Gita Jayanti 2023 | భగవద్గీత మానవజాతికి ఒక మాన్యువల్ను అందించింది. ఆ పరిధిలో బతికేస్తే చాలు. బాధలుండవు. భయాలుండవు. కష్టాలున్నా.. వాటిని తట్టుకునే ధైర్యం వస్తుంది. సుఖాలున్నా.. వాటి పరిమితులు అర్థం చేసుకునే పరిణతి సాధ్యం అవుతుంది. యుద్ధంలోనూ శాంతిని అనుభవిస్తాం. కర్మ సిద్ధాంతమనేనావను తోలుతూ.. జీవనసాగరాన్ని ఈదేస్తాం. మనం చేయాల్సిందల్లా.. గీతాసారాన్ని జీర్ణించుకోవడమే.
కష్టాలు వచ్చినప్పుడు బేలగా మారొద్దు. సుఖాలు ఆలింగనం చేసుకున్నప్పుడు ఆదమరిచిపోవద్దు. కష్ట సమయాల్లో తాబేలు తనలోతాను ముడుచుకుని సమస్యల నుంచి తప్పించుకుంటుంది. నువ్వూ అంతే. ఇంద్రియాలకు అందకుండా స్థితప్రజ్ఞత అనే కవచాన్ని ధరించు.
గొప్పవాళ్లు చేసే పనులను ఇతరులు అనుసరిస్తారు. వారు నిర్దేశించిన ప్రమాణాలనే లోకం పాటిస్తుంది.
నిప్పును పొగ కప్పేస్తుంది. అద్దాన్ని ధూళి ఆక్రమిస్తుంది. మావి గర్భస్థ శిశువును కమ్ముకొని ఉంటుంది. అలానే జ్ఞానాన్ని మాయచుట్టుముట్టి ఉంటుంది. ఆ వలలో పడొద్దు. అమాయకుడిలా బతకొద్దు. అజ్ఞాన తిమిరాన్ని ఛేదించి జ్ఞాన దీపం వెలిగించు. జ్ఞానం.. సర్వోన్నతం, సర్వోత్తమం.
ఏం తింటున్నావ్? (ఆహారం), ఎక్కడెక్కడికి వెళ్తున్నావ్ (విహారం), ఏం చేస్తున్నావ్? (చేష్ట).. అన్నదీ ముఖ్యమే. మెలకువలోనే కాదు, నిద్రలోనూ నీ ఆలోచనలు పక్కదారి పట్టకూడదు. మానసిక, శారీరక క్రమశిక్షణ చాలా అవసరం.
అనుకోనిది జరిగితే కుంగిపోవద్దు. అనుకున్నది జరిగితే పొంగిపోవద్దు. దేనికీ ఆశపడకు. కర్తవ్యాన్ని దక్షతతో నిర్వర్తించు. పక్షపాతానికి తావివ్వవద్దు. నిందాస్తుతుల్ని సమానంగా స్వీకరించు. నిత్యం ధర్మామృతాన్ని సేవించు. ఆ స్థితికి చేరిననాడు.. నువ్వు నాకు అత్యంత ఇష్టుడివి అవుతావు.
మనవల్ల కాని పనులను ద్వేషించకూడదు. చేయగలిగిన పనులపై మమకారం పెంచుకోకూడదు. అప్పుడే మంచి గుణాలను కలిగి ఉంటాం. చేసే పనుల పట్ల సంశయం కూడా ఉండదు. త్యాగబుద్ధితో వ్యవహరించగలుగుతాం.
చిత్తం స్థిరంగా ఉన్నప్పుడే బుద్ధి లక్ష్యం దిశగా సాగుతుంది. చిత్తం స్థిరంగా లేకపోతే అనంతమైన కోరికలవైపు పరుగులు పెడుతుంది.
ఆకాశం నీకు ఆదర్శం. అన్నింటినీ తనలో ఇముడ్చుకునే గగనం.. దేనికీ అంటుకోదు. కాబట్టే, ఆ తేజస్సు, నిర్మలత్వం స్థిరంగా ఉంటాయి. సమాజంలోని ఏ మురికీ నిన్ను తాకకూడదు. వ్యామోహాలకు, రాగద్వేషాలకు అతీతుడిగా జీవించు.
ఎన్ని నదులు వచ్చి చేరినప్పటికీ గంభీరమైన, విశాలమైన సముద్రం ఎలాంటి అలజడికి లోను కాదు. అలానే కోరికలు ప్రవాహంలా నిరంతరం చుట్టుముట్టినా స్థితప్రజ్ఞుడు ఆందోళనకు లోనుకాడు. అలాంటివారే ప్రశాంతంగా ఉంటారు. కోరికల వెంటపరిగెడితే శాంతి దొరకదు.
ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి. తమకు తామే పతనం కాకుండా కాపాడుకోవాలి. మన ఆత్మనే మనల్ని నిలబెడుతుంది. అదే పడగొడుతుంది. మనకు మిత్రుడూ శత్రువూ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆత్మనే.
ప్రసన్నత, సౌమ్యత్వం, మౌనం, మనో నిగ్రహం, ఆలోచనల్లో స్వచ్ఛతను పాటించడమే మానసిక తపస్సు.
మంచి పనులను అశ్రద్ధతో చేయకూడదు. అలా చేస్తే అవి సత్ఫలితాలను ఇవ్వవు.
మన మనసు అస్థిరమైనది. చంచలమైనది. అలాంటి మనసును దృఢపర్చుకుని లక్ష్యం (భగవంతుడు) వైపు మళ్లేలా చూసుకోవాలి.
నిజమైన యోగికి తన పర అనే భేదాలు ఉండవు. అన్ని జీవులనూ తన రూపంలానే భావిస్తాడు. తనలో అన్ని జీవులకు కారణమైన చైతన్యాన్ని దర్శిస్తాడు.
నువ్వు సంపాదించాల్సింది మేడలు, మిద్దెలు కాదు. ధన, కనక, వస్తు, వాహనాదులు కాదు. నమస్కార పురస్కారాలూ కాదు. అచ్చమైన దైవీ సంపదల్ని పోగేసుకో. తేజస్సు, క్షమాగుణం, సంకల్పబలం, అహంకారం లేకపోవడం.. ఇవన్నీ దైవీ సంపదలే.
“గీతా జయంతి స్పెషల్ | భగవద్గీత అసలు ఎందుకు చదవాలి?”