నియమబద్ధంగా జీవించడం కష్టమైన పనేం కాదు! మనసు పెడితే అందరికీ సాధ్యమయ్యేదే!! అందుకోసం తపస్సు చేయాల్సిన పనిలేదు. క్రతువులు నిర్వహించాల్సిన అవసరం అంతకన్నా లేదు! మరేం చేయాలి? మనలోకి మనం తొంగి చూసుకోవాలి. మన తప్పులను మనం తెలుసుకోవాలి. వాటిని అంగీకరించాలి. ఆ తర్వాత సంస్కరించుకోవాలి. మారిన మనసే దేవాలయం. మానసిక పరివర్తన పొందిన మనిషే మహోన్నతుడు! సత్ ప్రవర్తనను అలవర్చుకోవడం ఆధ్యాత్మిక సాధనలో తొలి సోపానం. ఆ తర్వాత సాగించే ప్రయాణంలో భగవంతుడు సంరక్షకుడిగా వెంట ఉంటాడు.
ఒక ఉన్నతోద్యోగి రోజూ నిష్ఠగా పూజలు, యోగా, ప్రాణాయామం చేసేవాడు. నియమబద్ధంగా గుళ్లకు, ఆశ్రమాలకు వెళ్లడం అతనికి అలవాటు. కానీ, ఆయన ముక్కోపి. రోజూ భార్యను, పిల్లల్ని కొడుతూ ఉండేవాడు. అతని స్నేహితులు అసహనంతో ‘ఇంకేం లాభం! యోగ, ప్రాణాయామం, పూజాదికాలు మానేయొచ్చు కదా!’ అనేవారు. కానీ ఆ ప్రబుద్ధుడు ‘లేదు! లేదు! వాటిని ఎలా మానతాను? అవి నా ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో ఉపయోగపడతాయి’ అనేవాడట. ఇక లాభం లేదని అతణ్ని రామకృష్ణ సంఘం సాధువు దగ్గరికి తీసుకువెళ్లారట స్నేహితులు. ‘కట్టుకున్న భార్యను, ఇంట్లో పిల్లల్ని ప్రేమించకుండా, ఇతరులతో సౌమ్యంగా మెలగకుండా నువ్వు ఎన్ని సాధనలు చేసినా ఫలితం ఉండదు. ముందు ప్రవర్తన మార్చుకో. అప్పుడు దేవుడి సంగతి ఆలోచించుకోవచ్చు’ అని ఉపదేశించారు ఆ సాధువు.
దైవభక్తి, ధర్మనిరతిది అనులోమానుపాత, అవినాభావ సంబంధం. ఒకటి పెరిగితే, సమస్థాయిలో రెండోదీ పెరుగుతుంది. పాపభీతి, ధర్మనిరతి కవలల్లాంటివి. ఈ రెంటికీ ఒక దానితో మరోదానికి విడదీయరాని సంబంధం ఉంది. దైవప్రీతి పెరిగే కొద్దీ పాపభీతి కూడా పెరుగుతుంది. అలాగే ,పాపభీతి కలిగే కొద్దీ దైవప్రీతి పెరుగుతుంది. అందుకే ‘మృదుత్వం, సరళత’ ఈ రెండూ దైవభక్తి గలవారి జీవితాన్ని నడిపించే ప్రధానసూత్రాలు’ అంటారు రామకృష్ణ పరమహంస. ధర్మాన్ని తప్పి ప్రవర్తించేవారు ఎన్ని పూజలు చేసినా ఫలితం శూన్యమే. అది ఆత్మవంచన, పరమాత్మ వంచన.
