వేసవిలో మండుటెండల్ని చవిచూసిన మనం త్వరలోనే ఆహ్లాదకరమైన వర్షాకాలం వచ్చేస్తుందిలే అని ఆశించాం. అంచనాలకు తగ్గట్టుగానే సకాలంలో రుతుపవనాలు కేరళ మీదుగా దేశమంతా విస్తరించాయి. తొలకరి జల్లులు అందరినీ ఆహ్లాదపరిచాయి. కానీ, అంతలోనే భారీ వర్షాలతో వరద బీభత్సం మొదలైంది. అసాధారణ వర్షాల కారణంగా నదీనదాలు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇతర ప్రకృతి వైపరీత్యాలూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఒకపక్క సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, మరోపక్క ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఏ మాత్రం ఉపశమనాన్ని ఇవ్వటం లేదు. వాస్తవానికి పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా వాతావరణంలోని మార్పులను, భూగోళం చుట్టూ అలుముకుంటున్న అసాధారణ వాతావరణ పరిస్థితుల గురించి ప్రజలను హెచ్చరిస్తున్నారు. ప్రకృతి ఎందుకు ఉగ్రరూపం దాలుస్తున్నది? అసలు వాతావరణంలోని మార్పులు నిజమేనా?
కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే॥ (భగవద్గీత 13-20)
‘సృష్టిలో కార్య, కారణాలన్నిటికీ ప్రకృతే హేతువు. జగంలోని సుఖ దుఃఖానుభవములకు జీవుడే కారణం’ అంటుంది భగవద్గీత. మనం చూస్తున్న సకల విపత్తులకు, ఇతరత్రా ప్రభావాలకు ప్రకృతే కారణం. అయితే, ప్రకృతి ఇలాంటి విపత్కర పరిస్థితులు కలిగించి జీవులను ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తుంది? ఈ ప్రపంచంలోని సుఖదుఃఖాలకు జీవుడే కారణం. జీవులు అనుభవిస్తున్న ఈ విపత్తులు భగవంతుని లీల కాదు. జీవుడు తన స్వాతంత్య్రాన్ని ప్రకృతి వనరులను కొల్లగొట్టేందుకు వాడుకుంటున్నాడు. దానికి ప్రతిస్పందనగా ప్రకృతి విధిస్తున్న శిక్షలే ఈ వైపరీత్యాలు.
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః
అనేన ప్రసవిష్యధ్వమ్ ఏషవోస్త్విష్టకామధుక్ (భగవద్గీత 3-10)
ఈ ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు అందులో ఆనందంగా జీవించేందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేశాడు. ‘సృష్టి ఆరంభంలో భగవంతుడు.. మానవులను, దేవతలను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞాలతో సహా సృష్టించాడు. ఈ యజ్ఞాలు మీ సుఖజీవనానికి, ముక్తికి కావలసిన సమస్తాన్నీ ప్రసాదిస్తాయి’ అని ఆశీర్వదించాడు. యజ్ఞం ఆచరించడం ద్వారా సకలజీవులూ సంతోషంగా జీవించగలవని భగవంతుడు పేర్కొన్నాడు. ఎందుకంటే యజ్ఞాలు ప్రకృతి నుంచి మానవాళికి కావలసిన వాటన్నిటినీ ప్రసాదిస్తాయి. తగిన యజ్ఞాన్ని ఆచరిస్తూ మనిషి ప్రకృతికి సహకరించాలి. ఇంద్రియ తృప్తి కోసం మనిషి యజ్ఞాన్ని విస్మరించి, సహజ వనరులను కొల్లగొట్టడంలో నిమగ్నమైతే.. ప్రకృతి ప్రతిస్పందన వినాశనానికి దారితీస్తుంది.
ఈ యుగంలో విష్ణువు ప్రీత్యర్థం మనం ఆచరించదగిన యజ్ఞం ఏమిటి? ‘హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలమ్’- కేవలం హరినామం ద్వారానే ఈ కలియుగంలో యజ్ఞాన్ని అర్థవంతంగా నిర్వహించగలమని, ఇతరత్రా యజ్ఞాలు అంత ప్రభావవంతంగా ఉండవని శాస్త్రం వివరించింది. అందుకే, హరేకృష్ణ ఉద్యమం హరినామ యజ్ఞాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నది.
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరేరామ హరేరామ రామ రామ హరే హరే
ఈ మహా మంత్రాన్ని ప్రతిరోజూ 16 మాలలు జపించి ఆనందంగా జీవించండి. వాతావరణ మార్పుపై సిద్ధాంతకర్తలు సైతం మానవ కార్యకలాపాలకు, ప్రకృతి ఉగ్రతకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తున్నారు. ప్రజల విధ్వంసక కార్యకలాపాలను తగ్గించేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతున్నారు. ప్రజలు ప్రకృతికి సహకరించకపోతే, వాతావరణం సమతౌల్యత దెబ్బతిని అతివృష్టి, అనావృష్టికి దారితీస్తుంది. ఈ విపత్తు నుంచి బయటపడటానికి సంకీర్తన యజ్ఞాన్ని కొనసాగించండి. నామ సంకీర్తనం మనిషిలో ప్రకృతికి సహకరించే మనస్తత్తాన్ని సహజంగా అలవరుస్తుంది. కాబట్టి, నిత్యం హరినామ సంకీర్తన యజ్ఞాన్ని ఆచరిసూ ్తఆనందంగా జీవించండి.
-శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984