యాదగిరిగుట్ట: భక్తుల కొంగుబంగారం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 6.05 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ (Giri Pradakshina) కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేరసాగింది. యాదగిరీశుడి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా చేపట్టిన ఈ కర్యాక్రమంలో జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు, ధర్మకర్త నరసింహా మూర్తి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ సందర్భంగా వ్రత మండపం, సంస్కృత పాఠశాల, అన్నదాన సత్రం, గిరిప్రదక్షిణ రోడ్డుకు ఇరువైపులా, మల్లాపురంలోని గోశాల తదితర ప్రాంతాల్లో రెండు వేల మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, అంతకుముందు వేదమంత్రోచ్ఛరణల నడుమ గర్భాలయంలోని మూలవరులకు అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గత నెల 18న గిరి ప్రదక్షిణ పునఃప్రారంభమైంది. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణను నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో గిరి ప్రదక్షిణను ప్రవేశపెట్టిన మొదటి ఆలయంగా యాదగిరిగుట్ట దేవస్థానం నిలిచింది. కాగా, స్థానిక భక్తులు గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సంప్రదాయం ఏండ్లుగా కొనసాగుతున్నది. అయితే 2016లో ఆలయాన్ని పునర్నిర్మించడంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో గిరిప్రదక్షిణ చేసేందుకు ఇబ్బందికరంగా మారింది. తాజాగా ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని అధికారులు పునరుద్ధరించారు.
 
 