సద్వర్తనే సాధన
సమాజంలో చాలామంది తమ సాధనలన్నిటినీ యాంత్రికంగా మారుస్తున్నారు. సాధనలు, ఆచారాలు, పూజాదికాలు వీటన్నిటి వెనుక ఉన్న జ్ఞానాన్నీ, తత్వాన్నీ అర్థం చేసుకోకుండా, నిత్యజీవన ప్రవర్తనతో అన్వయించుకోకుండా మొక్కుబడిగా ముగించేస్తుంటారు. మనసులో దయ, కరుణ, ప్రేమ పెంచుకోకుండా ఆచరించే సాధనలు బూడిదలో పోసిన పన్నీరే! ‘కోపం, మూర్ఖత్వం, కపటం, అసూయ, అహంకారం, చెడు ఆలోచనలు తదితరమైనవి అపరిశుద్ధ మనో లక్షణాలు. శాంతం, సహనం, ప్రేమ, కరుణ, సేవాభావం గల మనస్సులే పరిశుద్ధమైనవి’ అంటాడు గౌతమబుద్ధుడు. అందుకే ఆయన ‘దైవం’ అనే ప్రస్తావన తేకుండా ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్నాడు. సంప్రదాయ, ఆచార వ్యవహారాల నుంచి లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే మనదేశంలో ఇంకా చాలామంది ధార్మిక విషయాలకు సంబంధించిన ప్రాథమిక అవగాహనలోనే ఉన్నారు. కొందరు మేధావులు, పండితులు కూడా మతాన్ని ఆచారాలకే పరిమితం చేస్తున్నారు.
మనకెందుకులే అనుకుంటే
అధర్మాన్ని ఎదుర్కోవటం కూడా ఆధ్యాత్మిక ఉన్నతే! ధర్మోద్ధరణలో భాగమే! కండ్ల ముందు జరుగుతున్న అధర్మాన్ని, అన్యాయాన్ని అడ్డుకోకపోతే ఎలాంటి తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుసుకోవడానికి కురుక్షేత్రమే సాక్ష్యం. అందుకే ‘ధర్మం అధర్మం వల్ల బాధకు లోనై తీర్పు కోసం వస్తే, దాన్ని తీర్చని సభ్యులు అధర్మం కారణంగా బాధపడాల్సి వస్తుంది. భయం, బెరుకు విడిచి అధర్మాన్ని అడ్డుకోనినాడు, ఆ అధర్మంలో నాల్గో భాగం కుటుంబసభ్యులకు, మరొక నాల్గో భాగం పాలకులకు, మిగిలింది కర్తకు సంక్రమిస్తుంది’ అని మహాభారతం స్పష్టం చేసింది. నేటి సమాజంలో కూడా అనేక సందర్భాల్లో మన ప్రవర్తన, ప్రతిస్పందన కూడా ఆనాటి సభాపర్వాన్నే తలపిస్తూ ఉంటాయి. మన ఎదుటే ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నా ‘మనకెందుకులే!’ అన్న ఉదాసీన ధోరణే అత్యధికం. జోక్యం చేసుకుంటే ఎక్కడ మన తలకు చుట్టుకుంటుందోననే బాధ్యతా రాహిత్యం పౌర ధర్మానికే కాదు, మానవత్వానికే విఘాతం. అభాగినుల విషయంలో కావచ్చు, అనైతిక విషయాల్లో కావచ్చు.. ఎక్కడైనా నీతి, న్యాయాలను సమర్థించగలిగే ధైర్యం లోపించిన నాడు, మనం ఆధునిక సమాజంలో నివసిస్తున్నా ఆటవికులతో సమానమే! అందుకే ఆనాడు పాండవులపై కౌరవులు ప్రదర్శిస్తున్న పక్షపాతాన్ని ప్రతిఘటిస్తూ, స్థితప్రజ్ఞతకు సాకారమైన శ్రీకృష్ణ భగవానుడు కూడా ఒకింత తీవ్ర స్వరంతో… ‘సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే
బారము పొందలేక చెడబారినదైన యవస్థ, దక్షు లె వ్వారలుపేక్ష సేసిరది వారల చేటగు…’- ‘పాపం వల్ల ధర్మం, అసత్యం వల్ల సత్యం గట్టెక్కలేక చెడిపోయిన దుస్థితిలో ఉన్నప్పుడు సమర్థులైనవారు దానిని ఉపేక్షిస్తే, అది వారి తప్పవుతుందని, అది వారికి కీడూ కలిగిస్తుంద’ని హెచ్చరించాడు.
