వేసవి కాలంలో ఓ ఊళ్లోని గుడి దగ్గర కోలాహలంగా ఉంది. ఎందుకంటే కొందరు కళాకారులు అక్కడ రెండువారాల పాటు మహాభారతంలోని పర్వాలన్నిటినీ వీధి నాటక రూపంలో ప్రదర్శించే వారు. గ్రామస్తులు సాయంకాలానికి పనులన్నీ ముగించుకుని గుడి దగ్గరికి వెళ్లి శ్రద్ధగా నాటకాలు చూసేవారు. సమీపంలోని గ్రామవాసులు కూడా నాటకాలు చూసేందుకు తరలి వచ్చేవారు. ద్రౌపది వస్ర్తాపహరణం, బకాసుర వధ, శ్రీకృష్ణ రాయబారం, దుర్యోధన వధ లాంటి ఘట్టాలను ప్రదర్శించే రోజుల్లో జనం కిక్కిరిసిపోయేవారు. ఒకరోజు గ్రామపెద్ద వీధి నాటకాన్ని చూడటానికి బయల్దేరుతుండగా ఓ రైతు పొలంలో ఉండటాన్ని గమనించాడు. ‘నాటకాలు చక్కగా జరుగుతున్నాయి. వచ్చి చూడరాదా!’ అని రైతును ఆహ్వానించాడు గ్రామపెద్ద. ‘అయ్యా! గతేడాది చూశాను.
మహాభారతం నాటకాన్ని ఎన్నిసార్లు చూసినా ఒకటే కదా. కొత్తగా ఏముంటుంది చూడటానికి’ అన్నాడు రైతు. గ్రామపెద్ద నవ్వి ‘పొలంలోని బావిలో నీళ్లు ఇంకిపోతే ఏం చేస్తావు?’ అని అడిగాడు. ‘పూడిక తీయిస్తాను. అప్పుడు కొత్త నీళ్లు వస్తాయి. చాలా తేటగాను, రుచిగానూ ఉంటాయ’ని బదులిచ్చాడు రైతు. ‘మళ్లీ ఎండిపోతే’ అన్నాడు గ్రామపెద్ద. ‘మళ్లీ పూడిక తీయించక తప్పదు కదా బాబూ’ అన్నాడు రైతు.
‘మహాభారతం ఎన్నిసార్లు విన్నా, చదివినా, ఆ నాటకాలను అనేకసార్లు చూసినా మనకు కొత్తగా ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి. బావిలోని అడ్డును పూడికతీత ద్వారా తొలగించినట్లు, భారతాన్ని మళ్లీ మళ్లీ వింటే అది మన మనసులోని అనేక అడ్డుపొరలను తొలగిస్తుంది. పూడిక తీసిన బావిలో వచ్చే తేటనీళ్లలా మన మనసు స్వచ్ఛంగా తయారవుతుంది. జీవన పోరాటంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకునే శక్తి మనకు లభిస్తుంది’ అని చెప్పి గ్రామపెద్ద అక్కడి నుంచి బయల్దేరాడు. అతని వెనుకే రైతు కూడా భారత నాటకం చూడటానికి బయల్దేరుతాడు.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821