వినాయకుడితో ఉపదేశం పొందిన జగన్మాత పార్వతీదేవి సంకష్టహర గణపతి వ్రతాన్ని ఆచరించి తన మనోభీష్టాన్ని పొందినట్టుగా తెలుస్తున్నది. శివుడు, ఇంద్రుడు, శ్రీరాముడు వంటి దేవతామూర్తులు కూడా దీనిని ఆచరించి శ్రేయస్సును పొందారు.
‘సర్వం చైవ గణాధిపాత్’ అనే స్మృతి ప్రమాణాన్ని అనుసరించి ‘ఎవరైతే గణపతిని ఆరాధిస్తారో వారు అనుకున్నదల్లా సాధిస్తారు’. వేదవ్యాసుడు లోక క్షేమానికై ఉపదేశించిన ఎన్నో వ్రతాలలో అత్యంత శ్రేష్టమైంది ‘సంకష్టహర గణపతి’ వ్రతం. ‘యేనోపాయేన సంకష్టం తరంతి భువి దేహినః’.
ఈ వ్రతం ఆచరించడం వల్ల తక్షణమే సమస్త సంకటాలన్నిటినీ తొలగించి, సుఖ సంపదలు కలుగజేస్తుందని ‘స్కాంద పురాణం’ వెల్లడించింది. దీనిని సాక్షాత్తు గణపతే తన తల్లి పార్వతీ దేవికి ఉపదేశించాడట. ఏడాదిలోని 12 నెలల్లో వచ్చే ప్రతి ‘చతుర్థి’కి ఒక ప్రత్యేకతను శాస్ర్తాలు ప్రతిపాదించాయి.
శ్రావణే బహుళే పక్షే చతుర్థ్యాంతు విధూదయే
గణేశం పూజయిత్వాతు చంద్రాయార్ఝ్యం ప్రదాపయేత్ ॥
అన్నిటిలోకీ ‘శ్రావణ కృష్ణ చతుర్థి’ నాడు ఈ వ్రతం మొదలుపెట్టడం మరింత విశేషం. ఈ రోజున వీలుకానివారు కనీసం మనసులో సంకల్పించుకొని, ఏ మాసంలోనైనా ‘కృష్ణ చతుర్థి’ రోజున ఆచరించవచ్చు. ఐతే, దీనిని ఒకసారి ప్రారంభిస్తే జీవితాంతం చేసుకోవాలని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఇది వీలు కాకపోతే కనీసం 21 సంవత్సరాలు లేదా 21 నెలలు అయినా వ్రతం ఆచరించడం శ్రేయస్కరం.
‘యదా యదా వ్రతం విప్రాః నరః ప్రాప్నోతి సంకటం
తదా తదా ప్రకర్తవ్యం వ్రతం సంకష్ట నాశనం’
ఎప్పుడు సంకటం ఏర్పడితే అప్పుడైనా సరే, ఈ వ్రతాన్ని చేసి ఆ సమస్యల నుంచి విముక్తులు కావచ్చు. గణపతితో ఉపదేశం పొందిన జగన్మాత పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి తన మనోభీష్టాన్ని పొందినట్టుగా తెలుస్తున్నది. శివుడు, ఇంద్రుడు, శ్రీరాముడు వంటి దేవతామూర్తులు కూడా దీనిని ఆచరించి శ్రేయస్సును పొందారు. ‘సంకష్ట హరణం నామ సంపత్తి సుఖదాయకం’. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారు సకల కష్టాల నుంచి విముక్తులై సమస్త సుఖసంపదలూ పొందుతారని వైదిక శాస్ర్తాలు నిర్ధారించాయి.
వ్రత విధానం:
విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ ధనమాప్నుయాత్
పుత్రార్థీ పుత్రమాప్నోతి, రోగీ రోగాత్ప్రముచ్యతే ॥
ఆ రోజు ఉదయమే నిద్ర లేచి, పవిత్ర భావనతో సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. సూర్యాస్తమయం తర్వాత అష్టదళ పద్మంతో అలంకరించిన మంటపంపై పూర్ణకలశ స్థాపన చేయాలి. శక్తి లోపం లేకుండా (బంగారం, రాగి, మట్టి) గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి, ధ్యానావాహనాది ఉపచారాలతో పూజ చేయాలి. అనంతరం చంద్ర దర్శనం చేసుకోవాలి. గణపతికి, చతుర్థీ తిథికి, చంద్రునికి అర్ఘ్యాలు సమర్పించాలి. గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్లు మొదలైనవి నివేదించి, తాము ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇతర విషయాల గురించి విచారణ చేయకుండా కుటుంబసభ్యులతో కలిసి గణపతి నామస్మరణ, భజనలు వంటి భక్తి కార్యక్రమాలను చేసుకోవాలి. అప్పుడే దీక్ష సార్థకమవుతుంది. ఇలా భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేసేవారు విద్య, ధనం, సంతానవృద్ధి తదితర శుభఫలితాలు పొందుతారు. దీంతోపాటు సమస్త రోగాల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు.
శాస్ర్తుల వేంకటేశ్వర శర్మ
98499 09165