HomeDevotionalKurma Is The Second Avatar Of The Hindu Preserver Deity Vishnu
నమో కూర్మనాథ!
శ్రీమహావిష్ణువు అవతారాల్లో అన్నిటికన్నా భిన్నమైనది శ్రీకూర్మం. నేరుగా రాక్షస సంహారం చేయకపోయినా.. మానవలోకానికి అనంతమైన సందేశాన్ని కూర్మావతారం అందిస్తుంది.
చేయదలచిన కార్యం భారమైంది. కొండంత కష్టం వచ్చిపడింది. అమృతాన్ని ఆస్వాదించి అమరత్వం పొందాలన్న సురాసురుల ఆశలు.. పాల కడలి పాలు కాబోతున్నాయి! దేవతలంతా చేతులెత్తేసి శ్రీహరిని ప్రార్థించారు. క్షీరాబ్దిలో శేషతల్పంపై సేదతీరుతున్న విష్ణుమూర్తి కాగల కార్యాన్ని తన వీపున ఎత్తుకున్నాడు. కూర్మ రూపంలో వచ్చి మందరగిరిని నిలిపాడు. దేవదానవులు వాసుకితో భారీ పర్వతాన్ని చిలుకుతుంటే.. అది బొంగరంలా గిరగిరా తిరగడం ఆరంభించింది. మందరగిరి రాపిడిని తట్టుకుంటూ కూర్మరాజు కదలక మెదలక తన విధిని నిర్వర్తించాడు. చివరికి అమృతం ఉద్భవించింది. చేపట్టిన పని ఎంత కష్టమైనా.. నిలబడితేనే విజయం వరిస్తుందని శ్రీ మహావిష్ణువు కూర్మనాథుడిగా వచ్చి ఇచ్చిన సందేశం.
మంధనాచల ధారణహేతో దేవాసుర పరిపాల విభో
కూర్మాకార శరీర నమో భక్తం తే పరిపాలయమామ్
శ్రీమహావిష్ణువు అవతారాల్లో అన్నిటికన్నా భిన్నమైనది శ్రీకూర్మం. నేరుగా రాక్షస సంహారం చేయకపోయినా.. మానవలోకానికి అనంతమైన సందేశాన్ని కూర్మావతారం అందిస్తుంది. క్షీరసాగర మథన సమయంలో సముద్రంలోకి కుంగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టడానికి శ్రీహరి కూర్మావతారాన్ని ధరించిన విషయం తెలిసిందే. భాగవతం, బ్రహ్మ పురాణంలో కూర్మావతారానికి సంబంధించిన గాథలు విస్తారంగా కనిపిస్తాయి. క్షీరసాగర మథన సమయంలో ఆవిర్భవించిన నాటి నుంచి మహావిష్ణువు కూర్మరూపుడై జంబూద్వీపంలో అవతరించి, అర్చనలు అందుకుంటున్నట్లు బ్రహ్మపురాణం చెబుతున్నది.
కూర్మం స్థిరత్వానికి ప్రతీక. కూర్మం అంటే ప్రపంచానికి ఆధార భూతమైనవాడు, సృష్టికర్త అని పురాణాలు చెబుతున్నాయి. ‘కం జలం ఊర్వతీతి హినస్తేతి కూర్మః’ అని వ్యుత్పత్తి. అంటే నీటిలోని క్రిములను సంహరించేది అనే అర్థం. కూర్మానికి నీటిలో క్రిములను, మురికిని నశింపజేసే గుణం ఉంది. అందువల్ల్ల దానికి ఆ పేరు వచ్చింది. లౌకిక అర్థంలో సాధారణ నీటిలో ఉన్న క్రిములను నశింపజేస్తే… ఆధ్యాత్మిక కోణంలో భవసాగరంలో మునిగిన మనిషిలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే క్రిములను నశింపజేసేవాడు కూర్మనాథుడు అని భావించవచ్చు.
