Koil Alwar Tirumanjanam | తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 18 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా 7న మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కొనసాగుతుంది.
ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా కుంకుమార్చన సేవ, బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.