అనంతుడిపై అత్యంత సుందరంగా పవళించి.. అనంత విశ్వాలనూ కాపుకాసే దేవుడు అనంత పద్మనాభుడు. స్వామి రూపంలో స్థితి మాత్రమే గోచరించదు. సృష్టికర్తతోపాటు, లయకారుడి తత్వాలూ స్వామి చిత్తరువులో దర్శనమిస్తాయి. అంటే సృష్టి, స్థితి, లయ తత్వాలకు ప్రతిబింబం స్వామి. పన్నగ శయనుడికి కావేరీ తీరం అచ్చొచ్చిందేమో! ఈ నదీమతల్లి తటిపై ఆది (శ్రీరంగపట్నం), మధ్య (శివసముద్రం), అంత్య (శ్రీరంగం) రంగాల్లో కొలువుదీరి భక్తుల హృదయాంతరంగాల్లో నయన మనోహరుడిగా పేరొందాడు.
కావేటి రంగడు మన తెలుగు రాష్ర్టాల్లో రంగనాథుడిగా పలు ఆధ్యాత్మిక కేంద్రాల్లో వెలిసి నిత్యపూజలు అందుకుంటున్నాడు. ఆ స్వామి సేవలో తరించే అవకాశం కల్పిస్తుంది ‘అనంత పద్మనాభ వ్రతం’. భాద్రపద శుద్ధ చతుర్దశి సందర్భంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కష్టాలు తీరిపోవాలని, కోరికలు నెరవేరాలని ఈ వ్రతం నిర్వహిస్తారు. అరణ్యవాసంలో ఉన్న పాండవులు.. శ్రీకృష్ణుని సలహా మేరకు అనంత పద్మనాభ వ్రతం చేశారని పురాణ కథనం. ఆధ్యాత్మిక సాధనకు, ధర్మకామ్య సిద్ధికి అనంత వ్రతం ఉత్తమ సాధనంగా చెబుతారు.
పద్మనాభుడి అర్చనలో మహావిష్ణువు పానుపు అయిన అనంతుడిని ఆరాధిస్తారు. వ్రతం విధివిధానాలు భవిష్యోత్తర పురాణంలో వివరించారు. పిండితోగానీ, దర్భలతోగానీ ఏడు పడగల సర్పాన్ని తయారుచేసి అష్టదళ పద్మమంటపంపై గానీ, కలశంపై గానీ అనంతస్వామిని ప్రతిష్ఠించి షోడశోపచార పూజలు నిర్వర్తిస్తారు. కలశంలో పవిత్ర జలాలలో యమునా నదిని ఆవాహన చేసి వ్రతం కొనసాగిస్తారు. పూజలో భాగంగా 14 ముడులు కలిగిన ఎర్రని తోరాలను స్వామి దగ్గర ఉంచుతారు. తోరాలలోని 14 ముడులు ఒక్కో దేవతకు సంకేతంగా చెబుతారు.
దిక్పాలకులు, రవి, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, యముడు, బ్రహ్మ, చంద్రుడు, జీవుడు, శివుడు, వాయువు, అశ్విని దేవతల సాక్షిగా వ్రతాన్ని ఆచరిస్తున్నామని ఈ ముడుల ద్వారా తెలియజేస్తారు. వ్రత పరిసమాప్తి తర్వాత వాటిని దంపతులు తమ చేతులకు ధరిస్తారు. ఈ వ్రతాన్ని పాలీ చతుర్దశి వ్రతం అనీ, కదళీ వ్రతం అనీ పిలుస్తారు. ఒకసారి వ్రత దీక్షను స్వీకరించిన దంపతులు ఏటా తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది. కుదరని పక్షంలో ఎవరైనా వ్రతంలో ఉంచిన తోరాలనైనా తప్పనిసరిగా ధరించాలని పెద్దలు చెబుతారు. పౌర్ణమితో కూడుకున్న చతుర్దశి అయితే అనంత వ్రతానికి మరింత శ్రేష్ఠమని పెద్దల మాట.
– శ్యామ్ప్రసాద్