానే స్వయంగా రామునిపై యుద్ధానికి దిగాడు. రామ బాణాలకు తాళలేక.. నిర్వీర్యుడై నిలుచుండిపోయాడు. ఆ పరిస్థితిలో శ్రీరాముడు మరుసటి రోజు యుద్ధాన్ని కొనసాగిస్తానని చెప్పి.. రావణుడికి మరో అవకాశాన్ని ప్రసాదించాడే కానీ వధించలేదు. అప్పుడైనా ఆ అసురపతి వాస్తవాన్ని గ్రహించాల్సింది. శరణు వేడాల్సింది. మూర్ఖంగా మరుసటి రోజు బరిలో నిలిచి శ్రీరామచంద్ర ప్రభు చేతిలో హతుడయ్యాడు.
…?సత్య గౌర చంద్రదాస