ఓ రంజాన్ వసంతమా కాస్తంత నిదానంగా కదులు!
ఇంకా ఎన్నెన్నో మంచి పనులు చేయాలి!
అల్లాహ్ మెప్పు పొందాలి!
పాపాలకు పశ్చాత్తాపం చెందాలి!
జన్నత్ కోసం సంసిద్ధులవ్వాలి!
ఓ రంజాన్ వసంతమా కాస్తంత నిదానంగా కదులు!
Ramadan | రంజాన్ వసంతం చివరి దశకు చేరుకుంది! ఈ పవిత్ర నెల ఎడబాటును తలుచుకుంటూ ‘అల్ విదా మాహె రంజాన్’ అంటూ వీడ్కోలు గీతాలు పాడుకుంటున్నారు. అల్లాహ్ కారుణ్యాలను, కానుకలను మోసుకొచ్చిన ఈ నెల కొద్ది రోజుల్లో తరలి వెళ్లిపోతుండటంతో ముస్లింల హృదయాలు ద్రవించిపోతాయి. ఈ నెలలో చేసిన రోజా, నమాజులు, దానధర్మాలకు స్వీకృతి ప్రసాదించమని చివరి బేసి రాత్రుల్లో మేల్కొని అల్లాహ్ను వేడుకుంటారు. ఖురాన్ అవతరించిన ఐదు బేసి రాత్రులు తరావీ నమాజుతోపాటు తహజ్జుద్ నమాజులు కసరత్తుగా చేస్తారు. రంజాన్లోని ప్రతీ ఘడియనూ సద్వినియోగం చేసుకునేందుకు, అల్లాహ్ మెప్పు పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారు. వచ్చే రంజాన్ వరకూ మమ్మల్ని క్షేమంగా ఉంచమని దైవాన్ని వేడుకుంటారు.
ఈదుల్ ఫిత్ పర్వదినానికి ముందురోజు రాత్రి సప్తాకాశాల పైనుంచి భూమండలానికి దైవదూతలు దిగివస్తారు. ఈ రాత్రిని ‘లైలతుల్ జాయిజా’ అంటారు. నెల రోజులు పాటించిన రోజా, నమాజులు, దానధర్మాలకు గాను దైవదూతలు ప్రతిఫలమిచ్చే రోజు. ఒక్కో సత్కార్యానికి ఏడు రెట్ల పుణ్యఫలాన్ని లెక్కించి కర్మల పత్రంలో లిఖిస్తారు. ‘నా దాసులు రోజంతా ఆకలి దప్పులతో గడిపారు, రాత్రుళ్లు నిద్రను త్యాగం చేసి నమాజులో నిల్చున్నారు. ఇలాంటి దాసులకు నేను ముక్తిని ప్రసాదిస్తున్నాను’ అని అల్లాహ్ ప్రకటిస్తాడు. ఈ సంతోషంతోనే ముస్లింలంతా కలిసి ఈద్ రోజు ఈద్గాలో షుక్రానా నమాజు చేస్తారు.
పండుగ సంతోషాలను చుట్టుపక్కల నిరుపేదలతోనూ పంచుకోవడం సంప్రదాయం. పండుగ నమాజ్ కంటే ముందే పేదలు, అభాగ్యులు, వితంతువులకూ ఫిత్రా దానం చేసి వాళ్లనూ పండుగ సంతోషాల్లో భాగస్వాములను చేస్తారు. అసలు ఫిత్రా నుంచే ఫిత్ వచ్చింది. ఫిత్రాలు పంచుతారు కాబట్టే ఈదుల్ ఫిత్ అని పిలుస్తారు. ఇది ఆసాంతం పేదసాదల పండుగ. ఒక్కో వ్యక్తి రూ.80 నుంచి రూ.100 చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరున లెక్కకట్టి పేదలకు అందిస్తారు. ఆహార పదార్థాలు, వస్ర్తాలు, నగదు రూపంలో అయినా ఫిత్రా చెల్లించవచ్చు. పండుగ రోజు ఏ ఒక్క అభాగ్యుడూ చేయిచాచి అడగరాదన్నదే ఫిత్రా దానాల పరమార్థం అని ముహమ్మద్ ప్రవక్త
(స) సందేశం.
ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహ్మాలై) పరిపాలనా కాలమది. ఆయన పరిపాలనా కాలంలో మచ్చుకైనా ఒక్క పేదవాడు కూడా ఉండేవాడు కాదు. జకాత్ తీసుకునే వారే ఉండేవారు కాదు. అప్పు తీసుకునేవారూ లేరు. అంత సంక్షేమ పాలనను అందించేవారు. ఒకానొక ఏడాది రంజాన్ నెలలో ఆయన సతీమణి ఫాతిమా బిన్తె ‘ఏవండీ! పిల్లలు పండుగకు కొత్త బట్టలు కావాలంటున్నారు’ అని అడిగారు. ‘అయ్యో మన దగ్గర అంత స్తోమత లేదే’ అన్నాడు ఉమర్ అజీజ్. తల్లిచాటున నిల్చుని ఉన్న పిల్లల్ని చేరదీసి గుండెలకు హత్తుకున్నాడు. తన పిల్లలకు కొత్త దుస్తులు కొనలేకపోతున్నామే అని ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది.
