మానవాళికి సన్మార్గం చూపడానికి వచ్చిన ప్రవక్తలందరూ మానసిక, ఆధ్యాత్మిక బోధకులే. ‘నేను ఒక ఉపాధ్యాయునిగా మాత్రమే పంపి ఉన్నాను’ అని ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గర్వంగా ప్రకటించారు. సమాజానికి జ్ఞానాన్ని పంచే ఉపాధ్యాయులు ప్రవక్తల ఆశయాలకు వారసులుగా నిలుస్తారు. అందుకే అల్లాహ్ కూడా ఖురాన్లో… జ్ఞానాన్ని కలిగి ఉండి, దానిని నలుగురికీ పంచేవారి హోదాలను పలు రెట్లు పెంచుతానని వాగ్దానం చేశాడు.
ఉపాధ్యాయుడు చనిపోయినా, ఆయన నేర్పిన మంచి విద్య పదికాలాల పాటు సమాజానికి ఉపయోగపడుతున్నంత కాలం ఆ పుణ్యం ఆయన ఖాతాలో చేరుతూనే ఉంటుంది. ‘మానవుడు మరణించాక కూడా ఆగకుండా వచ్చే పుణ్యాలలో నిరంతరం ఉపయోగపడే జ్ఞానం ఒకటి’ అని ప్రవక్త వచనం.
ఉపాధ్యాయుని గురుతర బాధ్యతలు
సమగ్ర విద్య (ఇల్మ్): కేవలం ధార్మిక అంశాలే కాక సైన్స్, గణితం, వైద్యం లాంటి లౌకిక విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించడం.
నైతిక తీర్చిదిద్దడం (తజ్కియా): పుస్తక పాఠాలతో పాటు ఓర్పు, వినయం, సత్ప్రవర్తన (అఖ్లాఖ్) పెంపొందించడం.
ఆచరణాత్మక ఆదర్శం: తాము చెప్పే నైతిక విలువలను స్వయంగా ఆచరించి చూపి ఆదర్శంగా నిలవడం.
ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం: ఒక కన్నతండ్రిలా విద్యార్థుల మేధోపరమైన, వ్యక్తిగత సమస్యలను కరుణతో పరిష్కరించడం.
గురువులకు ఇచ్చే గౌరవ మర్యాదలు హజ్రత్ అలీ (రజి) ‘నాకు ఒక్క అక్షరం నేర్పించిన వారికైనా నేను జీవితాంతం రుణపడి ఉంటాను’ అన్నారు. ఇస్లామిక్ సమాజంలో
ఉపాధ్యాయులకు అత్యున్నత గౌరవం ఇవ్వడమే కాకుండా, వారు ఏ లోటు లేకుండా బోధనా బాధ్యతలను నిర్వర్తించేలా తగిన పారితోషికం, సామాజిక భద్రత కల్పించడం సమాజ బాధ్యత.
అక్షరాలు నేర్పే గురువు జీవితానికి వెలుగు చూపే దివ్వె. ఆ దివ్వెను గౌరవించడం, వారి త్యాగాన్ని స్మరించుకోవడం సమాజం ప్రాథమిక ధర్మం.
ముహమ్మద్ ముజాహిద్
96406 22076