కూర్మనాథుడే సృష్టికర్త అనే కథ కొన్ని పురాణాలు, ఇతిహాస గ్రంథాల్లో కనిపిస్తుంది. ఈ కథనం ప్రకారం బ్రహ్మ సృష్టి చేయడానికి పూనుకుని దేనిని ముందు సృష్టించాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ దశలో తన శరీరాన్ని కదిలించగా, అందులోనుంచి కొన్ని రుషి సంఘాలు పుట్టాయి. వారే అరుణులు, కేతులు, వాతరశనులు. ఆయన గోళ్ల నుంచి వైఖానసులు, వెంట్రుకల నుంచి వాలఖిల్యులు జనించారు. అదే సమయంలో బ్రహ్మ శరీరంలోని సారం అంతా ఒక పెద్ద కూర్మంగా రూపాంతరం చెంది నీటిలో సంచరించడం మొదలుపెట్టింది. దానిని చూసిన ‘బ్రహ్మ నువ్వు నా శరీర మాంస సారం నుంచి పుట్టావు కదా?’ అని ప్రశ్నించగా, ఆ కూర్మం ‘నేను నీ కన్నా ముందు నుంచీ ఈ జలంలో ఉన్నాను’ అని చెప్పిందట. దానితో బ్రహ్మ ఆ కూర్మమే పరమాత్మ అని గ్రహించాడు. ‘నీవు నాకన్నా ముందు నుంచీ ఉన్నవాడవు కనుక కురుష్వ (సృష్టి చెయ్యి)’ అన్నాడట బ్రహ్మదేవుడు. అప్పుడు కూర్మనాథుడు సూర్యుడు, ఇంద్రుడు, అగ్ని తదితరాలను సృష్టించాడట. ఇలా జగన్నిర్మాణ కర్మ చేయటం వల్ల ఆయనను ‘కూర్మః’ అని పిలిచారని ఈ కథనం చెబుతున్నది.
జలంలో నివసించే కూర్మం, తనకు గమన సంకల్పం కలిగినప్పుడు కరచరణాలు కదిలిస్తుంది. సంకల్ప రహితంగా ఉన్నప్పుడు స్తంభించి ఉంటుంది. అవసరం లేనప్పుడు ఇంద్రియాలను సుఖాల నుంచి మరల్చడమే స్థితప్రజ్ఞత. దానితోపాటు బహిర్ముఖ ప్రవృత్తి నిలుపు చేసుకొని అంతర్ముఖ ప్రవృత్తిలోకి వెళ్లగలిగే చిత్తవృత్తికీ కూర్మం ప్రతీక.
కూర్మానికి నీటిలో క్రిములను, మురికిని నశింపజేసే గుణం ఉంది. లౌకిక అర్థంలో సాధారణ నీటిలో ఉన్న క్రిములను నశింపజేస్తే… ఆధ్యాత్మిక కోణంలో భవసాగరంలో మునిగిన మనిషిలో ఉండే అరిషడ్వర్గాలనే క్రిములను నశింపజేసేవాడు కూర్మనాథుడు అని భావించవచ్చు.
కూర్మావతారం మనిషికి మహత్తమరమైన సందేశాన్ని అందిస్తుంది. పట్టుదల, ఓర్పు, సహనం మనిషికి తప్పనిసరిగా ఉండాలని, అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని కూర్మ రూపంలో ఆచరణాత్మక సందేశం ఇచ్చాడు మహావిష్ణువు. మనం ఏమైనా గొప్ప కార్యం తలపెట్టిప్పుడు ఆ పని భారం మందర పర్వతం తీరులో చాలా బరువుగా అనిపించి ఒకొక్కసారి వదిలేయాలనే నిరుత్సాహం కలుగుతుంది. దీనికితోడు కార్యసాధనలో మనకు కలిగే అసహనం మందరగిరికి కట్టిన వాసుకి సర్పం విడిచే విషజ్వాల్లాగా పరిస్థితులను మరింతగా వేడెక్కిస్తాయి. ఇలా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, పట్టువదలకుండా స్థిరంగా ఉంటేనే అమృతం పుట్టినట్లు మన కార్యం విజయవంతమై, ఆశించిన లక్ష్యసాధన అనే అమృతం పుడుతుందని కూర్మం సందేశాన్నిస్తుంది. ఈ విషయాన్ని అర్థంచేసుకొని, ఆచరిస్తే మానవ జీవితం అమృతమయం అవుతుంది అనడంలో సందేహం లేదు.