ఉండబట్టలేక తన భర్తతో ‘మీ కోశాగారం నుంచి వచ్చే నెల జీతం ముందస్తుగా తీసుకోండి’ అని సలహా ఇచ్చింది. భార్య మాటలకు పునరాలోచనలో పడ్డాడు. ఆమె మాట కాదనలేక వేతనం కోసం కోశాధికారికి దరఖాస్తు రాశాడు అజీజ్. ఆ లేఖను చదివిన అధికారి ‘చక్రవర్తి గారూ! మీరు వచ్చే నెల వరకూ బతికుంటారని రుజువేదైనా ఇస్తారా’ అన్నాడట. ఆ మాటకు ఖలీఫా బోరున విలపించాడు. ఇంటికొచ్చి తన పిల్లలతో ‘పిల్లలూ మీ నాన్న నరకాగ్నికి ఆహుతి కావడం మీకిష్టమా?’ అని రోదిస్తూ అడిగాడు. అప్పుడు ఆ పిల్లలు ‘నాన్నా మనమంతా పండుగను నిరాడంబరంగా జరుపుకొందాం’ అని తండ్రిని ఓదార్చారు. చక్రవర్తి అయినా.. ప్రజాధనాన్ని తన అవసరాలకు వాడుకోరాదని ఈ కథ చెబుతున్నది.
పండుగ శుభాకాంక్షలు చెప్పే పద్ధతి ‘మీకూ మీ కుటుంబ సభ్యులకూ ఈద్ ముబారక్’ ‘ఈ ఈద్ శుభదినాన అల్లాహ్ మీపై కారుణ్య వర్షం కురిపించుగాక’ ‘మీరు రంజాన్ సంతోషాలను ఏటా మళ్లీ మళ్లీ జరుపుకోవాలి’ ‘ఈద్ శుభ సంతోషాన మీకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు’ ‘మీకు ఈద్ శుభాకాంక్షలు. మీ రంజాన్ ఆరాధనలను అల్లాహ్ తన కారుణ్యంతో స్వీకరించాలని ప్రార్థిస్తున్నాను’ అని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేయాలి.
రంజాన్ నెల రోజా రోజులు నిగ్రహాన్ని నేర్పుతాయి. పరోపకారాన్ని బోధిస్తాయి. సానుభూతిని తెలియజేస్తాయి. దేవుడు చూస్తున్నాడన్న తలంపును తట్టిలేపుతాయి కాబట్టి 14 గంటలపాటు ముస్లింలు అన్నపానీయాలకు దూరంగా ఉంటారు. ముహమ్మద్ ప్రవక్త ద్వారా అల్లాహ్ తరఫు నుంచి ఖురాన్ గ్రంథం లభించినందుకు కృతజ్ఞతగానే ఈ ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఖురాన్ అంటే మాటిమాటికీ చదివే గ్రంథమని అర్థం. ఈ పవిత్ర గ్రంథం ధరణిపై కల్లోలాన్ని అస్సలు సహించదు. అశాంతిని కోరుకోదు. దగా, మోసం, అబద్ధం, దౌర్జన్యాలను సహించదు. ఖురాన్ ప్రేమ సందేశాన్నిస్తుంది. తల్లిదండ్రులను సేవించి స్వర్గానికి బాటలు పరుచుకోవాలని తాకీదు చేస్తుంది. బంధువుల అనాథల హక్కులు నెరవేర్చాలని హెచ్చరిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జీవితానికి ఆదర్శవంతమైన దారి చూపుతుంది.
1. పండుగ పూట తెల్లవారుజామునే లేవడం ప్రవక్త సంప్రదాయం.
2. తల స్నానం (గుసుల్ స్నానం) చేయాలి. మిస్వాక్ పుల్లతో దంతధావనం చేసుకోవాలి.
3. అత్తరు పరిమళాలు పూసుకోవాలి.
4. ఈద్ నమాజుకు ముందు తియ్యని
పదార్థాన్ని సేవించడం గానీ, బేసి సంఖ్యలో ఖర్జూరాలు గానీ తినాలి.
5. ఈద్ నమాజు కన్నా ముందే ఫిత్రా
దానం చేయాలి.
6. పిల్లలకు కానుకలు ఇవ్వాలి. బంధుమిత్రులకు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవాలి.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076