పతంజలి మహర్షి మానవాళికి ప్రసాదించిన వరం ‘యోగ’. భారతీయ తత్వశాస్ర్తాల్లో షట్ దర్శనాల్లో న్యాయం, వైశేషికం, వేదాంతం, మీమాంస, సాంఖ్యం తర్వాత యోగం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. యోగాభ్యాసం అంతిమలక్ష్యం మనసుపై,శరీరంపై పట్టు సాధించడమే! దేహం, మనసు, భావోద్వేగాలను సమతుల్యం చేయడమే యోగం. ‘యోగశ్చిత్తవృత్తి నిరోధః’ అన్నారు పతంజలి మహర్షి. చిత్తవృత్తులు నిరోధించి, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడమే యోగం. దానికి అష్టాంగ యోగం ఆధారం. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి ఇందులోని అంశాలు. అది ఆహార విహార నియమాలతో, ఇంద్రియ నిగ్రహాలతో సాగించాల్సిన సాధన.
యమనియమాల ద్వారా చెడు ఆలోచనలు, ప్రేరణలను నియంత్రించడం, మంచి ఆలోచనలను, అలవాట్లను అలవరచుకోవడం సాధ్యమవుతుంది. ఆసన, ప్రాణాయామాల ద్వారా దీర్ఘకాల ధ్యానానికి కావలసిన భంగిమలు, లయబద్ధమైన శ్వాసక్రియను నేర్చుకోవచ్చు. ప్రత్యాహార ధారణల ద్వారా విషయలోలత్వం కలిగించే వస్తువులపై నుంచి ఇంద్రియాలను మరల్చి ఏకాగ్రతను పెంచుకోవచ్చు. ధ్యాన సమాధి స్థితుల ద్వారా నిరంతరం ధ్యానం చేయడం, దాని ఫలితంగా మనసును పూర్తిగా ఆత్మలో లయం చేయడం కొనసాగించాలి.
మనలోని అంతర్గతశక్తి స్రవంతులను, అతీంద్రియ కేంద్రాలను తెరవగలిగే శరీర భంగిమలే ఆసనాలు. మన దేహం, శ్వాసక్రియ, మనసు.. ఇంకా వీటికి వెలుపల ఉన్న విషయాల గురించి తెలుసుకునేందుకు కావలసిన ఉపకరణాలు ఆసనాలు. వీటి వల్ల మనసుపై అదుపు సాధించి, తద్వారా బాధలను, ఆందోళనలను, ఒత్తిళ్లను అధిగమించవచ్చు. మనసును శాంతపరిచి సమతుల్యత సాధించడానికి, శరీరస్థితి నుంచి మొదలు పెట్టి మానసిక లేక భావోద్వేగ స్థితివరకు యోగాభ్యాసం ఉపకరిస్తుంది.
యోగ సాధనతో మనిషికి శాశ్వతమైన శారీరక, మానసిక స్వస్థత చేకూరుతుంది. శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసే 200 పైచిలుకు ఆసనాలు, భంగిమలు, శ్వాసక్రియలు యోగశాస్త్రంలో పతంజలి మహర్షి పేర్కొన్నారు. ముఖ్యంగా యోగాసనాలు ఎన్నో రుగ్మతలను రూపుమాపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు సుఖాసనం, స్వస్తికాసనం, పద్మాసనం, సిద్ధాసనాలు ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తాయి. ఎన్నో దీర్ఘకాల వ్యాధులను నియంత్రించడంలోనూ ఇవి ముఖ్యపాత్రను పోషిస్తాయి. మత్స్యేంద్రాసనం, సుప్తమత్స్యేంద్రియాసనంతో మధుమేహ వ్యాధిని నియంత్రించవచ్చు. అలాగే మత్య్సాసనం, సర్వాంగాసనంతో థైరాయిడ్ గ్రంధి వాపు తగ్గుతుంది. యోగాభ్యాసంతో విద్యార్థుల్లో ఆరోగ్యం, చురుకుదనమే కాకుండా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. యువతీయువకుల్లో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురయ్యే ఎన్నో మానసిక, శారీరక సమస్యలకు యోగ తరుణోపాయాన్ని చూపుతుంది. అయితే మనలో చాలా మంది ఆసనాలు వేయడమే యోగాభ్యాసమని భ్రమపడుతూ ఉంటారు. కానీ యమ, నియమాలు పాటిస్తూ ప్రాణాయామాన్ని కొనసాగిస్తూ ప్రత్యాహారం, ధారణ, ధ్యానంతో కూడిన సాధనే యోగాభ్యాసం. అప్పుడే మనసు అత్యున్నతమైన ‘సమాధి’ స్థితికి చేరుతుంది.
వేదకాలం కన్నా ముందే మనదేశంలో యోగ ఉనికి కనిపిస్తుంది. అతి ప్రాచీనమైన రుగ్వేదం యోగ విద్యను ప్రస్తావించటం విశేషం. క్రీ.పూ.3000 నాటి సింధులోయ నాగరికతలో యోగ సంప్రదాయానికి చెందిన తొలి ఆనవాళ్లు లభించాయట. అదే విధంగా శ్రీకృష్ణభగవానుడు బోధించిన ‘భగవద్గీత’లో యోగ సంప్రదాయంపై సాధికారిక వ్యాఖ్యానాలున్నాయి. స్వామి వివేకానంద 1893లో అమెరికా పర్యటన సందర్భంగా వెలువరించిన ప్రసంగాల్లో యోగాను ప్రస్తావించారు. ఈ ప్రసంగాలతో యోగసాధనలకు ప్రాచుర్యం ప్రారంభమైంది. ఆ తరువాత పరమహంస యోగానంద వంటి వారు విదేశాల్లో యోగాను విరివిగా ప్రచారం చేశారు.
“వీరోచిత కార్యం, తొణికిసలాడే జీవకళ, ఆశావహ దృక్పథం, ఆరోగ్యలక్షణాలు, సద్గుణ ప్రకాశం ఇవన్నీ శక్తికి సంకేతాలు. అందుకే ఎంతకాలం శరీరం నిలిచి ఉంటుందో అంతకాలం దేహం, మనసు దృఢంగా ఉండాలి” అంటారు స్వామి వివేకానంద. అలాంటి శరీరం, మనసు యోగసాధన వల్ల సుసాధ్యం అనడంలో అతిశయోక్తి లేదు.
…? ఎమ్.సంజయ్, యోగాశిక్షకులు
యోగాప్రాంగణం, నార్సింగ్, 9010104851