పెండ్లయిన ఆడబిడ్డ 14 ఏండ్లపాటు పుట్టింటికి దూరంగా ఉండి, తర్వాత వెళ్లాల్సి వస్తే ఏమైనా ప్రత్యేక పూజలు చేయించాల్సి ఉంటుందా?
పెండ్లయిన ఆడబిడ్డ 14 ఏండ్లపాటు పుట్టింటికి రాకుండా ఉన్నా, ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు వెళ్లొచ్చు. ఈ విషయంలో కాలదోషానికి ఎలాంటి పరిహారాలు చేయించాల్సిన అవసరం లేదు. అయితే, 14 ఏండ్లు పుట్టింటికి దూరంగా ఉండాల్సి రావడం దోషమనీ, పరిహారాలు అవసరమని కొందరిలో ఏర్పడిన విశ్వాసానికి ఎలాంటి ఆధారమూ లేదు. అదేవిధంగా, వివాహమైన ఆడపిల్ల ఎప్పుడైనా పుట్టింటికి వస్తే తిరిగి అత్తవారింటికి వెళ్లాలంటే.. మంగళ, శుక్రవారాలలో నిషేధం అన్న అభిప్రాయమూ వ్యాప్తిలో ఉన్నది.
ఆడపిల్లను పుట్టింటి మహాలక్ష్మిగా భావిస్తారు. మంగళ, శుక్రవారాలు లక్ష్మీదేవికి చెందినవిగా విశ్వసిస్తారు. ఆ కారణంగా, ఆడబిడ్డ ఈ రెండు రోజులు అత్తవారింటికి బయల్దేరకూడదని ఆచారం ఏర్పడింది. అనివార్యంగా ఆ రోజుల్లో బయల్దేరాల్సి వస్తే.. ముందురోజు ఒక సంచి పక్కన మరో ఇంటిలో పెట్టి, బయల్దేరిన రోజు అక్కడికివెళ్లి, ఆ సంచి తీసుకుని వెళ్తే దోషం ఉండదని శాస్త్రం సూచించింది.