ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో కేరళలోని గురువాయూర్ ఒకటి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ గురువాయురప్పన్గా వెలిసి భక్తజన కల్పవృక్షంగా భాసిస్తున్నాడు. ఈ క్షేత్రంలోనే నారాయణీయం అన్న స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మానవుడు ఎదుర్కొనే ఆధి వ్యాధులు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. ఇది మేల్పుత్తూర్ నారాయణ భట్టతిరి సంస్కృతంలో స్తోత్ర రూపంలో చేసిన అద్భుత రచన. దీని ఆవిర్భావం వెనుక ఆసక్తికర కథ ఒకటి ప్రచారంలో ఉంది.
పదహారేళ్ల ప్రాయానికే వేదాధ్యయనాన్ని, సంస్కృత వ్యాకరణాన్ని ఆపోశన పట్టిన అసమాన ధీశాలి నారాయణ భట్టతిరి. తన గురువైన అచ్యుతపిషారతి క్షయ వ్యాధితో బాధ పడుతుండటం చూసి నారాయణ భట్టతరి ఎంతో కుమిలిపోయాడు. గురుదక్షిణగా ఆ వ్యాధిని భగవత్ ప్రార్థనతో తనకు బదిలీ చేసుకుంటాడు. తరువాత గురువాయూర్ చేరుకుని తన వ్యాధిని తగ్గించమని వేడుకుంటూ రోజుకు ఒక దశకం చొప్పున స్తుతి చేయడం ప్రారంభించాడు. ప్రతి శ్లోకం చివర తన వ్యాధిని నయం చేయమని భగవంతుడిని వేడుకుంటాడు.
ఈ విధంగా 1036 శ్లోకాలు పూర్తయ్యేసరికి ఆయన వ్యాధి పూర్తిగా తగ్గడంతో పాటు దైవ సాక్షాత్కారం కూడా లభించింది. వేదవ్యాసుడు పద్దెనిమిది వేల శ్లోకాలతో రచించిన భాగవతానికి సంక్షిప్త రూపంగా అసాధారణ ప్రజ్ఞతో నారాయణీయం రచించాడు భట్టతిరి. ఇప్పటికీ గురువాయూర్ దేవాలయంలో ఈ పారాయణాన్ని చేయడం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.నడిచే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నారాయణీయం మొత్తం పారాయణం చేయలేని వారి కోసం ఒక దగ్గరి దారిని చూపారు.
అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే
త్వమిత్థ ముత్థాపిత పద్మయోనిః
అనంత భూమా మమ రోగరాశిం
నిరుంధి వాతాలయవాస విష్ణో
నారాయణీయంలోని ఎనిమిదో దశకంలోని పదమూడవ శ్లోకం ఇది. నిత్యం 108 సార్లు చొప్పున, 48 రోజులు పాటు భక్తి విశ్వాసాలతో ఈ శ్లోకం పారాయణం చేస్తే వైద్యానికి లొంగని మొండి రోగాలు సైతం ఉపశమిస్తాయని ప్రతీతి. పరమాచార్యుల సూచన మేరకు శ్లోకపారాయణం చేసి ప్రయోజనం పొందిన వారెందరో ఉన్నారు.
– డా॥ చెప్పెల హరినాథ శర్మ