ఆత్మపరిశీలనా ఆధ్యాత్మికతే
పారమార్థికంగా పురోగమిస్తున్న వ్యక్తి ఇతరుల ప్రవర్తనను సరిదిద్దే ముందు తొలుత తన ప్రవర్తనపై దృష్టిపెడతాడు. తనలోని లోపాల్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తాడు. అందుకే భక్త కబీర్ ఆత్మపరిశీలన ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ ‘నేను బయట ప్రపంచంలో ఎంతోమంది దుష్టులు ఉన్నారని అనుకునేవాడిని. కానీ, ఒక్కసారి నా హృదయంలోకి తొంగి చూసుకున్నప్పుడు, ఈ ప్రపంచంలో నా కన్నా పరమదుష్టుడు వేరొకరు లేరని నాకు అర్థమైంది’ అంటాడు. మనల్ని అశాంతికి గురిచేసే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే మాలిన్యం మన మనసు నుంచి తొలగిపోయేందుకు ఆత్మపరిశీలన ఎంతగానో దోహదపడుతుంది. కానీ, మన మనసులోకి తొంగి చూసుకునేందుకు మనకు సమయం ఉండదు. ఇష్టం ఉండదు. నిజానికి మన మనసులోని మాలిన్యాన్ని పరిశుభ్రం చేసుకోగలిగితే అంతా నిర్మలంగానూ, ప్రశాంతంగానూ ఉంటుంది.
అప్పుడే జీవనసార్థకత
అన్యుల నుంచి అరువుగా తెచ్చుకున్న వస్తువుకు అధిక శోభను చేకూర్చి మరీ, అతి భద్రంగా అప్పజెప్పే వారు ఉత్తములు. ఆ వస్తువును స్వప్రయోజనాలకు అవసరమైనంత వినియోగించుకొని యథారూపంలో తిరిగి ఇచ్చేసేవారు మధ్యములు. సదరు వస్తువు రూపురేఖల్ని మార్చి అధ్వానంగా ముట్టజెప్పేవారు అధములు. భగవంతుడు మనకు ఇచ్చిన మానవజన్మ విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. మనిషిగా పుట్టించినందుకు పరమాత్మకు కృతజ్ఞతగా సార్థక జీవనాన్ని గడిపి, నలుగురి జీవితాల్లో వెలుగులు నింపి ఆయన పేరును నిలబెట్టేవారు ఉత్తములు. ‘నా చిన్నిపొట్టకు శ్రీరామరక్ష’ అనుకుంటూ ‘నేను, నా వాళ్లు’ అంటూ స్వార్థపరులుగానే గడిపేవారు మధ్యములు. భగవంతుడు నిర్దేశించిన ధర్మమార్గాన్ని అతిక్రమించి, అస్తవ్యస్త జీవనాన్ని గడుపుతూ, వచ్చిన మానవజన్మను వృథా చేసుకునేవారు అధములు. కానీ లోకంలో అధిక శాతం జన్మ పరంపరలు రెండో, మూడో విభాగాలకే పరిమితమైపోతున్నాయి. అందుకే ‘ముందు మనిషిగా జీవించటం అలవరచుకో. మానవత్వాన్ని ఇనుమడింపజేసుకో! అప్పుడు దేవుడు, మతం గురించి ఆలోచించవచ్చు. సహృదయుడు, సత్ ప్రవర్తన కలిగినవాడు తనను స్మరించకపోయినా, అతనికి భగవంతుడు సర్వత్రా సంరక్షకుడిగా ఉంటాడు’ అనేవారు స్వామి వివేకానంద.