శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆఖరి సోమవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా జరిపించినట్లు ఈవో లవన్న తెలిపారు. అర్చక వేదపండితులచే ఉభయ దేవాలయాల్లో నిత్యకైంకర్యాలతోపాటు పరివార దేవతలకు షోడశోపచార పూజలు చేశారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అధికారిక ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులంతా ఆదిదంపతులను దర్శించుకుని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్తీక నిత్యపూజల్లో భాగంగా ప్రదోషకాలంలో ప్రధాన ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపానికి ప్రత్యేక పూజలు చేసి, దీపాన్ని వెలిగించారు.
అనంతరం స్వామిఅమ్మవార్లను పల్లకిలో వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం పుష్కరిణి వద్దకు చేరుకొని సంకల్ప పూజాధికాలు నిర్వహించారు. అనంతరం లక్ష దీపార్చనలో భాగంగా భక్తులచే దీపాలు వెలిగింపజేశారు. దశవిధ హారతుల దర్శన భాగ్యాన్ని తెలుపుతూ ప్రవచనపూర్వక కార్యక్రమాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తిలకించి ఆది దంపతుల ఆశీస్సులు అందుకున్నారు. పుష్కరిణి వద్ద జరిగిన కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు భద్రయ్య, మార్కండేయ శర్మ, ముఖ్యార్చకులు హరిస్వామి, సత్యనారాయణ శర్మ, నగేష్, గౌతమ్, ఈఈ మురళీబాలకృష్ణ, ఏసీ నటరాజ్, ఆలయ పర్యవేక్షకులు శ్రీహరి, శ్రీశైలప్రభ సంపాదకులు అనీల్కుమార్, పీఆర్వో శ్రీనివాసరావు, ఆలయ ముఖ్య భద్రతా అధికారి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
శ్రీశైల సుందరీకరణకు చర్యలు : ఈవో లవన్న
శ్రీశైల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణంతోపాటు యాత్రికులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రకృతి పరమైన సుందరీకరణ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. అందులో భాగంగా సోమవారం సాయంత్రం వాటర్ ఫౌంటేయిన్ను పునః ప్రారంభించారు. క్షేత్రంలో వివిధ ప్రాంతాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసి నిర్వహణ లేక మరుగునపడిన సుమారు పది ఫౌంటేయిన్లకు గత కొన్ని రోజులుగా మరమ్మతులు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం క్యూలైన్లకు సమీపంలో ఉండే ఫౌంటేయిన్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.